poulomi avante poulomi avante

బంగారం వద్దు.. ఇల్లు ముద్దు..

  • బంగారంపై మహిళలకు తగ్గుతున్న ఆసక్తి

  •  స్థిరాస్తిపై పెట్టుబడికి మహిళల ఆసక్తి

  •  గృహ ఎంపికలో పెరుగుతున్న మహిళల పాత్ర

  • స్థిరాస్తిపై పెట్టుబడితో రాబడి ఎక్కువంటున్న మహిళలు

 

బంగారం.. ఈ పేరు వినగానే మహిళల మనస్సు పులకించిపోతుంది. భారతీయ సంస్కృతిలో బంగారానికి, మహిళలకు ఉన్న బంధం ఎంతో ప్రత్యేకమైనది. అయితే బంగారంపై ఎంతో ఇష్టం చూపిస్తుంటే.. మహిళల వైఖరిలో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. అవును.. పసిడి కొనేందుకు బదులు ఆ డబ్బును స్థిరాస్తిపై పెట్టుబడిగా పెడుతున్నారు నేటి తరం మహిళలు. బంగారం కంటే ఇళ్లు కొనుగోలు చేసే వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.

భారతీయ సంప్రదాయంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులోను ఆడవాళ్లకు బంగారమంటే ఎంతో మక్కువ. బంగారాన్ని అలంకరించుకోవడం సంస్కృతిలో ఓ భాగమని అనుకుంటారు. అంతే కాదు బంగారాన్ని ఓ రకమైన ఆస్తిగా కూడా పరిగణిస్తారు. అందుకే చాలా మంది మహిళలు కేవలం అలంకరించుకోవడానికి మాత్రమే కాకుండా డబ్బులను బంగారంపై పెట్టుబడిగా కూడా పెడుతుంటారు. చాలా మంది షేర్ మార్కెట్లతో పాటు బంగారంపై ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మహిళల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. డబ్బులుంటే చాలు బంగారం కొనాల‌నుకునే చాలా మంది మహిళల దృక్పదం మారింది. దాచుకున్న, పొదుపు చేసుకున్న డబ్బులను బంగారం కంటే ఎక్కువ రాబడి ఇచ్చే రంగంపై పెట్టుబడిగా పెడుతున్నారు మహిళలు.

బంగారానికి బదులు ఈ మధ్యకాలంలో మహిళలు ఎక్కువగా స్తిరాస్థి రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. మహిళలు స్వతంత్ర గృహ కొనుగోలు, పెట్టుబడిదారులుగా ఎదుగుతున్నారు. బంగారం కొని ఇంట్లో పెట్టుకుంటే స్వల్పంగానే విలువ పెరుగుదల ఉంటుందని, కానీ బంగారానికి బదులు స్తిరాస్థి కొంటే త్వరగా పెట్టుబడి విలువ పెరుగుతుందని మహిళలు భావిస్తున్నారు. దీంతో బంగారమే కాదు రియల్ ఎస్టేట్‌ని పెట్టుబడి కోణంలో చూసే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాము ఉండేందుకు గృహాలను కొనుగోలు చేయాలని భావించే మహిళలతో పాటు కేవలం పెట్టుబడుల కోసం ఇంటిని కొనుగోలు చేస్తున్న మహిళల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతుందని రియాల్టీ నిపుణులు చెబుతున్నారు.

మధ్యతరగతి నుంచి మొదలు ధనవంతుల వరకు వివిధ వర్గాల మహిళలు.. బంగారం కంటే స్థిరాస్తిపై ఇన్వెస్ట్ చేసేందుకే మొగ్గుచూపుతున్నారట. బంగారం అయితే పెరుగుదల పెద్దగా ఉండకపోవడంతో పాటు భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయని, అందుకని బ్యాంక్ లాకర్ల‌లో పెట్టడం తప్ప.. మరో గత్యంతరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే.. తక్కువ కాలంలో ఎక్కువ రాబడి ఉంటుదన్న భరోసా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఎక్కువ శాతం మంది మహిళలు తక్కువ బడ్జెట్ తో వచ్చే ఇంటి స్ఠలం లేదా ఇంటిపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. సుమారు 10 లక్షల రూపాయల నుంచి మొదలు స్థిరాస్తిని బట్టి కోటి రూపాయల వరకు మహిళలు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు.

గతంలో మహిళలు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులపై నిర్వహించిన సర్వే ఫలితాలే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు రియల్ రంగ నిపుణులు. 2019 లో గృహ కొనుగోళ్లకు 57 శాతం మంది మహిళలు ఆసక్తిని చూపించగా, 2020 నాటికి అది 62 శాతానికి పెరిగింది. ఆ తరువాత 2021 లో గృహ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న మహిళలు 64 శాతానికి పెరిగారు. ప్రస్తుతం 75 శాతానికి పైగానే మహిళలు బంగారం కంటే కూడా ఇంటిపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లు రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంట్లోనే కాదు ఇంటి కొనుగోలు ఎంపికలోనూ తమదే పైచేయని నిరూపిస్తున్నారు నేటి తరం మహిళలు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles