- మొత్తం 86.1 కిలోమీటర్లు
- రూ.19,579 కోట్ల అంచనా వ్యయం
హైదరాబాద్ మెట్రో విస్తరణకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెట్రో సెకండ్ ఫేజ్ లో భాగంగా మొత్తం మూడు మార్గాల్లో మెట్రోను విస్తరించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును 86.1 కిలోమీటర్ల విస్తరణకు రూ.19,579 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ తో చేపట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. మెట్రో కారిడార్-1లో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలో మీటర్లు.. కారిడార్-2 లో జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలో మీటర్లు.. కారిడార్-3లో జూబ్లీ బస్టేషన్ నుంచి శామీర్ పేట వరకు 22 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు కేబినెట్ తీర్మానించింది.
మెట్రో రూట్ నెంబర్-1
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫోర్త్ సిటీ వరకు మెట్రో మొదటి మార్గాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మొత్తం 39.6 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించారు. విమానాశ్రయంలో టర్మినల్ స్టేషన్ భూగర్భంలో ఉండేలా డిజైన్ చేశారు. ఈ మార్గంలో రావిర్యాల ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ లో మెట్రో వెళితే.. అక్కడి నుంచి ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో నుంచి భూమార్గంలో 18 కిలోమీటర్లు వెళ్లేలా మెట్రో ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భగంగా భూగర్భ మార్గం మీదుగా 2 కిలోమీటర్లు, ఎలివేటెడ్ మార్గంలో 6 కిలో మీటర్లు, ఓఆర్ఆర్ వెంట ఎలివేటెడ్ మార్గం 14 కిలోమీటర్లు, భూమిపై 18 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ నిర్మాణం జరగనుంది.
ALSO READ: IAS IPS Bhoodan land scam ‘భూదాన్’ అక్రమాల్లో ఐఏఎస్, ఐపీఎస్లు
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్ట్ నుంచి కేవలం 40 నిమిషాల్లో ప్యూచర్సిటీకి వెళ్లేలా మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుపుకోనుంది. ఫ్యూచర్సిటీ కి అనువుగా గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేసి, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్వరితగతిన ఫ్యూ చర్ సిటీకి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మెట్రో కారిడార్ తో పాటు గ్రీన్ ఫీల్డ్ రోడ్లు, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోనున్నాయని అంచనా వేస్తున్నారు.
మెట్రో రూట్ నెంబర్-2
సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో రెండో మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ మార్గంలో జేబీఎస్ నుంచి కార్ఖానా, అల్వాల్, హకీంపేట, తూంకుంట, శామీర్పేట వరకు మొత్తం 24.5 కిలో మీటర్ల మేర మెట్రో మార్గం ఉంటుంది. హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్ కు సంబంధించిన రన్వే.. ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో మెట్రో రైల్ ఎలివేటెడ్ కు రక్షణ సంస్థ అభ్యంతరం తెలిపింది. దీంతో ఇక్కడ సుమారు కిలోమీటరున్నర వరకు భూగర్భంలో నుంచి మెట్రోని ప్రతిపాదించారు. రన్వే కింద నుంచి మెట్రో వెళ్లేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
మెట్రో రూట్ నెంబర్-3
ఇక సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్ పేట్ వరకు మెట్రో మూడవ మార్గాన్ని ప్రతిపాదించింది రేవంత్ సర్కార్. జేబీఎస్ నుంచి తాడ్ బండ్, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్ కు మొత్తం 22 కిలో మీటర్ల మేర మెట్రోని ప్రతిపాదించారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆంక్షలతో ఈ మార్గంతో పాటు శామీర్ పేట ట్రాక్ లు కూడా జేబీఎస్ నుంచి ప్రస్తుతమున్న కారిడార్ కన్నా తక్కువ ఎత్తులో వెళ్లేలా డిజైన్ రూపొందించారు. మూడు మార్గాల కూడలిగా జేబీఎస్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలకు అనుగుణంగా మెట్రో ఎలైన్మెంట్ను ఖరారు చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్
హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టుగా చేపట్టేలా డీపీఆర్ రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయంలో తెలంగాణ ప్రభుత్వం 30 శాతం, కేంద్ర ప్రభుత్వం 18 శాతం భరించేలా ప్రతిపాదించారు. 48 శాతం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేలా, మిగిలిన 4 శాతం పీపీపీలో సమకూర్చుకునేలా డీపీఆర్ రూపొందించారు.
మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్టుతో మొత్తం మూడు మార్గాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో మెట్రో ద్వారా నగర శివారు ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగనుండటంతో అక్కడ అందుబాటు ధరల్లో ఇళ్లను, ఇంటి స్థలాలను కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు. హైదరాబాద్ లో సొంతిల్లు కొనలేని వారు ప్రస్తుతం.. కొత్తగా వచ్చే మెట్రో మార్గంలోని ప్రాంతాల్లో ఇంటి స్థలం, ఇల్లు కొనుగోలు చేయడానికిదే మంచి సమయమని చెప్పొచ్చు.