Categories: TOP STORIES

రూ.2.5 కోట్లతో ఇల్లు కొంటే గ్రీస్ లో శాశ్వ‌త‌ నివాసం

గ్రీస్ లో శాశ్వత నివాసం ఏర్పరుచుకోవాలని అనుకుంటున్నారా? ఆ సుందరమైన దేశంలో నివసించాలని భావిస్తున్నారా? అయితే, త్వరపడాల్సిందే. గోల్డెన్ వీసా ప్రోగ్రాం కింద గ్రీస్ లో స్థిరపడాలని అనుకునేవారు ఆ మొత్తం పెరగక ముందే అక్కడ ఓ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని సొంతం చేసుకోవాలి. 2024 ఆగస్టు 31 తర్వాత ఈ వీసా కింద శాశ్వ‌త‌ నివాసం కోసం పెట్టాల్సిన రియల్ పెట్టుబడుల మొత్తం మరింత పెరగనుంది. ప్రస్తుతం ఉన్న పెట్టుబడి మొత్తానికి దాదాపు డబుల్ పెరగనుంది. ఆగస్టు 31 తర్వాత కనీస పెట్టుబడి మొత్తానికి సంబంధించి రెండు శ్లాబులు ప్రవేశపెడుతున్నారు.

ఆట్టికా, థెస్సాలోనికి, మైకోనస్, శాంటోరిని వంటి టైర్-1 నగరాల్లో కనీస పెట్టుబడిని 8 లక్షల పౌండ్లకు (దాదాపు రూ.8.5 కోట్లు) పెంచనున్నారు. ప్రస్తుతం ఇది 5 లక్షల పౌండ్లుగా(రూ.5.3 కోట్లు) ఉంది. అలాగే గ్రీస్ లోని టైర్-2 నగరాల్లో ప్రస్తుతం ఉన్న 2.5 లక్షల పౌండ్లను(దాదాపు రూ.2.6కోట్లు) 4 లక్షల పౌండ్లకు (రూ.4.2 కోట్లు) పెంచుతున్నారు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రాపర్టీ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి రియల్టర్లు చెబుతున్నారు. అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

పైగా విదేశీ పెట్టుబడిదారులు గ్రీస్ లోనే నివసించాలనే నిబంధన ఏదీ లేదని.. ప్రాపర్టీ కొనుగోలు చేసి అద్దెకు కూడా ఇచ్చే అవకాశం వస్తోందని చెబుతున్నారు. ఆగస్టు 31 గా 2.5 లక్షల పౌండ్ల పెట్టుబడిలో 10 శాతం చెల్లించి గోల్డెన్ వీసా పొందొచ్చని.. మిగిలిన మొత్తాన్ని డిసెంబర్ 31లోగా చెల్లించి ప్రాపర్టీ సొంతం చేసుకుంటే సరిపోతుందని వివరిస్తున్నారు. వీసా మొత్తం కుటుంబానికి వర్తిస్తుందని.. కొనుగోలు చేసిన వ్యక్తితోపాటు భార్య లేదా భర్త, పెళ్లి కాని 21 ఏళ్ల లోపు పిల్లలు, భార్యాభర్తల ఇరువరి తల్లిదండ్రులకు అది వర్తిస్తుందని చెప్పారు.

This website uses cookies.