– ముంబైలో ప్రైమ్ ల్యాండ్ అమ్మిన జితేంద్ర
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ భూ లావాదేవీ జరిగింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్ర, ఆయన కుటుంబం కలిసి ముంబై అంధేరి ప్రాంతంలోని 2.39 ఎకరాల భూమిని రూ.855 కోట్లకు విక్రయించింది. ఈ ప్రాపర్టీని తమ కుటుంబ యాజమాన్యంలో ఉన్న పాంథియోన్ బిల్డ్ కాన్ ప్రైవేట్ లిమిటెడ్, తుషార్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా విక్రయించినట్లు సమాచారం.
ఈ ఒప్పందం మే నెలలో రిజిస్టర్ అయింది. 2.39 ఎకరాల భూమి పక్కపక్కనే రెండు భాగాలుగా ఉంది. ప్రస్తుతం ఈ స్థలంలో దాదాపు 4.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు భవనాలు ఉన్నాయి. ఈ భూమిని ఎన్ టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేశాయి. ఈ లావాదేవీకి రూ.8.69 కోట్ల స్టాంప్ డ్యూటీతో పాటు రూ.30వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు.
ALSO READ: హైడ్రా.. మళ్లీ డైవర్షన్
బాలీవుడ్ లో ప్రముఖ నటీనటులు ముంబై రియల్ ఎస్టేట్ లో గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నారు. జితేంద్ర ఒక్కరే కాకుండా అమితాబ్, అక్షయ్ కుమార్ వంటి నటులు పలు ప్రాపర్టీలు కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో అమితాబ్ బచ్చన్ ఓషివారాలో ఒక డూప్లెక్స్ అపార్ట్ మెంట్ను రూ.83 కోట్లకు అమ్మేశారు. 2021లో రూ.31 కోట్లకు దీనిని కొనుగోలు చేసిన ఆయన.. ఈ విక్రయం ద్వారా 168 శాతం లాభం పొందారు.
కాగా, అమితాబ్, జయా బచ్చన్ ల ఆస్తుల మొత్తం రూ.1,578 కోట్లు అని రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్ తన అఫిడవిట్ లో ప్రకటించారు. కొన్ని నెలల క్రితం అక్షయ్ కుమార్ ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలోని ఒక ఆఫీస్ స్థలాన్ని రూ. 8 కోట్లకు విక్రయించారు. 2020లో ఆ ఆస్తిని రూ. 4.85 కోట్లకు కొనుగోలు చేసి, 65 శాతం లాభానికి విక్రయించారు.