Categories: TOP STORIES

ప్రీలాంచ్ ప్ర‌మోట‌ర్‌పై కేసు పెట్టిన ఏజెంట్‌?

  • 50 ల‌క్ష‌లు క‌డితే రెండేళ్ల‌లో కోటీ ఇస్తామ‌ని మోసం
  • రెండేళ్ల నుంచి తిప్పించుకుంటున్న వైనం
  • ఈవీకే (జీఎస్ఆర్‌ గ్రూపు) కంపెనీ ఎండీ జి. శ్రీనివాస్‌రావు, మార్కెటింగ్
    హెడ్ శిల్పాల‌పై కేసు న‌మోదు

విన‌డానికి విచిత్రంగా ఉన్నా.. ఇది మాత్రం వాస్త‌వం. క‌రోనా స‌మ‌యంలో పుట్టుకొచ్చిన ఒక ప్రీలాంచ్ ప్ర‌మోట‌ర్ ఆరంభించిన ప్రాజెక్టులో.. పెట్టుబ‌డి పెట్టించిన‌ ఏజెంటే.. పోలీసు కేసు పెట్టిన సంఘ‌ట‌న.. హైద‌రాబాద్ రియ‌ల్ రంగంలో చోటు చేసుకుంది. ఇటీవ‌ల రామ‌చంద్రాపురం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో న‌మోదైన ఈ కేసుకు సంబంధించిన పూర్వాప‌రాలిలా ఉన్నాయి.

క‌రోనా స‌మ‌యంలో పుట్టుకొచ్చిన ఈవీకే అనే రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలో ఒక ఏజెంటు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈవీకే కంపెనీలో రూ.50 లక్షలు పెట్టుబడి పెడితే.. రెండేళ్ల తర్వాత రెట్టింపు మొత్తం అంటే రూ.కోటి ఇస్తామని, సెక్యూరిటీగా 200 గజాల స్థలం రిజిస్టర్ చేస్తామని కంపెనీ ఆఫర్ ఇచ్చిందని.. దాంతో త‌న‌ కస్టమర్ 2021లో రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టారని ఫిర్యాదులో తెలిపారు. దీంతో 200 గజాల స్థలాన్ని కంపెనీ రిజిస్టర్ చేసింద‌ని.. కాక‌పోతే, ఒప్పందం ప్రకారం రెండేళ్లయ్యాక త‌న‌ కస్టమర్ ఈవీకే కంపెనీకి వెళ్లి.. రూ.కోటి గురించి అడిగితే ఈవీకే ఎండీ జి.శ్రీనివాసరావు, మార్కెటింగ్ హెడ్ శిల్ప అసలు స్పందించట్లేద‌ని పేర్కొన్నారు.

ఆ ఆఫీసు చుట్టూ చెప్పులు అరిగేలా తిరగ్గా.. తిరగ్గా.. నాలుగు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చార‌ని తెలిపారు. కస్టమర్ పేరిట రిజిస్టర్ చేసిన 200 గజాల భూమిని తిరిగి కంపెనీకి బదలాయించాలని, ఆ ప్రక్రియ పూర్తయిన మూడు నెలల తర్వాత సొమ్ము ఇస్తామనే స‌మాచారం ఇచ్చార‌ని చెప్పారు. ఈ నేపథ్యంలో కంపెనీ ఎండీ, ఇతరులను సంప్రదించడానికి చాలా రకాలుగా ప్రయత్నించినా స్పందించలేదని.. ఇక లాభం లేద‌నుకుని ఈవీకే కంపెనీ ఎండీ జి.శ్రీనివాసరావు (జీఎస్సార్ గ్రూప్‌), శిల్పపై తగిన చర్యలు తీసుకోవాల‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వివరాల్ని పరిశీలించిన పోలీసులు ఈవీకే కంపెనీ ఎండీ జి.శ్రీనివాసరావు, మార్కెటింగ్ హెడ్ శిల్పపై కేసు నమోదు చేశార‌ని స‌మాచారం.

This website uses cookies.