సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అయితే ఈ రోజుల్లో మధ్యతరగతి వారు సొంతంగా ఇల్లు కొనుక్కునే పరిస్థితి కనిపించడం లేదు. హైదరాబాద్ లో ఎక్కడ ఇల్లు కొనాలన్నా లక్షలు, కోట్ల రూపాయలు పెట్టాల్సిందే. అందుకే మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకుని నిర్మాణసంస్థలు అందుబాటు ధరల్లో గృహాలను నిర్మించాల్సిన అవసరం ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎక్కడో ఓ చోట.. ఎప్పుడో ఒకప్పుడు సొంత గూడును ఏర్పాటు చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారైతే ఏళ్ల తరబడి సంపాదించిన సొమ్మును పొదుపు చేసుకుని, అందుకు తోడు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సొంతింటి కోసం ప్రయత్నిస్తుంటారు. ఐతే ఈ మధ్య కాలంలో ఇంటి స్థలాల ధరలు, గృహాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే ఇంటిని కొనుగోలు చేయాలంటే లక్షలు, కోట్ల రూపాయలు కావాల్సిందే. పెరిగిన ఇంటి స్థలం ధరలకు తోడు నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇంటి ధరలు ఇప్పుడు మధ్య తరగతివారికి అందుబాటులో లేకుండాపోయాయి.
అందుకే ఇప్పుడు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు. Affordable Housing Project అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులతో అటు బిల్డర్లకు, ఇటు కొనుగోలుదారులకు ఇరువురికీ ప్రయోజనాలు ఉన్నప్పటికీ చాలా మంది బిల్డర్లు కేవలం అధిక ధరలతో కూడిన ప్రాజెక్టుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో నెలకు 50 వేల వేతనం ఉన్నప్పటికీ చాలా మంది ఇల్లు కొనుగోలుకు ధైర్యం చేయడం లేదు.
అందరికీ ఇల్లు ఉండాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు పలు ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోంది. ఇందులో అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్ట్స్ చేపట్టే బిల్డర్లకు కూడా ప్రోత్సాహకాలు ఉన్నాయి. Residential unit రెసిడెన్షియల్ యూనిట్ ఒక్కొక్కటి మెట్రో నగరాలైతే 60 చదరపు మీటర్లు, నానో మెట్రో ప్రాంతాలైతే 90 చదరపు మీటర్లకు మించకుండా ఉండే వాటిని అఫర్టబుల్ ప్రాజెక్టుల క్రింద గుర్తిస్తోంది. ప్రాపర్టీ స్టాంప్ విలువ 45 లక్షలకు మించని ఇళ్లకు కేంద్రం పలు రాయితీలు అందిస్తోంది. ఇలాంటి ప్రాజెక్టులు నిర్మిస్తే వచ్చే లాభాలకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కొనుగోలుదారులు అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టుల్లో కొనుగోలు చేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసినప్పుడు సాధారణంగా జీఎస్టీ 5 శాతం చెల్లించాలి. కానీ అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులో ఇంటిని కొనుగోలు చేస్తే జీఎస్టీ కేవలం 1 శాతం మాత్రమే ఉంటుంది. అంతేకాదు ఆదాయ పన్ను నుంచి భారీ మినహాయింపులు పొందుతారు. హోం లోన్పై ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 24 ద్వారా సాధారణంగా 2 లక్షల మేర వడ్డీ చెల్లింపులను పన్ను మినహాయింపుగా చూపవచ్చు. అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టుల విషయంలో బిల్డర్లకు, కొనుగోలుదారులకు ఇద్దరికీ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఈ తరహా ప్రాజెక్టులు రావడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్లో శివారు ప్రాంతాల్లో కూడా 45 లక్షల పైబడి ప్రాజెక్టులే తప్ప అఫర్డబులిటీని దృష్టిలో పెట్టుకుని బిల్డర్లు ప్రాజెక్టులు నిర్మించడం లేదు. 45 లక్షల రేంజ్ నుంచి 60 లక్షల రేంజ్ ధరల్లో ఇళ్లు లభిస్తే మెజార్టీ సంఖ్యలో ఉన్న మధ్యతరగతి వారి సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు నిర్మాణరంగం కూడా పెద్ద ఎత్తున పుంజుకుంటుంది.
ఇంటి కొనుగోలుదారులకు హోంలోన్ మార్జిన్ మనీతోపాటు ప్రధానంగా జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, వుడ్ వర్క్ వంటి కంపోనెంట్లు భారంగా కనిపించడంతో ఇంటి కొనుగోలుకు మధ్య తరగతి వారు కొంత మేర వెనకంజ వేస్తున్నారు. ఒకవేళ రాయితీలతో భూములను ఇచ్చి అఫర్డబుల్ హౌజింగ్ ను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో గృహ నిర్మాణం మరింత వేగంగా పుంజుకునే అవకాశం ఉందని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సరసమైన గృహాల నిర్వచనం మార్చాలని కేంద్రానికి నరెడ్కో జాతీయ కార్యవర్గం సూచించింది. ప్రస్తుతం సరసమైన గృహమంటే రూ.45 లక్షల ధరగా ఉంది. విస్తీర్ణం 650 చదరపు అడుగుల వరకు మాత్రమే. ఈ ధరను రూ.కోటికి పెంచాలని కోరారు. దీంతో జీఎస్టీ, ఆదాయపన్నుల్లో రాయితీలు లభిస్తాయి. ఆ మేరకు ప్రయోజనాన్ని బిల్డర్లు కొనుగోలుదారులకు బదలాయిస్తారు. విస్తీర్ణం విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలి. ముంబయిలో 650 చదరపు అడుగుల ఫ్లాట్ అంటే ఫర్వాలేదు కానీ మన దగ్గర ఇంత విస్తీర్ణంలో కడితే కొనడానికి ముందుకు రారు. ఈ విజ్ఞప్తులపై త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని నరెడ్కో తెలంగాణ కార్యవర్గం పేర్కొంది.