Hydra vs ghmc: హైడ్రా వర్సెస్‌ జీహెచ్‌ఎంసీ.. పెత్తనం కోసం కొట్లాట..

  • మొదలైన స‌రికొత్త లొల్లి
  • నాలాల పర్యవేక్షణ అంటూ హైడ్రా ఆధీనం
  • హైడ్రా చేతికి మాన్సూన్‌ ఎమర్జెన్సీ టీంలు
  • కబ్జాల నుంచి నాలాలకు త‌గ్గిన‌ రంగనాథ్‌ కార్యాకలాపాలు
  • ఫిర్యాదులను అటూ ఇటూ పంపించుకుంటున్న అధికారులు

    (ఆర్‌ఈజీ టాస్క్‌ఫోర్స్‌)
  • “మహానగరంలో మళ్లీ లొల్లి ముదురుతోంది. మొన్నటి దాకా హైడ్రా అంటేనే ఒంటికాలిపై లేచి.. వ్యతిరేకించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఇప్పుడు కొంత సైలెంట్‌ అయ్యారు. కానీ, తాజాగా నాలాల పనులపై జీహెచ్‌ఎంసీ, హైడ్రా మధ్య వివాదం తారా స్థాయికి చేరింద‌ని స‌మాచారం. జీహెచ్‌ఎంసీ నాలాల పనులను హైడ్రాకు అప్పగించడ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.”
కార్పొరేషన్‌ పరిధిలో పని చేసే మాన్సూన్‌ సిబ్బందితో పాటు కొంతమందిని హైడ్రాకు బదలాయించడం.. అటు జీహెచ్‌ఎంసీ, ఇటు హైడ్రాలో .. పని చేయాలంటూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో ఒక విభాగంపై మరో విభాగం మండిపడుతున్నాయి. ఇదే సమయంలో నాలాలు, ఇతర అశాలపై వచ్చే ఫిర్యాదులను ఈ రెండు శాఖలు తిప్పి పంపించుకుంటూ కాలయాపన చేస్తున్నాయి. హైడ్రాకు వర్షా కాలపు సహాయక చర్యలు, నాలాల నిర్వహణ బాధ్యతలను అప్పగించడంతో జీహెచ్‌ఎంసీ తన అస్థిత్వాన్ని కోల్పోతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ చేతి నుంచి నాలాల పనులను హైడ్రాకు అప్పగించ‌డంతో వరద నీటిని సమర్థవంతంగా నిర్వహించడంలో జీహెచ్‌ఎంసీ విఫలమైందని ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లుగా మారింది. జీహెచ్‌ఎంసీ ఫెయిల్యూర్‌ కారణంగానే వరద ముంపు సమస్యలతో పాటుగా కొన్ని ప్రత్యేక పనులు, గ్రేటర్‌ పరిధిలో కబ్జాల వ్యవహారాలన్నీ హైడ్రా చేతికి అప్పగించడంతో కార్పొరేషన్‌ను కేవలం అలంకారప్రాయంగా మార్చినట్లుగా తేలిపోతుంది. ఈ లెక్కన గ్రేటర్‌ పరధితో పాటు ఓఆర్‌ఆర్‌ లోపల భూముల కబ్జా మీద ఆవిర్భావం చేసిన హైడ్రాకు.. మహానగరంలో వర్షాకాలపు సహాయక చర్యలు, నాలాల నిర్వహణ, చెరువుల పరిరక్షణ వంటి పనులను చేతికి ఇచ్చారు. దీంతో జీహెచ్‌ఎంసీ తన పరిధిలో ఉండే ప్రధాన బాధ్యతలను హైడ్రాకు అప్పగించడంతో అసంతృప్తికి లోనవుతుంది. జీహెచ్‌ఎంసీ నాలాల పనులను వేగంగా చేయడంలో విఫలమైందని, పనుల నాణ్యత కూడా సరిగా లేదని జీహెచ్‌ఎంసీపై ఆరోపణలు ఎక్కువయ్యాయి.

