Categories: TOP STORIES

హ్యుంద‌య్ పెట్టుబ‌డుల‌తో జ‌హీరాబాద్ రియాల్టీలో జోష్‌?

సంగారెడ్డి-జహీరాబాద్ ప్రాంతానికి మహర్ధశ పట్టనుందా అంటే ఔన‌నే స‌మాధానం వినిపిస్తుంది. ఇప్పటికే ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ది చెందిన ఈ ప్రాంతంలో మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ తమ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్న‌ది. దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుంద‌య్ మోటార్ కంపెనీ.. దాని భారతీయ విభాగమైన హ్యుంద‌య్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్‌ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కార్ల మెగా టెస్ట్‌ సెంటర్‌ను స్థాపించనుంది. ఇందులో ఆటోమోటివ్‌ టెస్ట్‌ ట్రాక్‌ సదుపాయంతో పాటు.. విద్యుత్‌ వాహనాలు సహా అత్యాధునిక కార్ల తయారీ సౌకర్యం ఉంటుంది.

జహీరాబాద్ లోని నిమ్జ్ లో 675 ఎకరాల్లో సుమారు రూ.8,528 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనుంది హ్యుంద‌య్. ఇక్కడ తొలుత ‘బల్ ఇన్నోవేషన్‌ రీసెర్చ్ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌’ ను మాత్రమే స్థాపించాలని హ్యుంద‌య్‌ మోటార్స్‌ భావించినా.. తాజాగా నిమ్జ్‌లో టెస్టింగ్‌ కార్ల తయారీ పరిశ్రమను కూడా ప్రారంభించాలని నిర్ణయించుకుంది.

జహీరాబాద్ లో హ్యుంద‌య్ కార్ల మెగా టెస్ట్‌ సెంటర్‌ ద్వారా సుమారు 4,200 మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. హ్యుంద‌య్ కంపెనీ ప్రతినిధులు ఈ నెలలోనే రాష్ట్రానికి రానున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఆ సందర్భంగా ప్రభుత్వంతో కలిసి తమ కంపెనీ తెలంగాణలో ప్రారంభించనున్న ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న ఇంజినీరింగ్‌ కేంద్రం పునరుద్ధరణ, ఆధునికీకరణ, విస్తరణకు సైతం హ్యుంద‌య్ చర్యలు ప్రారంభించింది.

ALSO READ: అపార్ట్ మెంట్ లోనా.. ఫ్లాటా లేక విల్లానా?

ఈ క్రమంలో సంగారెడ్డి జహీరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు భవిష్యత్తులో ఊహించలేనంతగా మారిపోనున్నాయని రియాల్టీ వర్గాలు అంటున్నాయి. ట్రిపుల్ ఆర్ మార్కింగ్ తో ఇప్పటికే సంగారెడ్డి సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంతమేర ఊపందుకుంది. ఇక ఇప్పుడు హ్యుంద‌య్ కార్ల మెగా టెస్ట్‌ సెంటర్‌ తో సంగారెడ్డి, జహీరాబాద్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నివాస, వాణిజ్య రియాల్టీ ప్రాజెక్టులకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

సంగారెడ్డి జహీరాబాద్ మధ్య మొన్నటి వరకు నేషనల్ హైవే ఫెసింగ్ తో ఎకరం 1.5 కోట్ల రూపాయల నుంచి 2.5 కోట్ల రూపాయలు ఉండగా.. రీజినల్ రింగ్ రోడ్డు జంక్షన్ ఏర్పాటు, హ్యుంద‌య్ కార్ల టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు కానుండటంతో ఇక్కడ ఎకరం 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెరిగిందని చెబుతున్నారు. జాతీయ రహదారి నుంచి 5 -10 కిలోమీటర్ల రేడియస్ లో ఎకరం 70 లక్షల నుంచి కోటీ రూపాయలు మేర ధరలు ఉన్నాయి. రీజినల్ రింగ్ రోడ్డు పనులతో పాటు హ్యుంద‌య్ కార్ల టెస్టింగ్ సెంటర్ పనులు మొదలైతే భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సంగారెడ్డికి సమీపంలోని సదాశివపేట, ఆరూర్, బుదేరా, జహీరాబాద్ వరకు ఇప్పటికే భారీ స్థాయిలో రియల్ వెంచర్లు వెలిశాయి. ఇక ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ చేంజర్, హ్యుంద‌య్ కార్ల టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు అవుతుండటంతో భారీగా వెంచర్లు వేసేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుతం సంగారెడ్డి లో డీటీసీపీ లేఅవుట్ లో రియాల్టీ ప్రాజెక్టు, ప్రాంతాన్ని బట్టి చదరపు గజం 12 వేల రూపాయల నుంచి 30 వేల రూపాయల వరకు ధరలున్నాయి. ఇక సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో చదరపు గజం 8 వేల రూపాయల నుంచి 22 వేల రూపాయల వరకు ప్లాట్ల ధరలున్నాయి. సంగారెడ్డి సమీపంలోని సదాశివపేట్ లో చదరపు గజం 6 వేల నుంచి మొదలు 14 వేల రూపాయల వరకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ తరువాత జహీరాబాద్ లో డీటీసీపీ లేఆవుట్లలో చదరపు గజం 12 వేల నుంచి 26 వేల రూపాయల వరకు ధరలున్నాయి.

పటాన్ చెరు నుంచి మొదలు సంగారెడ్డి, జహీరాబాద్ వరకు భారీ ఎత్తున పలు రంగాల పరిశ్రమలు ఉన్నాయి. ఇక ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ శాటిలైట్ టౌన్ షిప్ లను ఏర్పాటు చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. అంతే కాకుండా ఈ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్లు, లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫార్మా కంపెనీలు రీజినల్ రింగ్ రోడ్డుకు చేరువగా తమ ల్యాబ్‌లు, ఫ్యాక్టరీలను తరలించనుండటంతో ఇక్కడ మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయి.

ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో సంగారెడ్డి జంక్షన్ కనివినీ ఎరగుని రీతిలో అభివృద్ది చెందనుందని రియాల్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డుతో ఇటు హైదరాబాద్ కు, అటు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగనుండటంతో సామాన్య, మధ్య తరగతి వాళ్లు సంగారెడ్డి, జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో క్రమంగా సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వరకు నిర్మాణ ప్రాజెక్టులతో పాటు భారీ స్థాయిలో వెంచర్లకు అవకాశం ఉంటుందని రియాల్టీ వర్గాలు చెబుతున్నాయి.

This website uses cookies.