Categories: TOP STORIES

IAS IPS Bhoodan land scam ‘భూదాన్‌’ అక్రమాల్లో ఐఏఎస్, ఐపీఎస్‌లు

  • భూమి కొనుగోలు చేసిన ఆఫీసర్స్‌
  • నాలుగు సర్వే నంబర్లు.. నానా చిక్కులు
  • సివిల్‌ సర్వెంట్ల భూ పోరాటం
  • ఇవి ప్రైవేట్ పట్టా భూములంటున్న అధికారులు
  • కాదు భూదాన్, కంచ భూములంటున్న స్థానికులు
  • అక్రమ భూములు కొన్న ఈఐపీఎల్
  • కన్స్ట్రక్షన్స్కే అభివృద్ధికి ఇచ్చిన ఉన్నతాధికారులు

(ఆర్ఈజీ టాస్క్‌ఫోర్స్ టీమ్‌): రాష్ట్రంలోని భూదాన్‌ భూమి పట్టాకెక్కింది. వేల ఎకరాల భూమి మాయం అయింది. ఇందులో కొంత భూమి ఏకంగా ఆఫీసర్లే కొనుగోలు చేసుకున్రనారు.  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 21,939 ఎకరాల భూదాన్ భూములు ఉండేవి. వాటిలో 13,574 ఎకరాల భూమిని అసైన్ చేశారు. అందులో పంపిణీకి నోచుకోకుండా ఉన్నవి 341 ఎకరాలే. కాగా, అసైన్ చేసిన భూమిపై ఎలాంటి లావాదేవీలు చేపట్టరాదన్న నిషేధం ఉన్నది. అయితే ఇదే అదనుగా కొందరు బడా బాబులు ఆ భూములను కొనుగోలు చేశారు. అనుకూల అధికారులు రాగానే పట్టాగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత నాలా కన్వర్షన్ చేసుకొని.. హెచ్ఎండీఏ అనుమతులు పొంది ప్లాట్లుగా అమ్మేశారు. ఇలా వందలాది ఎకరాల భూదాన్ భూమి మాయమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. 2017కి ముందు, 2024 తర్వాత భూదాన్ భూముల్లో మాయ జరిగిందని స్పష్టమవుతున్నది.

రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూములపై చోటు చేసుకున్న అక్రమాల వ్యవహారంలో అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. అప్పటి రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ పైన చాలామంది బాధితులు ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ జరిపింది. భూ బదలాయింపుల్లో చోటు చేసుకున్న లావాదేవీల్లో అనేక అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. అమోయ్ పై కేసు నమోదు చేయాలని ఈడీ సిఫారసు చేయడం సంచలనంగా మారింది. ఇంకా అప్పటి ఆర్డీవో వెంకటాచారి, మహేశ్వరం తహశీల్దార్ ఆర్పీ జ్యోతి ను సైతం ఈడీ విచారించింది. అమోయ్ కలెక్టర్ గా పని చేసిన కాలంలో చోటు చేసుకున్న అక్రమాలపై ప్రశ్నించింది. ప్రధానంగా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నం.181లోని 42 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు పార్టీకి కట్టబెట్టడం వెనుక జరిగిన తతంగంపైనా ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. మహేశ్వరం పోలీసు స్టేషన్ లో నమోదైన కేసు వివరాలను కూడా స్టడీ చేసింది. తహశీల్దార్ ఆర్డీవోపై సైతం కేసులు నమోదు చేయాలని రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది.

