Categories: TOP STORIES

అందుబాటు ఇళ్ల అమ్మకాలు తగ్గాయ్

దేశంలో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అందుబాటు ధరల ఇళ్ల అమ్మకాలు తగ్గాయి. రూ.50 లక్షల లోపు ధర కలిగిన ఇళ్ల విక్రయాలు 9 శాతం మేర తగ్గినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్‌ ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది.

దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ గృహాల అమ్మకాలు 21,010 యూనిట్లకు పరిమితమైనట్లు పేర్కొంది. ఇళ్ల ధరలు, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉండటం, సరఫరా తగ్గడం తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించింది. అలాగే రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖరీదు చేసే రెసిడెన్షియల్ సెగ్మెంట్లో కూడా విక్రయాలు 6 శాతం తగ్గి 26,832 యూనిట్లకు పరిమితమైనట్టు వెల్లడించింది. మార్చి త్రైమాసికంలో ఎక్కువగా ప్రీమియం కేటగిరీపైనే గృహాల కొనుగోలుదారులు దృష్టి పెట్టినట్లు తెలిపింది. రూ. కోటి పైగా ఖరీదు చేసే ఇళ్ల అమ్మకాలు పెరగడం ఇందుకు నిదర్శనమని పేర్కొంది.

హైదరాబాద్‌తో పాటు కోల్‌కతా, చెన్నై తదితర 8 నగరాల్లో నిర్వహించిన అధ్యయన నివేదిక ప్రకారం .. రూ. 1-2 కోట్ల రేటు ఉన్న గృహాల విక్రయాలు 2 శాతం పెరిగి 22,330 యూనిట్లకు చేరాయి. అలాగే రూ. 2-5 కోట్ల కేటగిరీలో 28 శాతం వృద్ధి చెంది 13,735 యూనిట్లు, రూ. 5-10 కోట్ల విభాగంలో విక్రయాలు ఏకంగా 82 శాతం పెరిగి 3,448 యూనిట్లుగా నమోదయ్యాయి. రూ. 10-20 కోట్ల కేటగిరీలో అమ్మకాలు రెట్టింపై 658 యూనిట్లకు చేరాయి. రూ. 20-50 కోట్ల విభాగంలోనూ రెండు రెట్లు పెరిగి 92 యూనిట్లుగా నమోదయ్యాయి. రూ. 50 కోట్ల పైగా ఖరీదు చేసే ఇళ్ల అమ్మకాలు అనేక రెట్లు పెరిగి 169 యూనిట్లకు చేరాయి. రూ.2 కోట్ల ధర శ్రేణిలోని ఇళ్ల అమ్మకాలు 2 శాతం పెరిగి 22,330 యూనిట్లకు చేరినట్టు తెలిపింది.

This website uses cookies.