ఆదాయం పోతుంది?
అయితే, జీహెచ్‌ఎంసీ అసంతృప్తి వెనక అసలు కోణం మరోటి ఉందని అంటున్నారు. నాలాల క్లియరెన్స్‌, వాటి రక్షణ, నాలాల్లో వ్యర్థాల తొలిగింపు వంటి వాటిని జీహెచ్‌ఎంసీ ప్రతి ఏడాది ప‌నుల్ని చేస్తోంది. వీటిని న‌గ‌రంలోని ఏరియాల వారీగా కార్పొరేటర్లకు కేటాయిస్తుంది. లేదంటే కార్పొరేటర్లు చెప్పిన వారికే పనులు అప్ప‌గిస్తుంది. ఒక్కో చోట కనీసం రూ. 40 నుంచి రూ. 50 లక్షల మేరకు ఈ ప‌నుల విలువ ఉంటుంద‌ని స‌మాచారం. ఒక‌వేళ పెద్ద నాలాలు ఉన్న‌ట్ల‌యితే వాటి ప‌నుల విలువ కోట్ల‌లో ఉంటుంది. ఇక్కడ చేసే పని పూర్తి వ్యయంలో కనీసం 20 శాతం ఉండదని వాదన. ఇప్పుడు ఈ నిర్వహణ మొత్తం హైడ్రా చేతికి వెళ్లడంతో ఈ నిధులు కూడా కార్పొరేషన్‌ నుంచి పోయినట్టే. దీంతో కార్పొరేటర్ల నుంచి మొదలుకుని ఇంజినీరింగ్‌ విభాగం, జోన్‌ కమిషనర్లు, గ్రేటర్‌ ఉన్నతాధికారుల వరకు నాలాల పేరు మీద వచ్చే ఆదాయం దక్కకుండా పోతోంది.

అగ్గి రాజేసిన రంగనాథ్‌


జీహెచ్‌ఎంసీ పరిధిలోని మాన్సూన్‌ ఎమర్జెన్సీ బృందాలపై సరైన పర్యవేక్షణ ఉండేది కాదని, అందుకే తమకు ఇచ్చారంటూ హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ బహిరంగంగా ప్రకటించడంతో వివాదంలో అగ్గి రాజేసినట్లుగా మారింది.  “చెరువులు, నాలాల్లోకి వరద నీటిని మళ్లించే వ్యవస్థ కూడా గతంలో సమర్థవంతంగా పని చేయలేదు. ఈ కారణంగా అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి” అని రంగనాథ్‌ చెప్పడంతో.. జీహెచ్ఎంసీ పని చేయలేదని తేల్చినట్లుగా మారింది. ఈ సమస్యలను అధిగమించేందుకు, వరద నీరు ఎక్కువగా నిలిచే ప్రాంతాలపై తాము ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ చేపట్టాల్సిన చర్యలపై ఒక ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్లు రంగనాథ్‌ చెప్పడంతో.. ఆగ్రహం మరింత పెరిగినట్లైంది.మాన్సూన్‌.. వెళ్లిపోండి
ఇటీవల జీహెచ్ఎంసీ కొన్ని పనులపై అలసత్వం ప్రదర్శిస్తున్నదంటూ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. వెంటనే  వర్షాకాలంలో చేపట్టాల్సిన పనులను హైడ్రాకు అప్పగించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మాన్సూన్ ఎమర్జెన్సీ పనులను హైడ్రాకు అప్పగిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. మాన్సూన్ ఎమర్జెన్సీ పనుల్లో భాగంగా హైడ్రా వరద నీటిని మళ్లించడంతో పాటు రహదారులపై బురద పేరుకుపోకుండా చూడటం, పడిపోయిన చెట్లను వెంటవెంటనే తొలగించడం, పడిపోవడానికి సిద్ధంగా ఉన్న చెట్లను గుర్తించి తొలగించాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు.

ఆది నుంచి వివాదాలే
జీహెచ్ఎంసీలో జీతం తీసుకుంటూ పూర్తి స్థాయిలో హైడ్రా కోసం పని చేస్తున్న అధికారులపై గతంలో కూడా ఇదే వివాదం నెలకొన్నది. అప్పుడు అక్రమ కట్టడాలతో దూకుడు చూపించిన హైడ్రాకు అప్ప‌టి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి షాక్ ఇచ్చారు. జీహెచ్‌ఎంసీలో జీతం తీసుకుంటూ హైడ్రాలో పని చేస్తోన్న అధికారులపై ఆమె సీరియస్ అయ్యారు. ముఖ్యంగా విజిలెన్స్ విభాగం అధికారులు హైడ్రాను వీడటం లేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్‌కు జవాబుదారీగా ఉంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఫైర్ కావడంతో పాటు తమ పరిధిలో పని చేయని అధికారులకు ఇకపై జీతాలు ఇవ్వొద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు రచ్చకెక్కాయి.