2017 తర్వాతే క్లియరెన్స్!
భూదాన్ భూములను 2017 తర్వాతే క్లియర్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ధరణి పోర్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల వెబ్ సైట్ లోని నిషేధిత జాబితాలో భూదాన్, ప్రభుత్వ భూములుగా పేర్కొన్నవి కూడా హెచ్ఎండీఏ అనుమతులు పొంది ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేస్తున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఇదంతా రెవెన్యూ, హెచ్ఎండీఏ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారుల మాయాజాలమే. అప్పటి తహశీల్దార్లు రికార్డులు సరిగ్గా పరిశీలించకుండా.. లేదంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకో గానీ.. పాజిటివ్ రిపోర్ట్ పంపారు. దాంతో భూదాన్ భూములు కాస్త పట్టాగా మారాయి. ఈ నాలుగేండ్లల్లో ఎన్ని వందల ఎకరాల భూమి ప్రభుత్వ/భూదాన్ గా ఉన్న క్లాసిఫికేషన్ ని పట్టాగా మార్చారో అబ్ స్ట్రాక్ట్ తీస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావు. అయితే అప్పుడు రికమండ్ చేసిన కొన్ని ఫైళ్లకు.. ఇప్పుడు రిజెక్ట్ రిపోర్టులు పంపిస్తున్నట్లు తెలిసింది.

బై నంబర్లతో లావాదేవీలు
భూదాన్‌ భూముల ప్రధాన సర్వే నంబర్లకు బై నంబర్లు సృష్టించి ఎక్కువగా హక్కులు మార్పిడి చేశారు. ఉదాహరణకు ఒక విస్తీర్ణంలో తనకున్న భూమిలో కొంత ప్రభుత్వానికి రాసిచ్చే క్రమంలో దాత ప్రధాన సర్వే నంబరుకు పక్కన మరొక అంకె (బై నంబరు) చేర్చి అప్పగించే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను ఆసరాగా చేసుకొని ప్రతి లావాదేవీకి బై నంబర్లు చేర్చుతూ పోయారు. భూములు కొనుగోలు చేసిన వారిలో కొందరు సామాన్యులు ఉండగా, మరికొందరు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు ఉన్నారు. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయో క్రమేపీ ఆ భూముల్లో వెంచర్లు వేయడం మొదలు పెట్టారు. సాగు భూములను వ్యవసాయేతర భూములుగా మార్చి స్థిరాస్తి వ్యాపారం కూడా ప్రారంభించారు.

పరిశీలన లేకుండానే రిజిస్ట్రేషన్లు
స్లాటు నమోదైతే చాలు రిజిస్ట్రేషన్‌- మ్యుటేషన్‌ ఏకకాలంలో పూర్తి చేయాలన్న నిబంధనలతో అమల్లోకి వచ్చిన ధరణి పోర్టల్‌ వచ్చాక భూదాన్‌ భూములు చేతులు మారడానికి మరింత ఆస్కారం కలిగింది. 2020లో ధరణి అమల్లోకి వచ్చాక నిషేధిత భూముల జాబితాను ఉన్నతీకరించి ఆన్‌లైన్‌ చేయడంలో కొన్ని జిల్లాల్లో నిర్లక్ష్యం చోటుచేసుకుంది. దీంతో ఆ పోర్టల్లో పట్టా భూముల విండోలో ఉన్న భూదాన్‌ భూములను కనీస పరిశీలన చేయకుండానే రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్లు చేశారు. కొన్ని సర్వే నంబర్లలో భూమి రకం (క్లాసిఫికేషన్‌) కాలమ్‌ వద్ద భూదాన్‌ పట్టా అని ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయడం అక్రమాలు జరిగినట్లు చాటుతోంది.

IAS IPS Bhoodan land scam

భూములు కొన్న ఆఫీసర్స్‌
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 27 మంది సివిల్‌ సర్వెంట్లు భూ పోరాటం చేస్తున్నారు. భూదాన్‌ భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, వీరిపై విచారణకు చేస్తున్నామంటూ చెప్తున్న ప్రభుత్వం.. ఒక అడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. లోగుట్టు పట్టుకునేందుకు అన్నట్టుగా ప్రభుత్వం సివిల్‌ సర్వెంట్లతో ఆటలాడుకుంటుంది. భూ వివాదాన్ని ఎటూ తేల్చడం లేదు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూముల లొల్లి ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుంటున్నది. గ్రామంలోని నాలుగు సర్వే నంబర్ల చుట్టూ నానా చిక్కులు నెలకొన్నాయి. 181, 182 సర్వే నంబర్లలోని భూదాన్ భూముల అక్రమ బదలాయింపు వ్యవహారంలో ఇప్పటికే ఐఏఎస్ అమోయ్ కుమార్ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. అయితే, ఇక్కడే.. 194, 195 సర్వే నంబర్లలో సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులు భూములు కొనగా, అవి కూడా భూదాన్ భూములే అని స్థానికులు హైకోర్టుకు వెళ్లడం..

