- గోద్రెజ్ ప్రాపర్టీస్కు అనుమతి ఇవ్వొద్దు
- ఛానెల్ పార్ట్నర్ల ద్వారా ప్రీలాంచుల్లో ఫ్లాట్ల విక్రయం
- ప్రాజెక్టు విలువలో 10 శాతం జరిమానా విధించాలి
- ఇలా చేస్తేనే ప్రీలాంచులకు అడ్డుకట్ట
దేశంలోనే పేరెన్నిక గల నిర్మాణ సంస్థలు.. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ప్రీలాంచ్లు చేయని రియల్ సంస్థలు.. పనిగట్టుకుని మరీ హైదరాబాద్లో అక్రమంగా ఫ్లాట్లను అమ్ముతున్నాయి. ఇందుకు కారణం.. పురపాలక శాఖ కార్యకలాపాల్ని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రత్యేకంగా మంత్రి లేకపోవడం.. ఈ శాఖకు ఉన్న ప్రధాన కార్యదర్శిని ఇటీవల ట్రాన్స్ఫర్ చేయడం.. టీజీ రెరాకు ఛైర్మన్గా చురుకైన యువ ఆఫీసర్ లేకపోవడం..
టీజీ రెరా ట్రిబ్యునల్కు శాశ్వత ఛైర్మన్ను నియమించకపోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. కర్ణుడి చావుకి లక్ష కారణాలు అన్నట్లు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర నుంచి హైదరాబాద్ ప్రీలాంచ్ మోసాలకు రాజధానిగా మారింది. టీజీ రెరా ఛైర్మన్, ఇతర సభ్యులు కళ్లు మూసుకోవడం వల్లే.. ఏడాది నుంచి ప్రీలాంచులు చేసే బిల్డర్ల సంఖ్య పెరిగింది. మరి, మోసపూరిత ప్రీలాంచుల్ని అరికట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి కఠిన నిర్ణయాల్ని తీసుకుంటారా?
హైదరాబాద్ అంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు చెందిన నిర్మాణ సంస్థలకు ఎప్పటికీ చిన్నచూపే. ఇక్కడి టీజీ రెరా కళ్లు మూసుకుని పని చేస్తుందని.. ఆమ్యామాలిస్తే మేనేజ్ చేయవచ్చని భావిస్తాయోమే తెలియదు కానీ.. ఇతర మెట్రో నగరాల్నుంచి హైదరాబాద్ విచ్చేసే ప్రతి నిర్మాణ సంస్థ.. ఇక్కడి ఇంటి కొనుగోలుదారులకు ప్రీలాంచ్లో ఫ్లాట్లను విక్రయిస్తున్నాయి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ముద్దుగా పిలిచినా, ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ అంటూ పేరు పెట్టినా.. రెరా రాక ముందే స్థానిక బయ్యర్ల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నాయి.
ముఖ్యంగా, పలు నగరాలు, విదేశాల్లో పని చేసొచ్చిన ఐటీ నిపుణులకు దేశంలోని ప్రధాన నిర్మాణ సంస్థల పేర్లు తెలిసే ఉంటుంది. అందుకే, ఆయా సంస్థలు ఏం చేస్తున్నాయంటే.. వీరందరినీ ఆకట్టుకునేందుకు ప్రీలాంచ్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మరి, రెరా నిబంధనలకు ప్రీలాంచులు విరుద్ధమని తెలిసినా.. టీజీ రెరా ఎందుకు ఇలాంటి సంస్థలపై కఠినంగా వ్యవహరించడం లేదు?
గంటలో తెలిసిపోతుందా?
యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్ట్రాగ్రామ్ వంటి వాటిని ఒక గంటసేపు కూర్చోని చూస్తే.. హైదరాబాద్లో ప్రీలాంచుల్లో ఫ్లాట్లను అమ్మే వందలాది మంది ఛానెల్ పార్ట్నర్లు, రియల్టర్లు, బిల్డర్ల వివరాలు కళ్ల ముందే కనిపిస్తాయి. కానీ, టీజీ రెరా ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఈ పనిని కింది సిబ్బందికి కేటాయిస్తే.. ప్రతిరోజు ఒక గంటసేపు చూస్తే చాలు చాలు.. ఆరంభంలోనే వాటికి అడ్డుకట్ట వేయవచ్చు. మధ్యతరగతి ప్రజలు మోసపోకుండా మొదట్లోనే కట్టడి చేయవచ్చు. కానీ, ఇలాంటి అంశాల్ని అటు పురపాలక శాఖకు కానీ ఇటు టీజీరెరాకు కానీ పట్టించుకోదు. అందుకే, హైదరాబాద్ ప్రీలాంచ్ మోసాలకు రాజధానిగా మారిపోయింది.
ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడాలంటే.. ఛానెల్ పార్ట్నర్ల ద్వారా ప్రీలాంచుల్లో ఫ్లాట్లు, విల్లాలు, ప్లాట్లను విక్రయించే స్థానిక, జాతీయ నిర్మాణ సంస్థలకు.. టీజీ రెరా అనుమతిని మంజూరు చేయకూడదు. అంతకంటే ముందు, ఆయా సంస్థలపై ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానాను విధించాలి. ఇటీవల కాలంలో హైదరాబాద్లో ప్రీలాంచులో ఫ్లాట్లను విక్రయిస్తున్న గోద్రెజ్, ప్రెస్టీజ్, ట్రంప్ టవర్స్ వంటి సంస్థలకు రెరా అనుమతిని మంజూరు చేయకూడదు. అప్పుడే ఏ సంస్థ అయినా ముందస్తు అమ్మకాలు చేపట్టడానికి సాహసించవు.