HMDA preparing to auction in Kokapet lands
తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో మరో కీలక చర్చ జరిగింది. వచ్చే రెండు, మూడు నెలల్లో రూ. 5 నుంచి రూజ 10 వేల కోట్లను భూ అమ్మకాల ద్వారా సమకూర్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా హైదరాబాద్లో భూముల వేలం మళ్లీ మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. హెచ్ఎండీఏ ద్వారా ఈసారి రూ.5 వేల కోట్లు, హౌసింగ్ భూములను అమ్మి మరో 5 వేల కోట్లను టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పటి వరకు హెచ్ఎండీఏ చేతిలో కోకాపేట్, ఉప్పల్ భగాయత్ వంటి ప్రాంతాల్లో ప్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. హౌసింగ్ బోర్డు పరిధిలో ఇప్పటికిప్పుడు అమ్మేందుకు సిద్ధంగా ఉన్న 1250 ప్లాట్లను కూడా వేలం వేసేందుకు కేబినెట్ కూడా ఆమోదం చెప్పింది.
భూముల అమ్మకాల్లో భాగంగా మొదటి దశలో.. గతంలో భూములు వేలం వేసినప్పుడు కొనుగోలుదార్ల నుంచి ఎక్కువ స్పందన వచ్చిన ప్రాంతాల్లో మిగిలిపోయిన ప్లాట్లను వేలం వేయనున్నారు. వాటిని అమ్మిన తర్వాత.. రెండు, మూడు దశల్లో వేరే ప్రాంతాల్లోని స్థలాలను వేలం వేసేందుకు నివేదించారు. మొదటి దశలో గతంలో భూములు వేలం వేసినప్పుడు తుర్కయంజాల్, ఉప్పల్ భగాయత్, కోకాపేట్ నియోపొలిస్, ఇన్ముల్నర్వ ప్రాంతాల్లో భూములు వేలం వేయడం ద్వారా అప్పటి ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం వచ్చింది. అందుకే ఇప్పుడు కూడా ముందుగా మొదటి దశలో భాగంగా ఈ ప్రాంతంలోని ప్లాట్లను వేలం వేయనున్నారు.
కోకాపేట్లో భూముల కొనుగోలుకు విదేశాల్లో ఉన్న వారితో పాటుగా.. దేశంలోని అనేక నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటీ పడ్డాయి. ఇప్పుడు కూడా అదే స్థాయిలో స్పందన ఉంటుందని భావిస్తున్నారు. ఉప్పల్ భగాయత్లో కూడా కొనుగోలుకు మంచి స్పందన లభించడంతో.. ఇక్కడ రెండు దశల్లో ప్లాట్లను విక్రయించారు. ఇక మొదటి దశ పూర్తయిన తర్వాత.. రెండూ, మూడు దశల్లో మరో పది ప్రాంతాల్లో స్థలాల వేలం వేయనున్నారు. కోకాపేట్, ఉప్పల్ భగాయత్, తుర్కయాంజల్, ఇన్ముల్నర్వ నాలుగు ప్రాంతాల్లో హెచ్ఎండీఏ రైతుల నుంచి భూములు సేకరించింది. ఇలా సేకరించిన భూములపై రైతులకు 60 శాతం ప్లాట్లను కేటాయించింది. మిగిలిన 40 శాతం ప్లాట్లు హెచ్ఎండీఏకు లభించాయి. హెచ్ఎండీఏ దగ్గర మొత్తం ప్లాట్లు 1,141 ఉండగా.. వీటిల్లో రైతులకు కేటాయించినవి 696. మిగిలిన వాటిల్లో ఇప్పటి వరకు విక్రయించినవి 59 కాగా, అమ్మకానికి 385 ప్లాట్లు రెడీగా ఉన్నాయి. త్వరలోనే వీటిని వేలం వేసేందుకు రెడీ అవుతున్నారు.
1250 ప్లాట్లతో వేల కోట్లు
రాష్ట్ర హౌసింగ్ బోర్డు తమ ఆధీనంలోని వివాదరహిత ప్లాట్లను వేలం వేయడానికి సిద్ధమవుతోంది. అన్ని జిల్లాల్లో గుర్తించిన ఈ ప్లాట్ల వివరాలను అధికారులు సిద్ధం చేశారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి, ఈ వేలం ద్వారా భారీగా రెవెన్యూ సమకూర్చుకోవాలని ప్రభుత్వం అంచనా వేస్తోంది. హైదరాబాద్తో పాటు జోగుళాంబ గద్వాల, జడ్చర్ల, ఇతర జిల్లా కేంద్రాల్లోని ప్లాట్లను వేలం వేయనున్నారు. అధికారులు గుర్తించిన ప్లాట్లలో కోర్టు వివాదాలు లేనివి, ఎలాంటి కేసులు లేనివి, కమర్షియల్ ఏరియాల్లో ఉన్నవి ఉన్నాయి. మొత్తం 1250 జాగాలు (ప్లాట్లు) ఉండగా, ఇవి సుమారు 3.22 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా, హైదరాబాద్లోని కూకట్పల్లి సమీపంలోని ఖైతలాపూర్లోనే 250కి పైగా ప్లాట్లు ఉన్నట్లు సమాచారం. ఈ ప్లాట్లకు మార్కెట్ విలువ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో హౌసింగ్ బోర్డుకు వేల కోట్ల విలువైన వందల ఎకరాల భూములు, ప్లాట్లు ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డితో పాటు మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ జిల్లాల్లో ఈ భూములు అధికంగా ఉన్నాయి. అన్యాక్రాంతం కాకుండా వీటిని పరిరక్షించడానికి హౌసింగ్ బోర్డు చర్యలు చేపట్టింది. ప్లాట్ల చుట్టూ గోడలు, ఫెన్సింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, అవి హౌసింగ్ బోర్డు భూములు అని తెలియజేస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ చర్యల ద్వారా ప్రభుత్వ ఆస్తులను కాపాడటంతో పాటు, వేలం ద్వారా సమీకరించిన నిధులతో ఇందిరమ్మ వంటి ప్రజా సంక్షేమ పథకాలకు ఊతం ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భూముల అమ్మకాలపై గురువారం జరిగిన కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పాటు గ్రేటర్, హెచ్ఎండీఏ పరిధి కొన్ని పథకాలు, ప్రాజెక్టులకు నిధులు చాలా అవసరం. అందుకే ఈ భూముల మీద నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం.. వీటిని అమ్మేందుకు ఆమోదం చెప్పినట్లు తెలుస్తున్నది.
This website uses cookies.