ALSO READ: హైద‌రాబాద్‌లో ప్ర‌ప్ర‌థ‌మంగా కిడ్స్ సెంట్రిక్ ప్రాజెక్టు ఇదే!

వాటిని నిషేధిత జాబితాలో చేర్చాలని జడ్జి ఆదేశించడం..  కొనుగోలుదారులకు నోటీసులు ఇవ్వడంతో ఐఏఎస్, ఐపీఎస్లు, రిటైర్డ్ ఆలిండియా అధికారులు ఆందోళనలో పడ్డారు. మరోవైపు, 181, 182  సర్వే నంబర్ల పరిధిలోని భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ రైడ్స్ జరిగిన ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్ కంపెనీకే..  ఐఏఎస్లు, ఐపీఎస్లు 194,195 పరిధిలోని తమ భూములను  డెవలప్మెంట్కు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అన్నీ తెలిసిన ఉన్నతాధికారులు.. భూదాన్ భూములను అడ్డదారిలో పొందిన కంపెనీకి తమ భూములను డెవలప్మెంట్కు ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. 194,195 సర్వే నంబర్లలో ఉన్నవి భూదాన్ భూములు కావని ఉన్నతాధికారులు చెబుతుండగా, తాజాగా అవి కంచ భూములు అని, ధరణిలో రికార్డులను మార్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఇవ్వనున్న‌ నివేదికపైనే సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

విల్లా.. రెడీ చేయండి
నాగారం గ్రామంలో 194, 195 సర్వే నంబర్లలో పెద్దసంఖ్యలో ఐఏఎస్లు, ఐపీఎస్ లు, రిటైర్డ్ సివిల్సర్వీస్ అధికారులు భూములు కొనుగోలు చేశారు. ఈ సర్వే నంబర్లకు 2  కిలోమీటర్ల దూరంలో ఏపీలో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్లు ల్యాండ్ కొనుగోలు చేసి.. విల్లాలు కట్టేందుకు ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్కు ఇచ్చారు.  ఈ క్రమంలో రాష్ట్రంలో పనిచేస్తున్న, రిటైర్ అయిన ఐఏఎస్లు, ఐపీఎస్లు సైతం తమ పేరుతో, కుటుంబ సభ్యుల పేర్లతో సర్వే నంబర్ 194లో భూములు కొని.. విల్లాల కోసం అదే ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్కే డెవలప్మెంట్కు ఇవ్వడం గమనార్హం. ఇవి కూడా  భూదాన్, కంచ భూములేనని, అక్రమంగా పట్టా భూములుగా ప్రొసీడింగ్స్ జారీ చేసుకున్నారని, ఇందులో ఉన్నతాధికారుల పాత్ర ఉన్నదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో న్యాయమూర్తి 76 మంది రెస్పాండెంట్లకు నోటీసులు జారీ చేశారు.  వీరిలో 30 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం  ఈ సర్వే నంబర్లలో ఎలాంటి భూదాన్ భూములు లేవని ఉన్నతాధికారులు అంటున్నారు. పహాణీలతోపాటు పాత రికార్డులను వెరిఫై చేయగా కంచ పట్టా భూములుగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ అవి పట్టా భూములేనని క్లారిటీ వచ్చినా.. ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్లో  అక్రమ లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు ఉన్నతాధికారులకు ఇబ్బందికరంగా మారాయి.

