Categories: LATEST UPDATES

నిర్మాత పరాగ్ సంఘ్వీ అరెస్టు

ప్రముఖ నిర్మాత, అలుంబ్రా ఎంటర్ టైన్మెంట్ సీఈఓ పరాగ్ సంఘ్వీ చీటింగ్ కేసులో అరెస్టయ్యారు. రూ.13.7 కోట్ల చీటింగ్ కేసుకు సంబంధించి సోమవారం ముంబై ఆర్థిక నేరాల విభాగం సిట్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం ఆయనకు జనవరి 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కమ్లా ల్యాండ్ మార్క్ సంస్థ డైరెక్టర్ జితేంద్ర జైన్ తో కలిసి ఓ నిర్మాణ సంస్థలో సంఘ్వీ భాగస్వామిగా ఉన్నారు. ఇళ్ల కొనుగోలుదారులను మోసం చేశారనే కేసులో 2106లోనే జైన్ అరెస్టు కాగా, తాజాగా సంఘ్వీపై కేసు నమోదైంది. కమ్లా ల్యాండ్ మార్క్ గ్రూప్ కు చెందిన కమ్లా ఇన్ ఫ్రా, కమ్లా ల్యాండ్ మార్క్ ప్రాపర్టీస్ నుంచి సుజల్ డెవలపర్స్ 2013లో మూడే ఫ్లాట్లు కొనుగోలు చేసింది. అయితే, జైన్ అభ్యర్థన మేరకు సుజల్ డెవలపర్స్ ఆ ఫ్లాట్లను అలుంబరా, మెటాలికా ప్రైవేటే లిమిటెడ్ సంస్థలకు అద్దెకు ఇచ్చింది. ఆ ఫ్లాట్లు అద్దెకు ఇచ్చినప్పటికీ, యాజమానికి తెలియకుండా జైన్, సంఘ్వీలు వాటిని మరొకరికి విక్రయించారు. ఫలితంగా సుజల్ డెవలపర్స్ కి రూ.13.7 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ చేసిన ఫిర్యాదు ఆధారంగా సంఘ్వీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి తొలుత సంఘ్వీ చార్టెర్డ్ అకౌంటెంట్ ను పోలీసులు విచారించి, పలు పత్రాలు, ఐటీ రిటర్నులు పరిశీలించారు. ఈ సందర్భంగా కమలా ల్యాండ్ మార్క్ కంపెనీకి సంబంధించిన మొత్తాన్ని పీబీ లైఫ్ స్టైల్ కి బదిలీ చేసినట్టు గుర్తించారు. అనంతరం నాలుగు వేర్వేరు కంపెనీలకు ఈ మొత్తం బదలాయించినట్టు కనుగొన్నారు. దీంతో మొత్తం ఐదు కేసులు సంఘ్వీకి వ్యతిరేకంగా నమోదు కాగా, రెండింటిలో చార్జిషేటు దాఖలు చేశారు. మరో మూడు పెండింగ్ లో ఉన్నాయి.

This website uses cookies.