Categories: TOP STORIES

రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టుతో మ‌న‌కు ప్ర‌మోజ‌నాలేమిటి?

రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణ సూపర్ గేమ్ ఛేంజర్‌గా మారనున్న‌ది. ప్రస్తుతం ఉన్న ఓఆర్ఆర్ నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంతో తెలంగాణలోని పలు జిల్లాల మీదుగా ఈ రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం జ‌ర‌గ‌నున్న‌ది. ఈ రోడ్డు చుట్టూ రీజినల్ రింగ్‌ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయంపై గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రస్తావించడంతో పాటు ఆర్ఆర్ఆర్ చుట్టూ రీజినల్ రింగ్‌ రైల్వే లైనును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.

రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో పాటు రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టును చేపడితే.. ఏక‌కాలంలో రెండు ప‌నులు పూర్త‌వుతాయ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చుట్టూ రైల్వే లైన్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించార‌ని స‌మాచారం. కేంద్ర రైల్వే శాఖను సమన్వయం చేసుకుని రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టు ప్రతిపాదనలను ప్రధాని మోదీని స్వయంగా కలిసి నివేదించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. రీజినల్‌ రింగు రోడ్డు , రీజినల్‌ రింగు రైలుతో తెలంగాణ రాష్ట్రం 60 శాతం పట్టణీకరణ జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అంతే కాకుండా హైదరాబాద్ చుట్టూ 200 కిలోమీటర్ల పరిధిలో పారిశ్రామిక అభివృద్ధి విస్తృతమవుతుందని అంచనా వేస్తున్నారు.

రీజినల్ రింగ్‌ రైల్వే లైను ఏర్పాటైతే.. తెలంగాణకు ఆటోమొబైల్, ఈవీ వాహన తయారీ పరిశ్రమలు క్యూ కడతాయని తెలంగాణ ప్రభుత్వ అంచ‌నా వేస్తోంది. ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చైనా తరువాత మరో దేశం కోసం.. దక్షిణ కొరియా ఇప్పటికే పరిశీలిస్తోందని.. ఇటీవల పర్యటనలో తాము వారిని హైదరాబాద్ కి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. దేశంలో 35 శాతం బల్క్‌డ్రగ్‌ హైదరాబాద్‌లోనే తయారవుతుండగా, రీజినల్ రైల్వే లైన్ ప్రాజెక్టు పట్టాలెక్కితే ఈజీగా ర‌వాణా చేయవచ్చునని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ మార్గంపై సర్వే చేపట్టాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఇప్పటికే ఆదేశించారు. డీపీఆర్‌ రూపకల్పనతో పాటు స్థల నిర్ధారణ తుది సర్వే చేయడానికి రైల్వే శాఖ 13.95 కోట్లను కేటాయించింది.

This website uses cookies.