Categories: LEGAL

అమరావతి భూముల పంపిణీపై స్టేకు సుప్రీం నో

అమరావతి ఆర్5 జోన్ లో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయకుండా స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న రిట్ పిటిషన్లలో హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఇళ్ల పట్టాల పంపిణీ ఉండాలని స్పష్టంచేసింది. ఒకవేళ పట్టాలు పంపిణీ చేస్తే లబ్ధిదారులకు ముందుగానే ఈ విషయం చెప్పాలని సూచించింది. అప్పుడు కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఆయా భూములపై ప్రత్యేక ప్రయోజనాలు కోరే హక్కు లబ్ధిదారులకు ఎంతమాత్రం ఉండదని పేర్కొంది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 1134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించేందుకు సీఆర్డీఏకు అనుమతిసతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలల్ చేస్తూ రాజధాని రైతులు హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఆ జీవోను నిలుపుదల చేయడంతోపాటు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా ప్రభుత్వాన్ని నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు విచారణ జరిపి వాటిన కొట్టివేసింది. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. వీటిని సవాల్ చేస్తూ పలువురు రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీటిపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అరవింద్ కుమార్ తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వాదనలు విన్న అనంతరం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఇళ్ల పట్టాల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.

This website uses cookies.