అటు ఫిర్యాదులు ఇటు.. ఇటు ఫిర్యాదులు అటు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి పరిధిలో తమకు రావలసిన ఫిర్యాదులు హైడ్రాకు వెళ్లడంతో కూడా తీవ్ర అసహనంతో ఉంటున్నారు. జీహెచ్ఎంసీ ప్రాధాన్యత తగ్గిపోతుందని సిటీలో హైడ్రా ప్రాధాన్యత పెరిగిపోతుందని అభిప్రాయపడుతున్నారు. హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులను కొన్నింటిని కమిషనర్‌ రంగనాథ్‌ జీహెచ్ఎంసీకి పంపుతున్నారు. అవి మావి కూడా కాదంటూ జీహెచ్‌ఎంసీ నుంచి తిరిగి హైడ్రాకు పంపుతున్నారు.  హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులు కొన్నింటిని చూడాలని జీహెచ్ఎంసీకి తిరిగి పంపుతున్నారు. జీహెచ్ఎంసి లో సిబ్బంది కొరతతో అక్కడ పనులు చూడడానికే ఇబ్బందిగా ఉన్న సమయంలో హైడ్రా ఫిర్యాదుల గురించి కమిషనర్ జిహెచ్ఎంసికి లేఖలు రాయడం కూడా ఓ రకంగా గ్రేటర్ హైదరాబాద్ అధికారులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది.

ఎన్వోసీ ఇవ్వడం లేదు
జీహెచ్‌ఎంసీలో చలాన్లు కట్టిన దరఖాస్తులకు హైడ్రా కేంద్రంగా తనిఖీలు జరిపి సంబంధిత నిర్మాణానికి అనుమతులు మంజూరవుతున్నాయి. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారుల అంతర్గత కోల్డ్ వార్‌ కొనసాగుతుండగా…ఫైర్‌ ఎన్‌వోసీల పొందాలనుకునే వారికి రెండు శాఖల చుట్టూ ప్రదక్షిణలు తప్పడం లేదు. హైడ్రా ఏర్పాటు కంటే ముందు జీహెచ్‌ఎంసీ ఆధీనంలో ఈవీడీఎం విభాగం ఉంది. ఈవీడీఎం డైరెక్టర్‌ కింద విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు అడ్వర్టయిజ్‌మెంట్‌ విభాగాలు ఉన్నాయి. హైడ్రా ఏర్పాటు తర్వాత జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ ప్రకారం డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ తప్ప.. విభాగాలన్నీ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆధీనంలోనే పని చేయాలి.

కానీ హైడ్రా కమిషనర్‌ దూకుడుగా వ్యవహరించి జీహెచ్‌ఎంసీ అధికారాలను తమ గుప్పిట్లోనే పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఫైర్‌ విభాగం సిబ్బంది కూడా జీహెచ్‌ఎంసీలోనే పని చేయాల్సి ఉంది. ఎందుకంటే నిర్మాణ రంగ అనుమతుల జారీ ఒకే కేంద్రంగా కొనసాగాలి.. కానీ డిజాస్టర్‌ పేరిట హైడ్రాలోనే ఫైర్‌ విభాగం అధికారులు పని చేస్తున్నారు. వాస్తవంగా 15 మీటర్ల లోపు నిర్మాణ రంగ అనుమతుల ప్రక్రియలో భాగంగా జీహెచ్‌ఎంసీలో ఫైర్‌ ఎన్‌వోసీకి సంబంధించి చలాన్‌ (క్యాష్‌) చెల్లించిన నిర్మాణదారులకు ఒకే గొడుగు కింద సేవలు అందాలి. కానీ జీహెచ్‌ఎంసీలో చలాన్‌ కడితే జారీ మాత్రం హైడ్రా కేంద్రంగా ఉన్న ఫైర్‌ విభాగం అధికారుల పరిశీలన అనంతరం ప్రొవిజినల్‌ సర్టిఫికెట్‌ (ఫైర్‌ ఎన్‌వోసీ సర్టిఫికెట్‌) తీసుకోవాల్సి వస్తున్నది. దీంతో రెండు శాఖల చుట్టూ నిర్మాణదారుడికి ప్రదక్షిణలు తప్పడం లేదు.

పాట్నీలో పంతం
తాజాగా రసూల్‌పురా నాలా వద్ద కబ్జాలను తొలగించడంతో పాటు పాట్నీ సెంటర్‌ వద్ద వాణిజ్య నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చేశారు. కంటోన్మెంట్‌ సీఈవో మధుకర్‌ నాయక్‌ ఈ వ్యవహారంపై హైడ్రాతో వివాదానికి దిగారు. తమ పరిధిలోకి ఎలా వస్తారంటూ నిలదీశారు. దీంతో హైడ్రా ఒకడుగు వెనక్కి వేసి.. తర్వాత రోజు ఆయనకు సమాచారం ఇచ్చి.. ప్యాట్నీ వద్ద నాలాను కూల్చివేశారు. అంతేకాదు.. చీకోటి గార్డెన్స్‌, ప్రకాశ్‌నగర్‌ మెట్రోస్టేషన్‌ వద్ద కూడా నాలాలపై కూల్చివేతలకు ప్రయత్నాలు చేశారు.

అయితే, వర్షం కురుస్తున్న ప్రతిసారి బేగంపేట రహదారి షాపర్‌ స్టాప్‌ ప్రాంతంలోని పెట్రోల్‌ పంపు వద్ద భారీగా వర్షం నీరు నిలుస్తుంది. ఈ విషయమై హైడ్రా అధికారులు, సికింద్రాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ అధికారులతో కలిసి ఒక ప్లాన్‌ వేశారు. వర్షం నీరు ఎందుకు ముందుకు పోవడం లేదు.. రహదారిపై ఎందుకు నిలుస్తుంది.. అనే అంశాలను పరిశీలించి ప్రకాశ్‌ నగర్‌లో ప్రవహిస్తున్న నాలా కారణంగా చూపించారు. కానీ, దీనిపై తాము సమగ్ర నివేదిక ఇస్తామంటూ అటు కార్పొరేషన్‌ చెప్పడంతో.. హైడ్రా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది.

కొత్తది కాదుగా… పాతదే
గ్రేటర్‌ పరిధిలో నాలాలపై అక్రమంగా కొన్ని నిర్మాణాలు ఉన్నాయని, నగరంలో 30 వేల నాలాల ఆక్రమణలు గుర్తించినట్లు అధికారులు గతంలోనే చెప్పారు. కానీ, గతంలో కిర్లోస్కర్‌ కమిటీ నివేదికకు.. ఇప్పుడు హైడ్రా నివేదికకు చాలా తేడాలున్నాయి. హైదరాబాద్‌ నగరంలో నాలాల ఆక్రమణలను ఇరవై నాలుగేళ్ల కిందటే గుర్తించారు. చంద్రబాబు ప్రభుత్వంలో కిర్లొస్కర్‌ కమిటీ సిటీలో నాలాలపై ఆక్రమణలు ఎన్ని.. వాటి స్థితిగతులపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 14 వేల నాలాల ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించింది.

ఆక్రమణల తొలగింపు, పునరావాసానికి రూ.700 కోట్ల నిధులు అవసరమని అంచనా వేసింది. కాలక్రమేణా అంచనా వ్యయం మారిందే తప్ప ఆక్రమణలకు అడ్డుకట్ట పడలేదు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు నాలాల ఆక్రమణలు తొలగించే ప్రయత్నం చేయలేదు. పైగా, ప్ర‌స్తుతం నాలాలపై కూల్చివేతల్ని మొదలెట్టింది. అది కూడా జీహెచ్‌ఎంసీకి సంబంధం లేకుండా. ఫలితంగా ఇప్పుడు రెండు విభాగాలు నడిరోడ్డుపై ప్రచ్ఛన్న యుద్ధానికి దిగుతున్నాయి.

This website uses cookies.