Hyderabad Metro Rail Second Phase DPR ready
హైదరాబాద్ మెట్రో రైలు రెండోదశ నిర్మాణానికి మరో కీలక అడుగు పడింది. మెట్రో రెండో దశలో భాగంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్పేట, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ మార్గాలను ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్- డీపీఆర్ లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన నివేదిక రేవంత్ సర్కార్ కు చేరగా.. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపాక కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు. మొత్తం మూడు మార్గాల్లో 86.5 కిలోమీటర్ల మేర నిర్మించే సెంకడ్ ఫేజ్ మోట్రో ప్రాజెక్టు సుమారు 19 వేల కోట్ల మేర నిధులు అవసరం అవుతాయని అధికారులు ప్రతిపాదించారు.
హకీంపేట రన్వే కింద నుంచి ఎలైన్ మెంట్
హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ నిర్మాణానికి సంబంధించి మూడు మార్గాలకు వేర్వేరుగా డీపీఆర్లను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో ఎక్కడా డబుల్ డెక్ ని ప్రతిపాదించలేదు. గతంలో జేబీఎస్-శామీర్పేట, జేబీఎస్-మేడ్చల్ మార్గాల్లో డబుల్ డెక్ స్తంభాలను వేయాలని భావించారు. ఒక అంతస్తులో రహదారి, రెండో అంతస్తులో మెట్రో నిర్మించాలని భావించినా స్టేషన్లు చాలా ఎత్తులో నిర్మించాల్సి రావడంతో హెచ్ఏఎంఎల్ విముఖత చూపింది. దీంతో ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ మెట్రో తరహాలోనే సింగిల్ డెక్ మెట్రో ప్రాజెక్టును చేపట్టేలా డీపీఆర్ సిద్దం చేశారని తెలుస్తోంది.
మెట్రో రూట్ నెంబర్-1
సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో మొదటి మార్గాన్ని ప్రతిపాదించింది ప్రభుత్వం. ఈ మార్గంలో జేబీఎస్ నుంచి కార్ఖానా, అల్వాల్, హకీంపేట, తూంకుంట, శామీర్పేట వరకు మొత్తం 22 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం ఉంటుంది. హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్ కు సంబంధించిన రన్వే.. ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో మెట్రో రైల్ ఎలివేటెడ్ కు రక్షణ సంస్థ అభ్యంతరం తెలిపింది. దీంతో ఇక్కడ సుమారు కిలోమీటరున్నర వరకు భూగర్భంలో నుంచి మెట్రోని ప్రతిపాదించారు. రన్వే కింద నుంచి మెట్రో వెళ్లేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
మెట్రో రూట్ నెంబర్-2
సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్ పేట్ వరకు మెట్రో రెండవ మార్గాన్ని రేవంత్ సర్కార్
ప్రతిపాదించింది. జేబీఎస్ నుంచి తాడ్ బండ్, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్ కు మొత్తం 24.5 కిలోమీటర్ల మేర మెట్రోని ప్రతిపాదించారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆంక్షలతో ఈ మార్గంతో పాటు శామీర్ పేట ట్రాక్ లు కూడా జేబీఎస్ నుంచి ప్రస్తుతమున్న కారిడార్ కన్నా తక్కువ ఎత్తులో వెళ్లేలా డిజైన్ రూపొందించారు. మూడు మార్గాల కూడలిగా జేబీఎస్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలకు అనుగుణంగా మెట్రో ఎలైన్మెంట్ను ఖరారు చేశారు.
మెట్రో రూట్ నెంబర్-3
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫోర్త్ సిటీ వరకు మెట్రో మూడవ మార్గాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మొత్తం 40 కిలోమీటర్ల మార్గంలో.. విమానాశ్రయంలో టర్మినల్ స్టేషన్ భూగర్భం నుంచి వెళ్లేలా డిజైన్ చేశారు. ఈ మార్గంలో రావిర్యాల ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ లో మెట్రో వెళితే.. అక్కడి నుంచి ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలోంచి భూమార్గంలో 18 కిలోమీటర్లు వెళ్లేలా మెట్రో ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భగంగా భూగర్భ మార్గం గుండా 2 కిలోమీటర్లు, ఎలివేటెడ్ మార్గం గుండా 6 కిలో మీటర్లు, ఓఆర్ఆర్ వెంట ఎలివేటెడ్ మార్గం 14 కిలోమీటర్లు, భూమిపై 18 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ నిర్మాణం జరగనుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి కేవలం 40 నిమిషాల్లో ప్యూచర్ సిటీకి వెళ్లేలా మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం జరుపుకోనుంది. ఫ్యూచర్ సిటీ కి అనువుగా గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేసి, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వేగంగా ఫ్యూ చర్ సిటీకి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మెట్రో కారిడార్ తో పాటు గ్రీన్ ఫీల్డ్ రోడ్లు, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్
హైదరాబాద్ మెట్రో రెండవ దశ నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టుగా చేపట్టేలా డీపీఆర్ రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయంలో తెలంగాణ ప్రభుత్వం 30 శాతం, కేంద్ర ప్రభుత్వం 18 శాతం భరించేలా ప్రతిపాదించారు. 48 శాతం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేలా, మిగిలిన 4 శాతం పీపీపీలో సమకూర్చుకునేలా డీపీఆర్ రూపొందించారు.
This website uses cookies.