Categories: TOP STORIES

సంస్థాన్ నారాయణపూర్లో ట్రిపుల్ ఆర్ జంక్షన్..

హైదరాబాద్ నగరానికి రీజినల్ రింగ్ రోడ్డు మరో మణిహారంగా మారనున్నది. తెలంగాణ అభివృద్ధిలో ట్రిపుల్ ఆర్ గేమ్ ఛేంజర్ కానుందని రియల్ ఎస్టేట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం 347 కిలోమీటర్ల పొడవున 4 వరుసలతో నిర్మించే ఈ గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వేను రెండు భాగాలుగా నిర్మించనుండగా.. అందుకు సంబంధించిన భూసేకరణ పనులు మొదలయ్యాయి. మూడేళ్లలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.

రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో మొత్తం 12 ఇంటర్ ఛేంజర్స్ నిర్మించేలా డిజైన్ చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులతో కనెక్ట్ అయ్యే ఈ 12 ప్రాంతాల్లో భారీ జంక్షన్స్ ఏర్పాటు కానున్నాయి. అంతర్జాతీయస్థాయిలో నిర్మాణం జరుపుకోబోయే ఈ భారీ ఇంటర్ ఛేంజర్స్‌తో పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ గ్రోత్‌కు మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ ఛేంజర్స్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సంస్థాన్ నారాయణపూర్ సమీపంలో వచ్చే జంక్షన్ గురించి. విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో సంస్థాన్ నారాయణపూర్ సమీపంలో నిర్మించబోయే ఇంటర్ ఛేంజర్ వల్ల చుట్టు పక్కల భారీగా మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇటు చౌటుప్పల్ నుంచి శివన్నగూడెం వరకు పారిశ్రామికంగా అభివృద్ది చెందగా.. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు, సంస్థాన్ నారాయణపూర్ దగ్గర వచ్చే భారీ జంక్షన్‌తో ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందనుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి సంస్థాన్ నారాయణపూర్ సమీపంలో మార్కింగ్ చేయగా.. అందుకు సంబంధించిన భూసేకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ట్రిపుల్ ఆర్ మార్కింగ్‌తో సంస్థాన్ నారాయణపూర్ సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంతమేర ఊపందుకుంది. చౌటుప్పల్, శివన్నగూడెం మధ్య మొన్నటి వరకు మెయిన్ రోడ్డు ఫేసింగ్‌తో ఎకరం 1.5 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయలు ఉండగా.. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు జంక్షన్ ఏర్పాటు కానుండటంతో ఇక్కడ ఎకరం 2 నుంచి 2.5 కోట్లకు పెరిగిందని చెబుతున్నారు. ప్రధాన రహదారి నుంచి 2 నుంచి 3 కిలోమీటర్ల రేడియస్‌లో ఎకరం కోటి రూపాయల నుంచి కోటీ 30 లక్షల వరకు ధరలున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డు పనులు మొదలైతే భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ట్రిపుల్ ఆర్ జంక్షన్ ఏర్పాటయ్యే సంస్థాన్ నారాయణపూర్ సహా సమీపంలోని చౌటుప్పల్, పంతంగి, కొత్తగూడ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే భారీ స్థాయిలో రియల్ వెంచర్లు వెలిశాయి. ఇక ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ ఛేంజర్ ఏర్పాటవుతుండటంతో భారీగా వెంచర్లు వేసేందుకు రియాల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుతం సంస్థాన్ నారాయణపూర్‌లో డీటీసీపీ లేఅవుట్‌లో రియాల్టీ ప్రాజెక్టు.. ప్రాంతాన్ని బట్టి చదరపు గజం 15 వేల రూపాయల నుంచి 20 వేల రూపాయల వరకు ధరలున్నాయి. ఇక పంతంగి, కొత్తగూడలో చదరపు గజం 10 వేల రూపాయల నుంచి 18 వేల రూపాయల వరకు ప్లాట్ల ధరలున్నాయి. సంస్థాన్‌ నారాయణపూర్‌ సమీపంలోని పీపల్‌ పహాడ్‌, వెంకంబావి తండా తదిరత ప్రాంతాల్లో చదరపు గజం 8 వేల రూపాయల నుంచి మొదలు 15 వేల రూపాయల వరకు ప్లాట్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఆ తరువాత చౌటుప్పల్‌లో డీటీసీపీ లేఆవుట్లలో చదరపు గజం 14 వేల రూపాయల నుంచి 24 వేల రూపాయల వరకు ధరలున్నాయి.

సంస్థాన్ నారాయణపూర్ సమీప ప్రాంతాల్లో మధ్య తరహా పారిశ్రామిక రంగం మంచి అభివృద్దిలో ఉంది. ఇక ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు జంక్షన్ ఏర్పాటు అవుతుండటంతో.. ట్రిపుల్ ఆర్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. అంతే కాకుండా ఈ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్లు, లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫార్మా కంపెనీలు రీజినల్ రింగ్ రోడ్డుకు చేరువగా తమ ల్యాబ్‌లు, ఫ్యాక్టరీలను తరలించనుండటంతో ఇక్కడ మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో సంస్థాన్ నారాయణపూర్ జంక్షన్ కనివినీ ఎరగుని రీతిలో అభివృద్ది చెందనుందని రియాల్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డుతో ఇటు హైదరాబాద్‌కు, అటు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగనుండటంతో సామాన్య, మధ్య తరగతి వాళ్లు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో క్రమంగా సంస్థాన్ నారాయణపూర్ నుంచి చౌటుప్పల్ వరకు నిర్మాణ ప్రాజెక్టులతో పాటు భారీ స్థాయిలో వెంచర్లకు అవకాశం ఉంటుందని రియాల్టీ వర్గాలు చెబుతున్నాయి.

This website uses cookies.