అసలు కథంతా భూదాన్ భూముల్లోనే !
నాగారంలో 181, 182  సర్వే నంబర్లలో 42 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా నోటిఫై చేసి, నిషేధిత జాబితాలో ఉంచినప్పటికీ, అప్పటి రంగారెడ్డి కలెక్టర్ అమోయ్కుమార్ఆదేశాలతో మహేశ్వరం తహసీల్దార్ సహా కొందరు అధికారులు అక్రమంగా ప్రైవేట్వ్యక్తులకు బదలాయించారనే ఆరోపణలు వచ్చాయి.  ఈ వ్యవహారంలో ఇప్పటికే మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేయగా, ఈడీ కూడా ఎంటరైంది. ఈక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌‌తోపాటు  ఇతర అధికారులను, కొనుగోలుదారులు, మధ్యవర్తులతోపాటు ఈఐపీఎల్కన్స్ట్రక్షన్ప్రతినిధులను విచారించింది.  2 నెలల కింద ఆ భూములను మళ్లీ భూదాన్ భూములుగా నోటిఫై చేస్తూ సీసీఏఎల్ఏ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అంతకుముందు  ఈ భూముల కొనుగోళ్లలో బినామీల ద్వారా లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది.  హైదరాబాద్‌‌లోని 5  ప్రాంతాల్లో  దాడులు నిర్వహించగా, మొయినాబాద్‌‌లో భారీ నగదు, విలాసవంతమైన వాహనాలు స్వాధీనం చేసుకున్నది. ఈ దాడుల్లో నాగారంలోని 103 ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా బదిలీ చేసినట్లు ఆధారాలు లభించాయని తెలుస్తున్నది.

అప్పటి నుంచి మార్పులు
గండిపేట మండలం వట్టినాగులపల్లి సర్వే నెం.186, 187, 188, 189 నంబర్లలో రూ.వందల కోట్ల విలువైన 29.27 ఎకరాల భూదాన్ భూమి ఎవరు, ఎవరికి అసైన్ చేశారు. ఇప్పుడు ఎవరి పేరిట ఉన్నాయి? ఆ క్రయవిక్రయాలకు ఊతమిచ్చింది ఎవరు? భూదాన్ భూములకు క్లియరెన్స్ ఇచ్చిన కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ లు ఎవరనే చర్చ జరుగుతున్నది. అత్యంత ఖరీదైన భూములను కాపాడకుండా కంపెనీలకు, లీడర్లకు కట్టబెట్టడం వెనుక ఏం జరిగిందో విచారణ చేయాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. నిజానికి ఆ భూమిని బోర్డులోని సభ్యుల బినామీల పేరిట 2006 జూన్‌ 12న పట్టాలు ఇచ్చారు. 60 మంది లబ్దిదారుల జాబితాను రూపొందించారు. అయితే రాజేంద్రనగర్‌ ఆర్డీవో 2007 ఫిబ్రవరి 15న భూ మార్పిడికి ఉత్తర్వులు నెం.డి/8616/2005ను జారీ చేశారు. ఈ 60 మంది సదరు 29.27 ఎకరాలను అమ్మేందుకు ప్రయత్నాలు సాగాయి. ఈ గందరగోళం నేపధ్యంలోనే భూదాన్ బోర్డు పట్టాలను రద్దు చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి. అలాంటప్పుడు ఈ భూమి పెద్దల వశం కావడం వెనుక ఏం జరిగిందో దర్యాప్తు చేయాలి.

అత్యున్నత న్యాయస్థానం.. ఆశ్చర్యం
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నం.181, 182, 194, 195లలో భూదాన్‌ భూములకు సంబంధించి పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులతో సహా ఉన్నతాధికారుల పాత్రపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణలున్న నేపథ్యంలో వారి ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఆరోపణల నేపథ్యంలో సామాజిక ఆస్తి పరిరక్షణకు విచక్షణాధికారాన్ని వినియోగించి ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలంటూ జిల్లా కలెక్టర్, మహేశ్వరం, ఎల్బీనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌లకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.

తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా ఈ భూములను అన్యాక్రాంతం చేయరాదని, వీటిపై ఏ ఒక్క లావాదేవీ జరగడానికి వీల్లేదని ఆదేశించింది. ఇందులో ఉన్నతాధికారులు ఉండటంతో పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి పిటిషనర్‌ను అనుమతించరాదని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ భూముల్లో అక్రమాలపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ మహేశ్వరం మండలానికి చెందిన బిర్ల మల్లేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు.

పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది రవిచందర్‌ వాదనలు వినిపించారు. ‘‘ఈ అక్రమాల్లో సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల పాత్ర ఉంది. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి ఫోర్జరీ పత్రాలు సృష్టించారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి భూములను అక్రమంగా బదలాయించారు. చట్ట విరుద్ధంగా సొంత పేర్లతో, కుటుంబసభ్యుల పేర్లతో కొన్నారు. పట్టాదారు పాస్‌బుక్‌లు పొందారు. గత ఏడాది నవంబరులో సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌కు, ఈ ఏడాది మార్చి 8న సీఎంవో కార్యాలయానికి, హోంశాఖ ముఖ్యకార్యదర్శికి వివరాలు పంపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేంద్రానికి చెందిన డీవోపీటీ, హోంశాఖలకు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదు. అక్రమాలను బయటపెట్టిన పిటిషనర్‌కు ముప్పు ఉంది. రక్షణ కల్పించాలి’’ అని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రాథమికంగా రికార్డులను పరిశీలిస్తే నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నంబర్లలోని భూములు భూదాన్‌ బోర్డుకు చెందినవని తేలుతోందన్నారు.
వాటిని దాతల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవసాయం చేసుకోవడానికి పేదలకు కేటాయించవచ్చు. లేనిపక్షంలో ప్రభుత్వం ప్రజా అవసరాలకు వినియోగించవచ్చు. భూదాన్‌ చట్ట నిబంధనలకు లోబడే ఆ భూములను అనుభవించే హక్కు ఉంటుంది. వాటిని వారసత్వంగా కొనసాగించవచ్చు. అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదు. పిటిషన్‌లో ఉన్నతాధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారి ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి అవకాశం ఉంది’’ అని న్యాయమూర్తి జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు విచక్షణాధికారంతో సామాజిక ఆస్తి పరిరక్షణలో భాగంగా ఈ పిటిషన్‌పై విచారణ ముగిసేదాకా ఆ సర్వే నంబర్లలోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని  ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే దాకా ఆ భూముల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయరాదని, అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదని ప్రతివాదులను ఆదేశించారు. ఇందులో ప్రతివాదులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, భూదాన్‌ యజ్ఞ బోర్డు, సీసీఎల్‌ఏ, సీబీఐ, ఈడీలకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు.

కోర్టుకెక్కిన సివిల్‌ సర్వెంట్లు
భూదాన్ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని హైకోర్టు జస్టిస్ భాస్కర్ రెడ్డి సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని ఐఏఎస్, ఐపీఎస్ లు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వుల నిలుపుదల చేయడానికి నిరాకరించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై మహేశ్‌ భగవత్, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా, తరుణ్‌ జోషి, రాహుల్‌ హెగ్డె సహా ఇతర అధికారులు అప్పీల్ పిటిషన్ వేశారు. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఆఫీసర్ల తరపు న్యాయవాదులు కోరారు. భూదాన్ భూమికి ఆఫీసర్ల భూమికి ఎలాంటి సంబంధం లేదని వాదించారు.

భూదాన్ భూమి ఉన్నది కేవలం సర్వే నెంబర్ 181,182 లో మాత్రమేనని, ఆఫీసర్లు కొన్న భూమి నాగారం సర్వే 194లో 366 ఎకరాల్లో ఉందని తెలిపారు. సింగిల్ బెంచ్ జడ్జి వీటిని పరిగణలోకి తీసుకోకుండా ఆఫీసర్లు భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు. ఆది భూదాన్ భూమి కాదు ప్రభుత్వ, పట్టా భూమి అని ప్రతివాదు న్యాయవాది రవి చందర్ వాదించారు. అదే విషయాన్ని సింగిల్ బెంచ్ దగ్గర ప్రస్తావించాలని..కేసులో తదుపరి వాదనలు అక్కడే వినిపించాలని ఐఏఎస్, ఐపీఎస్ తరుపు న్యాయవాదులకు హైకోర్టు సూచించింది.

