హైదరాబాద్లో ఎనభై నుంచి తొంభై శాతం వరకూ ప్రీలాంచులు తగ్గాయని పలువురు డెవలపర్లు అంటున్నారు. మునుపటితో పోల్చితే ప్రస్తుతం ప్రీలాంచుల్లో ఫ్లాట్లను అమ్మే డెవలపర్లు తగ్గారని చెబుతున్నారు. అయితే, అక్కడక్కడా కొందరు డెవలపర్లు దురాశతో ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయిస్తున్నారని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి తెలిపారు. ప్రీలాంచుల్లో కొనకూడదనే అంశాన్ని హైలైట్ చేస్తూ.. తాము ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాల్ని కూడా నిర్వహించామని తెలిపారు. క్రెడాయ్ హైదరాబాద్ కృషి కారణంగానే టీఎస్ ప్రభుత్వం రెరా అథారిటీకి పూర్తి స్థాయి ఛైర్మన్ను నియమించిందని చెప్పారు. కొత్త ఛైర్మన్ సత్యనారాయణ మంచి పనితీరును కనబరుస్తున్నారని తెలిపారు.
- కేవలం చిన్న సంస్థలకే నోటీసుల్ని అందజేస్తూ.. మిగతా పెద్ద కంపెనీలకు టీఎస్ రెరా ఎలాంటి నోటీసులను ఇవ్వట్లేదని కొందరు బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు బెంగళూరుకు చెందిన ఒక సంస్థ బాహాటంగా ఏజెంట్లతో ప్రీలాంచ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నా రెరా పట్టించుకోవట్లేదని డెవలపర్లు అంటున్నారు. ఎందుకంటే, ఆయా కంపెనీకి ప్రభుత్వ పెద్దలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండటమే కారణమని చెబుతున్నారు. ప్రీలాంచులు ఎవరు చేసినా, ఎలాంటి పద్ధతుల్లో చేసినా, ఆయా బిల్డర్లపై టీఎస్ రెరా మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది.