Categories: LATEST UPDATES

ఆఫీస్‌ స్పేస్‌లో 52 శాతం వృద్ధి

  • 2025 నాటికి 81 మిలియన్‌
    ఎస్‌ఎఫ్‌టీకి చేరుతుందని అంచనా

దేశంలో ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌ 53.4 మిలియన్‌ చదరపు అడుగులుగా (ఎస్‌ఎఫ్‌టీ) ఉండగా, 2025 నాటికి 52 శాతం పెరిగి 81 మిలియన్‌ చదరపు అడుగులకు చేరుకుంటుందని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ వెస్టిన్‌ పేర్కొంది. ఏటా 23 శాతం చొప్పున కాంపౌండెడ్‌ (సీఏజీఆర్‌) వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 1,000కి పైగా కేంద్రాల్లో ఆపరేటర్ల నిర్వహణలో ప్రస్తుతం 7.6 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయని నివేదిక తెలిపింది.

ఈ రంగంలో 50 పెద్ద సంస్థలు ఉండగా, టాప్‌-10 సంస్థల నిర్వహణలోనే 84 శాతం ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ పరిమాణం ఉన్నట్టు పేర్కొంది. అమెరికా, యూరప్‌ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ ఆరంభ దశలో ఉన్నట్టు వివరించింది. 2015-16 నుంచి ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ వినియోగం విస్తృతమైందని.., అప్పటి వరకు ఈ మార్కెట్‌ పరిమితంగా ఉండేదని పేర్కొంది. కేవలం ‍స్టార్టప్‌ల నుంచే కాకుండా, చిన్న, మధ్య తరహా సంస్థలు, పెద్ద సంస్థలు సైతం వినియోగించుకోవడం మొదలైనట్టు వివరించింది. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు హైబ్రిడ్‌ నమూనాలో రప్పిస్తుండటంతో ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. 2025 నాటికి మొత్తం ఆఫీస్‌ స్పేస్‌ (కార్యాలయ స్థలాలు)లో ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ 25 శాతంగా ఉంటుందని పేర్కొంది.

This website uses cookies.