Categories: LATEST UPDATES

టైర్-2 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గాయ్

దేశంలోని టాప్ 15 టైర్-2 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 8 శాతం మేర ఇళ్ల విక్రయాలు తగ్గి, 43, 781కి పరిమితమయ్యాయి. అయితే, అమ్మకాలు విలువ 6 శాతం పెరిగి రూ.40,443 కోట్లకు చేరుకున్నాయి. ఈ మేరకు వివరాలను రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో అమ్ముడైన మొత్తం నివాస యూనిట్లు 47,378 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది 43,781కి తగ్గాయి.

అయితే, మొత్తం అమ్మకాల విలువ 2024 మొదటి త్రైమాసికంలో రూ.38,102 కోట్లు ఉండగా.. 2025 మొదటి త్రైమాసికంలో రూ.40,443 కోట్లకు పెరిగింది. జనవరి-మార్చి త్రైమాసికంలో సరఫరా తగ్గడం వల్లే ఈ క్షీణత సంభవించిందని ప్రాప్‌ఈక్విటీ సీఈఓ సమీర్ జసుజా పేర్కొన్నారు. ఈ ధోరణి టైర్-1 నగరాల్లో కూడా కనిపించిందని చెప్పారు. టైర్ 2 నగరాల్లో డిమాండ్ బలంగా ఉందని, కానీ ఈ త్రైమాసికంలో కొత్త లాంచ్‌లు లేకపోవడం ఆక్యుపెన్సీపై ప్రభావం చూపిందని వివరించారు.

ALSO READ: కోకాపేట్‌లో వేలానికి ఒకే?

బలమైన సామాజిక మౌలిక సదుపాయాలు, మెరుగైన కనెక్టివిటీ, ఐటీ, తయారీ వంటి రంగాలలో ఉద్యోగ వృద్ధి డిమాండ్‌ను పెంచుతున్నాయని తెలిపారు. కాగా, 2025 మొదటి త్రైమాసికంలో భోపాల్, భువనేశ్వర్ వంటి మధ్య, తూర్పు పట్టణాల్లో 18 శాతం తగ్గుదల కనిపించగా.. దక్షిణానికి చెందిన విశాఖ, కొచ్చి, కొయంబత్తూరు వంటి నగరాల్లో 12 శాతం క్షీణత నమోదైంది. లక్నో, జైపూర్, మొహలి వంటి ఉత్తర భారత నగరాల్లో 14 శాతం.. అహ్మదాబాద్, సూరత్, వడోదర తదితర పశ్చిమ నగరాల్లో  6% తగ్గుదల కనిపించింది. మొత్తమ్మీద క్షీణత ఉన్నప్పటికీ, పశ్చిమ భారతంలో అమ్మకాలు బాగానే ఉన్నాయి. మొత్తం యూనిట్లలో 79%, మొత్తం అమ్మకాల విలువలో 74% వాటా పశ్చిమ నగరాలదే కావడం విశేషం. అహ్మదాబాద్ ఈ ప్రాంతంలో అగ్రస్థానంలో ఉంది. రూ.13,565 కోట్ల విలువైన 14,583 యూనిట్లు ఇక్కడ అమ్ముడయ్యాయి.

విక్రయాలు గతేడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే కేవలం ఒక శాతమే తక్కువ. మరోవైపు తీవ్రంగా అమ్మకాలు తగ్గిన టైర్-2 నగరాల్లో విశాఖపట్నం అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ విక్రయాలపరంగా 37 శాతం, విలువపరంగా 35 శాతం తగ్గుదల నమోదైంది. సూరత్, వడోదర, నాగ్ పూర్ వంటి ఇతర నగరాల్లో కూడా అమ్మకాలు తగ్గాయి. అయితే వడోదర, నాగ్‌పూర్ విలువలో స్వల్పంగా 1% తగ్గుదల మాత్రమే నమోదైంది. కాగా, రాజధానుల్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ముఖ్యంగా ఆరు రాష్ట్ర రాజధానులు – గాంధీనగర్,  జైపూర్, భువనేశ్వర్, లక్నో, గోవా, భోపాల్ నగరాలు మొత్తం మార్కెట్ కంటే మెరుగ్గా పనిచేశాయి. అవి అమ్మకాల పరిమాణంలో కేవలం 5% తగ్గుదల మాత్రమే నమోదు చేయగా.. విలువలో 17% పెరుగుదలను నమోదు చేశాయి. ఈ నగరాలు మొత్తం యూనిట్ అమ్మకాలలో 25%, మొత్తం లావాదేవీ విలువలో 30% వాటా కలిగి ఉన్నాయి.

This website uses cookies.