ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట కొంతకాలం నుంచి పలువురు బిల్డర్లు, డెవలపర్లు హైదరాబాద్లో ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. బయ్యర్ల నుంచి చెక్కులను మాత్రమే తీసుకుంటున్నామని.. వాటిని బ్యాంకులో సమర్పించడం లేదు కాబట్టి.. ఈవోఐ ప్రీలాంచ్ కిందికి రాదని కొందరు బిల్డర్లు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా కార్పొరేట్ బిల్డర్లు అయిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్ వంటి వారు.. హైదరాబాద్లో ఇటీవల ఆరంభించిన ప్రాజెక్టులన్నీ ఈవోఐ కింద ఎక్కువ శాతం విక్రయిస్తున్నారు. వీరిని చూసి స్థానికంగా కొందరు బిల్డర్లు ఇదే బాట పట్టారు. అయితే, ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే.. ఈవోఐ కింద చెక్కులను తీసుకుంటే తప్పేమిటని వాదించే స్థాయికి పలువురు బిల్డర్లు చేరుకున్నారు. అక్రమంగా సొమ్ము వసూలు చేసి.. అలా చేస్తే తప్పేమిటి అని వాదిస్తున్నారు. మరి, ఇది ఎంతవరకూ కరెక్టు? టీజీ రెరా చట్టం ఏం చెబుతోంది?
ఆశ కల్పించి అమ్మేస్తున్నారు!
ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద బిల్డర్లు ఏం చేస్తున్నారో అందరికీ తెలిసిందే. వీరు ఒక ప్రాంతంలో ప్రాజెక్టును కడుతున్నామని.. అందులో పలు టవర్లను నిర్మిస్తున్నామని.. ఫలానా సంఖ్యలో ఫ్లాట్లు వస్తాయని.. అందులో ఫలానా ఎమినిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామని.. ఇప్పుడు ఒకేసారి వంద శాతం సొమ్ము చెల్లిస్తే.. తక్కువ రేటుకు వస్తుందని.. ప్రాజెక్టు లాంచ్ నాటికి రేటును పెంచుతామని.. బయ్యర్లు, ఇన్వెస్టర్లకు ఆశ కల్పిస్తున్నారు. ఇప్పుడు తక్కువకు కొంటే.. కొంతకాలం అయ్యాక అప్రిసియేషన్ అవుతుందని నమ్మబలుకుతూ.. ముందుస్తుగా చెక్కులను తీసుకుంటున్నారు. అంటే, ఫలానా ప్రాజెక్టును కడుతున్నామంటూ కొనుగోలుదారులను అందులో కొనుక్కునేందుకు ఆహ్వానిస్తున్నారు కాబట్టి.. రెరా అనుమతి లేకుండా ఫ్లాట్లను విక్రయించడం కిందికే వస్తుంది.
రెరా చట్టం ఏం చెబుతోంది?
రెరా చట్టం సెక్షన్ 3 ప్రకారం.. రెరా అనుమతి లేకుండా.. ప్రమోటర్లు ఒక ప్రాజెక్టు గురించి ప్రకటన చేయడం కానీ మార్కెటింగ్ చేయడం కానీ నిషిద్ధం. ప్లాట్లు, ఫ్లాట్లను అమ్మడం కానీ కొనేందుకు ఆహ్వానించడం కానీ రెరా చట్ట విరుద్ధం. కాబట్టి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అదే కోవలోకి వస్తుంది. అలా చేస్తే అది పెద్ద ఫ్రాడ్ కిందికొస్తుంది. కానీ, ఎందుకో గానీ, మన రాష్ట్రంలో రెరా ఆరంభం నుంచి ప్రీలాంచుల మీద కానీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద కానీ ఫ్లాట్లు, విల్లాల్ని అమ్ముతున్న బిల్డర్ల పై టీజీ రెరా ఎలాంటి చర్యల్ని తీసుకోవడం లేదు.
వాస్తవానికి, రెరా అనుమతి లేకుండా యూనిట్లును విక్రయించే డెవలపర్ల నుంచి రెరా చట్ట ప్రకారం.. ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానాను విధించాలి. కానీ, గత ఏడేళ్ల నుంచి ప్రీలాంచ్ డెవలపర్ల మీద జరిమానా విధించడాన్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అతి పెద్ద రెరా స్కామ్ అని చెప్పొచ్చు.
ప్రీలాంచ్ చట్టబద్ధమేనా?
ప్రీలాంచ్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద అనేకమంది బిల్డర్లు, డెవలపర్లు, ఛానెల్ పార్ట్నర్లు, ఏజెంట్లు వంటివారు ఫ్లాట్లను విక్రయిస్తున్నారని.. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారని.. ఫిర్యాదులొచ్చినా టీజీ రెరా మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు. ప్రీలాంచు ప్రాజెక్టుల మీద టీజీరెరాకు ఎందుకంత సాఫ్ట్ కార్నర్ ఉందో అర్థం కావట్లేదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ, రెరా దృష్టిలో ఈవోఐ కరెక్టే అనుకుంటే.. బాహాటంగా ఒక ప్రకటన విడుదల చేస్తే సరిపోతుంది. దీంతో, ప్రతిఒక్క బిల్డరూ ఈవోఐ కింద ఫ్లాట్లను విక్రయిస్తారు. అలా కాదని, కొందరు మాత్రమే ఈవోఐ కింద ఫ్లాట్లను విక్రయించటం.. అయినా వారిపై ఎలాంటి చర్యల్ని తీసుకోకపోవడం ఎంత దుర్మార్గమో అర్థం చేసుకోవాలి.