ఎవరు.. ఎంత కొన్నారు
1) బత్తుల హేమలత (C/o బత్తుల శివధర్ రెడ్డి ఐపీఎస్‌-20 గుంటలు)
2) ప్రియాంక రతన్ (C/o దివంగత రాజీవ్ రతన్ ఐపీఎస్‌-16 గుంటలు)
3) రవి గుప్త (ఐపీఎస్‌-16 గుంటలు)
4) ముదిరెడ్డి నితీష్ రెడ్డి (S/o మహేందర్ రెడ్డి ఐపీఎస్‌-20 గుంటలు)
5) తాటిపర్తి పావని రావు (C/o టి. ప్రభాకర్ రావు ఐపీఎస్‌-16 గుంటలు)
6) రేఖ షరాఫ్ (C/o ఉమేష్ షరాఫ్ ఐపీఎస్‌-16 గుంటలు)
7) రాజర్షి సాహా (ఐపీఎస్‌-8 గుంటలు)
8) స్వాతి లక్రా (ఐపీఎస్‌-16 గుంటలు)
9) మిట్టీ సతితి సుహానా (C/o మిట్టీ శ్రీనిబసు-8 గుంటలు)
10) నందిని మాన్ (C/o విక్రమ్ సింగ్ మాన్ ఐపీఎస్‌-8 గుంటలు)
11) డాక్టర్ జ్ఞాన్ ముద్ర (C/o సోమేష్ కుమార్ IAS-20 గుంటలు)
12) బి.కె. రాహుల్ హెగ్డే (స్వయం-8 గుంటలు)
13) సవ్యసాచి ప్రతాప్ సింగ్ (C/o గోవింద్ సింగ్-8 గుంటలు)
14) జి. ఓం అనిరుధ్ (C/o సుధీర్ బాబు ఐపీఎస్‌-నాట్ స్పెసిఫైడ్)
15) ఇందు రావు కావేటి (C/o లక్ష్మీనారాయణ రావు కావేటి-16 గుంటలు)
16) న్యాలకొండ సింధు రెడ్డి (C/o న్యాలకొండ ప్రకాష్ రెడ్డి-20 గుంటలు)
17) ఐశ్వర్య రాజ్(C/o వికాస్ రాజ్-20 గుంటలు)
18) వెన్నవెల్లి రాధిక(C/o కమలాసన్ రెడ్డి-16 గుంటలు)
19) రీతా సుల్తానా (C/o సందీప్ కుమార్ సుల్తానా-20 గుంటలు)
20) వసుంధర సిన్హా (C/o అంజనీ కుమార్-20 గుంటలు)
21) ముత్యాల వినీల (C/o స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్‌-8 గుంటలు)
22) అజిత్ కుమార్ మొహంతి (C/o ఖేస్త్రబాసి మొహంతి-20 గుంటలు)
23) నవీన్ మిట్టల్ (సెల్ఫ్-20 గుంటలు)
24) సౌమ్య మిశ్రా (సెల్ఫ్-16 గుంటలు)
25) రాహుల్ బుసి రెడ్డి (S/o బి. జనార్దన్ రెడ్డి ఐఏఎస్‌-16 గుంటలు)
26) తరుణ్ జోషి(సెల్ఫ్ ఐపీఎస్‌-16 గుంటలు)
27) పీర్ల వరుణ్ (పీర్ల విశ్వ ప్రసాద్-16 గుంటలు)
28) తోట శ్రీనివాసరావు (S/o తోట సాయిబాబా ఐపీఎస్‌-నాట్ స్పెసిఫైడ్)
29) కొండూరు శ్రీనాథరాజు (S/o కొండూరు సత్యనారాయణ-20 గుంటలు)
30) మహేష్ భగవత్ (సెల్ఫ్-16 గుంటలు)
31) రేణు గోయల్ (కమాండర్ జితేందర్ కుమార్ గోయల్-20 గుంటలు)
32) అజయ్ జైన్ (సెల్ఫ్-20 గుంటలు)
33) అమిత్‌ కుమార్ (C/o అనిల్ కుమార్-20 గుంటలు)

This website uses cookies.