Categories: TOP STORIES

ప‌లు ప్రాంతాల్లో.. సంపుల నిర్మాణం

పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ

దానకిశోర్ ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా జర్నిలిస్టు కాలనీలోని పాలపిట్ట సర్కిల్ పరిసర ప్రాంతాల్లో తిరిగి రహదారులపై ఉన్న ప్యాచ్ వర్క్స్ చేయకుండా వదిలేసిన గుంతలను పరిశీలించి స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పనులు చేపట్టినా.. ఎప్పటికప్పుడు రోడ్డు పునరుద్ధరణ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అదే ప్రాంతంలోని వాటర్ లాగింగ్ పాయింట్ ను గుర్తించి సంపు నిర్మించడానికి అనువైన ప్రాంతాన్ని చూడాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.

వర్షం కాలంలో అంటు వ్యాధులు ప్రబలించే అవకాశం ఉన్నందున.. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న గార్బేజీ వనరబుల్ పాయింట్లపై (తరచూ చెత్త వేసే ప్రాంతాలు) ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.45, రోడ్ నం.70, గౌతంనగర్ బస్తీ, దీన్ దయాళ్ నగర్ బస్తీ, ఫిల్మ్ నగర్, పీఈటీ పార్క్ ప్రాంతాల్లో తరచూ చెత్త వేసే ప్రాంతాలు పరిశీలించారు. అక్కడ పని చేస్తున్నఎస్ఎఫ్ఏ, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.

పనితీరుపై వివరాలు ఆరా తీశారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరు తదితర వివరాలను పారదర్శకంగా నమోదు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏదైనా సమస్యలుంటే.. ఉన్నతాధికారులకు తెలియజేయాలని కార్మికులకు చెప్పారు. పని వేళల్లో కార్మికులు తప్పనిసరిగా యూనిఫాం, హ్యాండ్ గ్లౌజ్ ధరించి.. రక్షణ చర్యలు పాటించాలన్నారు. అలాగే నగరంలో చెత్త ఎక్కువగా ఉత్పన్నమయ్యే ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అలాంటి ప్రాంతాల్లో రెండు షిఫ్టులో చెత్త సేకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం.. పలు వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న నీటి నిల్వ సంపుల పనుల్ని పరిశీలించారు. వర్షాకాలంలో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం వాటర్ లాగింగ్ పాయింట్లలో సంపుల నిర్మాణం చేపట్టాలని సంకల్పించింది. మొత్తం 140 వాటర్ లాగింగ్ పాయింట్లు ఉండగా.. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి అనువైన స్థలంలో ఈ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది.

అందులో భాగంగా ఖైరతాబాద్ జోన్, జూబ్లీహిల్ సర్కిళ్లలో రూ. 20 కోట్లతో మొత్తం 11 ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల సంపులు నిర్మిస్తారు. వర్షం కురిసే సమయంలో ఈ సంపుల్లో నీటిని సేకరించి.. అనంతరం సమీపంలో ఉన్న నాలాల్లో పంపింగ్ చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతం వీటి పనులు వేగంగా నడుస్తున్నాయి. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఈఈ విజయ్ కుమార్, జలమండలి జీఎం హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

This website uses cookies.