Categories: TOP STORIES

మ‌హాన‌గ‌రంలో.. మ‌రో కొత్త‌ విభాగం!

హైడ్రా ప‌రిధి.. 2 వేల కిలోమీట‌ర్లు

చెరువులు, నాలాల క‌బ్జాల‌కు చెక్‌

అక్ర‌మ నిర్మాణాల‌కు అడ్డుక‌ట్ట‌!

హైదరాబాద్ విస్తరణకు అనుగుణంగా.. ప్రజలకు విస్తృత సేవలను అందించేలా.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. హైడ్రా ఏర్పాటు, సంబంధిత విధివిధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమీక్ష చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామ‌ని అన్నారు.

జీహెచ్ఎంసీతో పాటు, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్తు, పోలీస్ విభాగాలను సమన్వయం చేసుకొని మరింత సమర్థంగా హైడ్రా పని చేసేలా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు. ఇప్పుడున్న ఎన్ ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాన్ని అందుకు అనుగుణంగా పునర్‌ వ్యవస్థీకరించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు వరకు రెండు వేల కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పని చేయాల్సి ఉంటుందని, పని విభజనకు వీలుగా సిటీలో ఇప్పుడున్న జోన్ల తరహాలో భౌగోళిక పరిధిని నిర్దేశించాలని సీఎం సూచించారు.

అవసరమైతే హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలీ, జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.

హైడ్రా.. ఇక నుంచి కీల‌కం!

విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలిగించటం, అక్రమ నిర్మాణాలు, నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలిగింపు, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్తు సరఫరాలో హైడ్రా కీలకంగా వ్యవహరించేలా విధులు అప్పగించాలని సీఎం చెప్పారు. హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగింపు, అపరాధ రుసుము వసూలు బాధ్యతను హైడ్రాకు బదలాయించాలని అన్నారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినంగా ఉండేలా అధ్యయనం చేయాలని సూచించారు.

జిల్లా క‌లెక్ట‌ర్ల
అధికారాల్ని తొల‌గిస్తారా?

వాస్త‌వానికి, గ‌త ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన మున్సిప‌ల్ చ‌ట్టం ప్ర‌కారం.. అక్ర‌మ నిర్మాణాల్ని అడ్డుక‌ట్ట వేసే అధికారం జిల్లా క‌లెక్ట‌ర్లకు అప్ప‌గించారు. ఒక ర‌కంగా చెప్పాలంటే, వాటికి పూర్తి స్థాయిలో నిరోధించేందుకు క‌లెక్ట‌ర్ల‌దే తుది నిర్ణ‌య‌మ‌ని చెప్పొచ్చు. మ‌రి, సీఎం రేవంత్‌రెడ్డి తాజా ఆదేశాల్ని గ‌మ‌నిస్తే.. అక్ర‌మ నిర్మాణాల్ని నిరోధించే బాధ్య‌తను హైడ్రాకు అప్ప‌గించారు. ఈ విష‌యంలో ఎలా స‌ర్దుబాటు చేస్తారో రానున్న రోజుల్లోనే తెలుస్తుంది. ఏదీఏమైనా, రాజ‌కీయ నాయ‌కుల ప్ర‌మేయం లేకుండా హైడ్రా ప‌ని చేయాలి. లేక‌పోతే, ఎంతో కీల‌క‌మైన ఈ వ్య‌వ‌స్థ నిర్వీర్యం అవ్వ‌డానికి ఎంతోకాలం ప‌ట్ట‌దు.

This website uses cookies.