Categories: TOP STORIES

ప‌ది శాతం పెరిగిన అద్దెలు సామాన్యుల గుండె గుబేలు

స్కూళ్లు, కాలేజీలు తెరుచుకునే టైం దగ్గరపడింది. అంతేకాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఐటీ రంగ ఉద్యోగులంతా పూర్తి స్థాయిలో ఆఫీసుల‌కు వెళుతున్నారు. దీంతో ఆఫీసులన్నీ ఉద్యోగుల‌తో కళకళలాడుతున్నాయి. అయితే ఇదంతా ఇంటి అద్దెలపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్లో క్రమంగా ఇంటి అద్దెలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా హౌజ్ రెంట్స్ భారీగా పెరుగుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో గత ఏడాదితో పోలిస్తే ప్రాంతాన్ని బట్టి 10 నుంచి 15 శాతం ఇంటి అద్దెలు పెరిగిట్లు తెలుస్తోంది.

హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మొన్నటి వరకు చతికిలపడిన రియాల్టీ క్రమంగా పుంజుకుంటోంది. నిన్నటివరకు వర్క్ ఫ్రమ్ హోంలో పని చేసిన ఐటీ తదితర రంగాల ఉద్యోగులు మళ్లీ ఆఫీస్ బాట పడుతున్నారు. దీంతో మెట్రో నగరాల్లోని ఐటీ కార్యాలయాలన్నీ కిట‌కిట‌లాడుతున్నాయి. ఐటీ ఉద్యోగులతో పాటు, ఫార్మా, ఫైనాన్స్, బ్యాంకింగ్, మ్యానుఫాక్చరింగ్ రంగాల్లోని ఉద్యోగులు, కార్మికులు పూర్తి స్థాయిలో పని చేస్తున్నారు. వర్క్ ఫ్లమ్ హోమ్ నుంచి కార్యాలయాలకు వచ్చి పని చేయడం మొదలవ్వడంతో సొంత ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు ఉద్యోగులు విచ్చేస్తున్నారు. ఇదే సమయంలో వేసవి సెలవులు ముగుస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, తెరుచుకుంటున్నాయి. ఇలాంటి త‌రుణంలో గ్రేటర్ సిటీలో ఇంటి అద్దెలు పెరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అద్దె ఇళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఎక్కడ టూలెట్ బోర్డు కనిపించినా వెంటనే ఎవరో ఒకరు అద్దెకు దిగిపోతున్నారు. ఇటువంటి సానుకూల పరిస్థితుల్లో అనూహ్యంగా ఇంటి అద్దెలు పెరిగిపోయాయి.

ఎక్క‌డెక్క‌డ‌.. ఎంతెంత‌..
హైదరాబాద్లోని మణికొండ, కూకట్ పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, పొప్పాలగూడ, షేక్ పేట్, టోలీచౌకి, ఉప్పల్, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. నగరంలో ప్రధాన ప్రాంతాల్లో 10 నుంచి 20 శాతం మేర ఇంటి అద్దెలు పెరిగాయి. చందానగర్లో డబుల్ బెడ్ రూం ఇంటి అద్దె మొన్నటి వరకు 20 వేల రూపాయలు ఉండగా ఇప్పుడు 22 వేలకు చేరింది. టోలిచౌకీలో డబుల్ బెడ్ రూం ఇంటి అద్దే 22 వేల నుంచి 26 వేలకు, మణికొండలో రెండు పడకల ఇంటి అద్దె 24 వేల నుంచి 28 వేలకు పెరిగింది. కూకట్ పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో కనీసం డబుల్ బెడ్ రూం హౌజ్ రెంట్ 32 వేల రూపాయలుగా ఉంది.

హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు, ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో గృహాల అద్దెలు బాగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో లగ్జరీ గృహాల అద్దెలకు డిమాండ్ బాగా పెరిగింది. ఏడాది క్రితం జూబ్లీహిల్స్ లో ట్రిపుల్ బెడ్ రూం ఇంటి అద్దె 60 వేలుగా ఉండగా ప్రస్తుతం 20 శాతం మేర పెరిగి 72 వేలకు చేరింది. హైటెక్ సిటీలో మొన్నటి వరకు 55 వేలుగా ఉన్న ప్రీమియం హౌజ్ రెంట్ ఇప్పుడు 15 శాతం వృద్ధితో 65 వేలకు పెరిగింది. అంటే హైదరాబాద్ లో సగటున ఇంటి అద్దె 15 నుంచి 20 శాతం మేర పెరిగిందని మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. ప్రధాన ప్రాంతాలలో డిమాండ్ కు తగిన లగ్జరీ గృహాల సప్లయి లేకపోవటమే అద్దె పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. మొత్తానికి హైదరాబాద్ లో ఇంటి అద్దెలు పెరగడం సామాన్య, మధ్యతరగతి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఉద్యోగాలు చేస్తున్న వారి వేతనాలు పెరగడం లేదు కానీ, గృహాల అద్దెలు మాత్రం పెరిగాయని, వచ్చిన జీతంలో సగానికి పైగా ఇంటి రెంట్ కే ఖర్చవుతోందని వాపోతున్నారు.

This website uses cookies.