Categories: TOP STORIES

ఇండెక్సేషన్ తొలగింపుతో ఇబ్బందే

స్థిరాస్తి విక్రయంపై ఇండెక్సేషన్
తొలగింపునకు బడ్జెట్ తో ప్రతిపాదన

ఇన్వెస్టర్లపై పన్ను భారం పడే అవకాశం

కేంద్ర బడ్జెట్ లో రియల్ రంగానికి సంబంధించి ఓ ప్రతికూల ప్రతిపాదన వచ్చింది. స్థిరాస్తి విక్రయంపై ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తొలగిస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. అలాగే స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నును పెంచుతున్నట్టు వెల్లడించింది. వీటివల్ల ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. స్వల్పకాలిక మూలధన లాభాలపై పన్నును 15 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. మరోవైపు అన్ని ఆర్థిక, ఆర్థికేతర ఆస్తులపై దీర్ఘకాలిక లాభాలపై 12.5 శాతం పన్ను వర్తిస్తుంది.

అలాగే దిగువ, మధ్య ఆదాయ వర్గాలకు ప్రయోజనం కల్పించేందుకు కొన్ని ఆర్థిక ఆస్తులపై మూలధన లాభాల మినహాయింపు పరిమితిని ఏడాదికి రూ.1.25 లక్షలకు పెంచాలని ప్రతిపాదించింది. స్థిరాస్తి విక్రయాలకు సంబంధించిన ఇండెక్సేషన్ ప్రయోజనం తీసివేయడం వల్ల ఇకపై ఆస్తిని విక్రయించాలనుకునే ఆస్తి యజమానులు ద్రవ్యోల్బణాన్ని ఉపయోగించి కొనుగోలు ధరను సర్దుబాటు చేయడం కుదరదు. తద్వారా వారి మూలధన లాభాలు తగ్గుతాయి. అంతేకాకుండా పన్ను కూడా పెరుగుతుంది. ఇప్పటివరకు ఆస్తి నుంచి వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఇండెక్సేషన్ ప్రయోజనంతో 10 శాతం పన్ను పడేది. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం ఇండెక్సేషన్ ప్రయోజనం లేకుండా ఈ పన్ను 12.5 శాతం కానుంది.

This website uses cookies.