దేశంలో కార్యాలయ స్థలాల అద్దెలు పెరిగాయి. ఏడు ప్రధాన నగరాల్లో గతేడాది ఆఫీసు అద్దెలు 4 శాతం నుంచి 8 శాతం మేర పెరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ తన తాజా నివేదికలో వెల్లడించింది.
కొత్త వ్యాపారాలు, కంపెనీల విస్తరణ కారణంగా కార్యాలయాల స్థలాలకు గణనీయమైన డిమాండ్ నెలకొందని.. దీంతో అద్దెలు పైకి ఎగబాకాయని పేర్కొంది. నెలవారీగా కార్యాలయ అద్దెల్లో ఢిల్లీ 8.2 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. చెన్నై 7.7%, ముంబై 6.7% బెంగళూరు 4.7%, పూణే 4.5%, హైదరాబాద్ 4.4%, కోల్కతా 3.8 శాతం వృద్ధితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నగరాల వారీగా చూస్తే ముంబైలో చదరపు అడుగు నెలవారీ సగటు అద్దె 1.6 డాలర్లుగా ఉంది. బెంగళూరులో 1.1 డాలరు, పూణేలో 1 డాలరు, ఢిల్లీలో 0.9 డాలరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో 0.8 డాలరు, పూణేలో 0.6 డాలరుగా ఉంది. అంతర్జాతీయంగా ఎనిమిది పెద్ద ఓవర్సీస్ మార్కెట్లలో ఆఫీసు అద్దె వృద్ధి మిశ్రమంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
గతేడాది న్యూయార్క్ లో సగటు ఆఫీసు అద్దె 1.3% క్షీణించింది. అక్కడ నెలకు చదరపు అడుగుకు అద్దె 7.5 డాలర్లుగా ఉంది. షాంఘైలో 6.8% తగ్గి 2.8 డాలర్లుగా, హాంగ్కాంగ్లో 6% క్షీణించి 5.9 డాలర్లుగా, సియాటిల్లో 1.9% పడిపోయి 4.7 డాలర్లుగా నెలవారీ సగటు అద్దెలు ఉన్నాయి. లండన్లో మాత్రం సగటు ఆఫీసు అద్దెలు 8.6% పెరిగాయి. అక్కడ నెలకు చదరపు అడుగు అద్దె 8.6 డాలర్లుగా ఉంది. మియామీలో 7.3% పెరిగి 5.1 డాలర్లుగా, బోస్టన్లో 1.2% ఎగిసి 5.5 డాలర్లుగా, సింగపూర్ 0.5 శాతం పెరిగి 7 డాలర్లుగా నెలవారీ సగటు అద్దెలు ఉన్నాయి. ‘‘భారత్లో అధిక జనాభా, భారీ వినియోగదారుల బేస్, వేగవంతమైన పట్టణీకరణతో పాటు టెక్నాలజీ, ఫైనాన్స్ రంగాల్లో తక్కువ ధరలకు నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి లభిస్తుంది. అందుకే అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఆఫీసు స్పేస్ కోసం భారత్ వైపు దృష్టి సారిస్తున్నాయి’’ అని వెస్టియన్ సీఈవో శ్రీనివాస్ రావు తెలిపారు.
This website uses cookies.