Categories: TOP STORIES

మ‌ళ్లీ జెట్ స్పీడుతో.. హైద‌రాబాద్ రియాల్టీ!

ఇప్పడిదాకా ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క అంటోంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం. నిన్న, మొన్నటి వరకు నిలకడగా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం.. మరో ఆరు నెలల్లో జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తుందని నిపుణులు చెబుతున్నారు. 2023 నవంబర్ వరకు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వ‌స్తే.. రియల్ ఎస్టేట్ ఢమాల్ అవుతుంద‌ని.. పడిపోతుందని తెగ ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగిందని.. కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అదంతా తలకిందులు అవుతుందని ప్రచారం చేశారు. కానీ అధికారిక రియల్ ఎస్టేట్ గణంకాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయ‌ని గుర్తుంచుకోండి.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… రియల్ ఎస్టేట్ అంతకంతకూ పెరిగిపోతోందని గణాంకాలు చెబుతున్నాయి. మార్చి నెలలో ఏకంగా 4 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులను కొన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కాస్త వెనక్కి వెళ్లి చూస్తే.. ఈ ఏడాది జనవరిలో 3,290 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగితే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి 2023 జనవరిలో 2650 కోట్ల వ్యాపారం మాత్రమే జరిగింది. అంటే ఏడాది తర్వాత అదే నెలలో ప్రభుత్వం మారాక దాదాపు 600 కోట్లు అదనంగా బిజినెస్ జరిగిందన్నమాట. ఆ తర్వాత ఏప్రిల్, మే లో సార్వత్రిక ఎన్నికలు జరగడంతో… రియల్ దందా కాస్త నెమ్మ‌దించింది. వాస్తవానికి ఏ ఎన్నికల సీజన్‌ అయినా.. కోడ్‌ అమల్లో ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ మార్కెట్ నెమ్మ‌దించింది. సరిగ్గా ఇప్పుడు కూడా అదే జరిగింది.

మరోవైపు ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌పై అమరావతి రాజధాని ప్రభావం చూపుతుందని మరో ప్రచారం తెరపైకి వచ్చింది. ఇప్పుడంతా రియల్ ఎస్టేట్ రంగంలో ఇదే చర్చ నడుస్తోంది. అయితే అమరావతికి, హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌కు సంబంధం ఏమిట‌న్న‌ది కాస్త ఆలోచించాల్సిన విషయం. మనం కాస్త లోతుగా వెళితే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం సమయంలో కూడా ఇలాంటి చర్చే నడిచింది. ఏపీలో కొత్తగా అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో.. ఆ సమయంలో హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌పై ప్రభావం చూపింది. కానీ అది మూడు నాళ్ళ ముచ్చటగానే ముగిసింది. హైదరాబాద్‌లో తెలంగాణ ఏర్పాటు అనంతరం రియల్ ఎస్టేట్ రంగంలో కాస్త స్తబ్దత ఏర్పడినప్పటికీ, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో తిరిగి మళ్ళీ వేగం పుంజుకుంది. టాప్ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున హైదరాబాద్ చుట్టూ విస్తరించాయి. హైదరాబాద్‌లోని పశ్చిమ ప్రాంతంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ పుంజుకుంది.

అయితే 2019లో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి రాజధాని అభివృద్ధిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించగానే, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బూమ్‌ ఊపందుకుంది. దేశంలోనే అత్యధికంగా అమ్మ‌కాలు నమోదయ్యాయి. ఇంతవరకు సాఫీగా సాగినప్పటికీ.. ప్రస్తుతం ఏపీలో అమరావతి రాజధాని అభివృద్ధి పున: ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించగానే, మరోసారి ఏపీలో రియల్ ఎస్టేట్ ఆశలు పుంజుకున్నాయి. దీని ప్రభావం హైదరాబాద్ రియల్ రంగంపై పడుతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదేం కొత్త ప్రచారం కాదంటున్నారు రియల్ ఎస్టేట్‌ నిపుణులు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఇలాంటి చర్చే నడిచిందని.. కానీ ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. హైదరాబాద్ రియాల్టీని పరుగులు పెట్టించాయన్న విషయాన్ని రియల్ రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు.

* తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం భాగ్యనగరంపై ఎక్కువగా ఫోకస్‌ పెట్టడం, జీహెచ్ఎంసీ పరిధిని పెంచడం, నగర శివారుల వరకు మెట్రోను పొడగించడం.. ఇలాంటి నిర్ణయాలు రియల్ ఎస్టేట్‌కు ప్రాణం పోస్తాయని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో ఐదారు నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో పరుగులు పెడుతుందంటున్నారు. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని రకాలుగా ప్రచారం చేసిన హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌కు ఢోకా లేదని ఫుల్ కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నారు.

This website uses cookies.