గ్రేటర్ పరిధిలోని గచ్చిబౌలిలో 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కొన్నేండ్లుగా వివాదంలో ఉన్న ఐఎంజీ భూములను వేలానికి పెడుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఆర్థిక వనరుల్ని సమీకరించుకునేందుకు ఈ భూములను వేలం వేస్తున్న టీజీఐఐసీ విడుదల చేసిన బిడ్ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఈ లెక్కన రూ. 20 వేల కోట్లు సమీకరించుకునేందుకు ప్రభుత్వం గచ్చిబౌలి భూములను విక్రయానికి పెట్టింది. హైదరాబాద్ నగరంలో అతి పెద్ద ఐటీ హబ్, రెసిడెన్షియల్ హబ్ అయిన గచ్చిబౌలిలో ఈ భూములు ఉండటం విశేషం. హైటెక్ సిటీకి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ 400 ఎకరాలు ఉన్నాయి. టీజీఐఐసీ నోటిఫికేషన్లో ఈ భూముల వివరాలను వెల్లడించింది. పంజాగుట్ట క్రాస్ రోడ్స్కు 15 నుంచి 18 కిలోమీటర్ల దూరంలో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు 22 కిలోమీటర్ల దూరంలో, శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు 33 కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉందని బిడ్ డాక్యుమెంట్లో స్పష్టం చేశారు. ఈ నెల 7న ప్రీబిడ్ సమావేశం నిర్వహిస్తున్నట్లు, ఈ నెల 15, మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్ల దాఖలుకు ఆఖరి అవకాశంగా టీజీఐఐసీ ప్రకటించింది. అయితే, రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో.. దీనికి ఆదరణ ఎంతవరకు లభిస్తుందనేది ప్రశ్నార్థకమేనని రియల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.