హైదరాబాద్లో బిల్డర్లు స్కై స్క్రేపర్లను హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కోకాపేట్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా నిర్మిస్తున్నారు. ఆ తర్వాత కొండాపూర్, కూకట్పల్లి, మియాపూర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్ని ఎంచుకుంటున్నారు. సెంట్రల్ హైదరాబాద్లోనూ పలు కంపెనీలు ఆకాశహర్మ్యాల్ని నిర్మిస్తున్నాయనే సంగతి మీకు తెలుసా?
సెంట్రల్ హైదరాబాద్ అంటేనే బిజినెస్ ఏరియా. ప్రధానంగా పంజాగుట్ట, సోమాజిగూడ, బేగంపేట, హిమాయత్ నగర్, అబిడ్స్, ఖైరతాబాద్ ప్రాంతాలు వంటివన్నమాట. బడా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఎక్కువగా ఈ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. అక్కడ బిజినెస్ చేసే చాలా మంది వ్యాపారులు.. ఇరుకైన రహదారుల్లోని పాత ఇళ్లల్లోనే నివసిస్తున్నారు. వీరంతా గచ్చిబౌలి, కోకాపేట్ వంటి ప్రాంతాలకు రాలేరు. అక్కడ ఉండలేరు. అందుకే, ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని, పలు నిర్మాణ సంస్థలు సెంట్రల్ హైదరాబాద్లో ఆకాశహర్మ్యాల్ని నిర్మిస్తున్నాయి.
ALSO READ: హైడ్రా వర్సెస్ జీహెచ్ఎంసీ.. పెత్తనం కోసం కొట్లాట..
ఉదాహరణకు ప్రణవా గ్రూప్ ను తీసుకుంటే.. పంజాగుట్ట మెయిన్ రోడ్డులో ప్రణవ వన్ పేరుతో 19 అంతస్తుల్లో వాణిజ్య సముదాయం, 24 అంతస్తులో నివాస సముదాయాన్ని నిర్మించింది. అబిడ్స్ లో మీనాక్షి నిర్మాణ సంస్థ 134 మీటర్ల ఎత్తులో 132 లగ్జరీ గృహాలను 40 అంతస్తుల ఎత్తులో కట్టింది. బెంగళూరుకు చెందిన శోభా డెవలపర్స్.. హుస్సేన్ సాగర్ కనిపించేలా.. సోమాజిగూడలో 17 అంతస్తుల నిర్మాణాన్ని చేపట్టింది. అక్కడి పరిసర ప్రాంతాల్లో మరో 4 స్కైస్క్రేపర్ ప్రాజెక్టులు రానున్నాయని అధికారులు చెబుతున్నారు.
* ఐటీ కారిడార్ పరిసరాలతో పోలిస్తే ఇంటి ధరలు సెంట్రల్ హైదరాబాద్ లో ఎక్కువగా ఉన్నాయి. హైటెక్ సిటీ సమీపంలోని నానక్ రాంగూడ, పొప్పాల్ గూడ, నార్సింగి, కోకాపేట్ వంటి ప్రాంతాల్లో అపార్ట్ మెంట్ లో చదరపు అడుగు 8 వేల రూపాయల నుంచి లభిస్తున్నాయి. అదే సెంట్రల్ హైదరాబాద్ లో నిర్మాణం జరుపుకుంటున్న ఆకాశహర్మ్యాల్లోని ఫ్లాట్ చదరపు అడుగుకి రూ. 12 వేల నుంచి మొదలవుతోంది. ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్ కొనాలంటే కనీసం 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిందే.