Categories: TOP STORIES

రెరా విధించే జ‌రిమానాల్ని ఎంత‌మంది చెల్లించారు?

  • 2022 నుంచి 2024- 400 ప్రాజెక్టుల‌పై- రూ. 50,000- 30 లక్షల దాకా జ‌రిమానా విధింపు
  • వసూలు చేసింది కేవలం రూ. 85 లక్షలే.
  • 2023: 56 కంపెనీలకు నోటీసులు
  • 13 ప్రాజెక్టుల‌పై రూ.4.30 కోట్ల జ‌రిమానా
  • ఒక్క‌రూ న‌యాపైసా క‌ట్ట‌లేదు
  • ఏజెంట్ల‌పై రూ.1.30 కోట్ల జ‌రిమానా
  • ఒక్క రూపాయి కూడా చెల్లించ‌లేని ఏజెంట్లు

తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప‌రిధిలో ఉన్న పుర‌పాల‌క శాఖ విభాగంలోని టీజీ రెరా వ్య‌వ‌స్థ దారుణంగా త‌యారైంది. నిబంధ‌న‌ల్ని పాటించ‌ని బిల్డ‌ర్ల మీద టీజీ రెరా జ‌రిమానా విధిస్తే.. వాటిని చెల్లించేందుకు కొంద‌రు డెవ‌ల‌ప‌ర్లు, ఏజెంట్లు, రియ‌ల్ కంపెనీలు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేదు. జ‌రిమానా చెల్లించ‌క‌పోతే టీజీ రెరా అథారిటీ ఏం చేస్తుందిలే అంటూ లైట్ తీసుకుంటున్నారు. తెలంగాణ‌లో రెరా వ్య‌వ‌స్థ ఏర్పాటైన‌ప్ప‌ట్నుంచి చూస్తే.. జ‌రిమానాలు క‌ట్టిన బిల్డ‌ర్లు, ఏజెంట్ల సంఖ్య‌ను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు.

రెరా చ‌ట్టం ప్ర‌కారం.. 500 గ‌జాల కంటే ఎక్కువ‌.. 8 లేదా అంత‌కంటే ఎక్కువ ఫ్లాట్ల‌ను క‌ట్టే బిల్డ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా రెరాలో న‌మోదు కావాల్సిందే. ఇప్ప‌టివ‌ర‌కూ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇత‌ర మున్సిపాలిటీల్లో సుమారు 9 వేల ప్రాజెక్టులు నమోదు కాగా.. అందులో కేవ‌లం 3800 మాత్రమే రెరాలో న‌మోద‌య్యాయి. అంటే, రెరా న‌మోదులోనే నిర్లక్షంగా స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌న్న‌మాట‌. నిబంధ‌న‌ల్ని పాటించ‌ని బిల్డ‌ర్ల‌పై టీజీ రెరా భారీగానే జరిమానాల్ని విధిస్తోంది. 2022 నుంచి 2024 వరకు దాదాపు 400 ప్రాజెక్టులపై.. రూ. 50వేల నుంచి రూ. 30 లక్షల వరకు జరిమానాల్ని విధించింది. కానీ, ఆ రెండేళ్ల‌లో రెరా వసూలు చేసింది కేవలం రూ. 85 లక్షలే. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ పరిధిలోని అనధికార లేఅవుట్లు, అపార్ట్‌మెంట్ల విషయంలో రెరా నోటీసులకు దిక్కేలేదు. యాభై శాతానికిపైగా బిల్డ‌ర్లు రెరాలో న‌మోదు చేయ‌కుండానే అపార్టుమెంట్లు, వెంచ‌ర్ల‌ను విక్ర‌యిస్తున్నారు. ఇవన్నీ రెరా దృష్టికి వచ్చినా.. ఫిర్యాదు అంద‌లేద‌నే ఒకే ఒక్క‌ సాకుతో టీజీ రెరా సైలెంట్‌గా ఉంటోంది. నిజానికి, అక్రమ లేఅవుట్ల‌లో ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ కాగానే రెరాకు స‌మాచారం తెలియాలి. ఇందుకోసం రిజిస్ట్రేష‌న్ శాఖ‌తో స‌మ‌న్వ‌యం కావాలి. కానీ, ఆ దిశ‌గా ముంద‌డుగు ప‌డ‌లేదు.

2022లో 48 సంస్థలకు జ‌రిమానాలు క‌ట్ట‌మ‌ని రెరా ఆదేశిస్తే.. అందులో నాలుగంటే నాలుగే సంస్థ‌లు చెల్లించాయి. 2023లో 56 కంపెనీలకు నోటీసులివ్వగా.. వీటిలో ఒకేసారి 13 కంపెనీలకు నోటీసులిచ్చారు. ఈ 13 సంస్థలతో పాటుగా పలు సంస్థలకు పని చేస్తున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు కూడా నోటీసుల్ని జారీ చేశారు. నోటీసులు అందుకున్న సంస్థల్లో నీమ్స్‌బోరో గ్రూప్, ఎక్సలెన్స్ ప్రాపర్టీస్, సనాలి గ్రూప్, అర్బన్ యార్డ్స్, హ్యాపీ డ్రీమ్ హోమ్స్, విరాటా డెవలపర్స్, రివెండెల్ ఫార్మ్స్, కావురి హిల్స్, సెవెన్ హిల్స్, బిల్డాక్స్, సుమధుర ఇన్ఫ్రా తో పాటుగా హ్యాపీ డ్రీమ్స్ ప్రాజెక్ట్ ఏజెంట్, విరాటా డెవలపర్స్ ఏజెంట్ డేవిడ్ రాజు, అర్బన్ యార్డుల ఏజెంట్ లక్ష్మీనారాయణ, సెవెన్ హిల్స్ ఏజెంట్ జె. వెంకటేష్ కు జరిమానా విధించారు. ఈ పద‌మూడు ప్రాజెక్టుల‌కు రూ.4.30 కోట్ల జ‌రిమానా విధించ‌గా.. అందులో ఒక్క సంస్థా జ‌రిమానా చెల్లించ‌లేదు. ఏజెంట్ల‌కు రూ.1.30 కోట్ల జ‌రిమానా విధించ‌గా.. వాళ్లూ క‌ట్ట‌లేదు. కానీ, ఆత‌ర్వాత ఆయా సంస్థ‌లు, ఏజెంట్ల‌ను టీజీ రెరా ఏం చేసింద‌నే విష‌యాన్ని ఏలిన‌వారికే తెలియాలి.

ALSO READ: 22 ఫ్లాట్ల భవనం.. రూ.400 కోట్లు

గతేడాది ఒక కేసులో.. ఇంటి కొనుగోలుదారునికి పగడాల కన్స్ట్రక్షన్స్‌ను రూ. 12.1 లక్షలు తిరిగి చెల్లించాలని తీర్పునిచ్చారు. బిల్డర్‌కు రూ. 2.69 లక్షల జరిమానా విధించారు. దీనిపై ఇటీవల పోలీసు కేసు పెడ‌తామని మరో నోటీసు ఇచ్చారు. కానీ, ఇంత వరకూ ఆయా సంస్థ జ‌రిమానా చెల్లించ‌లేదు.

మార్కెట్‌లోని కొంతమంది పెద్ద బిల్డర్లు రెరా ఇచ్చే నోటీసులను చూసి నవ్వుకుంటున్నారు. ఒక్కో సంస్థకు ప్రాజెక్ట్ విలువలో 10 శాతం జరిమానా విధించినట్లుగా రెరా ఇచ్చే తీర్పుల‌ను తేలిగ్గా తీసిపారేస్తున్నారు. రెరా అనుమతులు లేకుండా చాలా సంస్థలు నిర్మాణాలకు పునాదులు వేసి.. అక్కడో ఇండ్ల జాతర తరహాలో ప్రీ-లాంచ్‌ ఆఫర్లతో అదరగొడుతున్నా.. రెరా చూస్తూ ఉంటుందే తప్ప అక్కడ ఎలాంటి చర్యల్ని తీసుకోవ‌ట్లేదు. అంతేకాదు.. ప్రీ లాంచ్‌లపై ఫిర్యాదులు వస్తేనే చూస్తామంటూ చెబుతుంది. అయితే ఒకరిద్దరు ఫిర్యాదు చేసినా.. పరిశీలన పేరుతో కాలయాపన చేస్తూనే ఉన్నారు. ప‌త్రిక‌ల్లో వ‌చ్చే ప్రీలాంచ్ క‌థ‌నాలు టీజీ రెరాకు కాసుల వ‌ర్షం కురిపిస్తుంద‌నే విమ‌ర్శ‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

ఇత‌ర రాష్ట్రాల్లో..
నిజానికి, రెరా అథారిటీకి ఆయా రాష్ట్రాల్లో చాలా పవర్‌ ఫుల్‌గా అధికారాలున్నాయి. ఇచ్చిన నోటీసులకు స్పందించకుంటే కేసుల పాలైన నిర్మాణ సంస్థలున్నాయి. గురుగ్రామ్‌లోని హర్యానా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ.. రియల్ ఎస్టేట్ ప్రమోటర్ అయిన బ్రహ్మ సిటీ ప్రైవేట్ లిమిటెడ్‌పై 2016 రియల్ ఎస్టేట్ (నియంత్రణ మరియు అభివృద్ధి) చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ. 2.50 కోట్ల జరిమానా విధించింది.

రెరాలో నమోదు చేసుకోకుండానే 219 ప్లాట్‌లను విక్రయించ‌డంతో రూ. 2.50 కోట్లు జరిమానా వేసింది. నెల రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. కానీ, సదరు సంస్థ ఆలస్యం చేయడంతో.. 24 రోజుల పాటు నిర్మాణ సంస్థ యాజమాన్యాన్ని జైలులో పెట్టారు. ఆ తర్వాత జరిమానా చెల్లించాకే విడుదల చేశారు. మ‌రి, టీజీ రెరా వ్య‌వ‌స్థ ఇంత ధైర్యంగా ఎప్పుడు వ్య‌వ‌హ‌రిస్తుంది? కొనుగోలుదారుల్ని మోసం చేసిన బిల్డ‌ర్ల‌ను ఎప్పుడు దారిలోకి తెస్తుంది?

This website uses cookies.