భాగ్యనగరంలో రియల్ రంగం కాస్త డీలా పడింది. హైదరాబాద్ లో ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు భారీగా తగ్గాయి. గతేడాది తొలి క్వార్టర్ తో పోలిస్తే ఏకంగా 49 శాతం మేర తగ్గుదల నమోదైంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో కూడా అమ్మకాలు తగ్గాయి.
గతేడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో అమ్మకాలు 28 శాతం మేర తగ్గి 93,280 యూనిట్లు నమోదైనట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అనరాక్ పేర్కొంది. గతేడాది తొలి త్రైమాసికంలో ఈ నగరాల్లో అమ్మకాలు 1,30,170 యూనిట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 49 శాతం తగ్గి 10,100 యూనిట్లుగా ఉన్నాయి. 2024 మొదటి క్వార్టర్లో 19,660 యూనిట్లు అమ్ముడయ్యాయి. నగరాలవారీగా చూస్తే.. ఢిల్లీ మార్కెట్లో జనవరి-మార్చి మధ్య అమ్మకాలు 20 శాతం తక్కువగా 12,520 యూనిట్లకు పరిమిమయ్యాయి.
గతేడాది తొలి క్వార్టర్లో ఇక్కడ 15,650 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో విక్రయాలు 26 శాతం క్షీణించి 31,610 యూనిట్లకు పరిమితమయ్యాయి. బెంగళూరులో అమ్మకాలు 16 శాతం తక్కువగా 15,000 యూనిట్లకు పరిమితమయ్యాయి. పుణెలోనూ క్రితం ఏడాది క్యూ1తో పోల్చి చూస్తే 30 శాతం తగ్గి 16,100 యూనిట్లుగా నమోదయ్యాయి. చెన్నైలో అమ్మకాలు 26 శాతం క్షీణించి 4,050 యూనిట్లుగా రికార్డయ్యాయి. కోల్కతా మార్కెట్లోనూ 31 శాతం తక్కువగా 3,900 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది తొలి క్వార్టర్లో అమ్మకాలు 5,650 యూనిట్లుగా ఉన్నాయి. దేశ ఆర్థిక పరిస్థితులు సానుకూలంగానే ఉన్నప్పటికీ, ఇళ్ల ధరలు పెరిగిపోవడం, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు రియల్ ఎస్టేట్ లావాదేవీలపై ప్రభావం చూపించినట్టు అనరాక్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు.
This website uses cookies.