Categories: LATEST UPDATES

మోసాల పుట్ట భువనతేజ!

  • రాజ‌మండ్రికి మ‌కాం మార్చిన కుటుంబం
  • ఆరుగురి పేరిట భూముల కొనుగోలు!
  • ఆరంభం నుంచి మోస‌పూరిత వ్య‌వ‌హార‌మే
  • ఆగ్రోఫామ్స్ పేరిట వ‌సూళ్లు..
  • గ్రీన్ మెట్రోలోనూ అదే ప‌రిస్థితి!

ప్రీలాంచ్ పేరిట అమాయ‌క మ‌ధ్య‌త‌ర‌గ‌తి కొనుగోలుదారుల నుంచి కోట్ల రూపాయ‌ల్ని వ‌సూలు చేసి మోసం చేసిన కేసులో అరెస్ట‌యిన భువ‌న‌తేజ ఇన్‌ఫ్రా చ‌క్కా వెంక‌ట‌సుబ్ర‌మ‌ణ్యం గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. అత‌ని బినామీ అయిన మిర్యాల శ్రీను అలియాస్ అక్ష‌రం సీను అనే వ్య‌క్తి.. సుబ్ర‌మ‌ణ్యం అరెస్టు కాగానే హైద‌రాబాద్ నుంచి ప‌రారై రాజ‌మండ్రికి మ‌కాం మార్చాడ‌ని తెలిసింది. సుబ్రహ్మణ్యం భార్య భాగ్యలక్ష్మి, సొంత బామ్మర్ది, మరదలు, అత్త.. ఈ నలుగురి పేర్ల మీద హైదరాబాద్‌లో భూములు కొన్నార‌ని స‌మాచారం. వీరు కూడా అత‌ని బినామీలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రెజ్ న్యూస్‌కి అందిన స‌మాచారం ప్ర‌కారం.. వీరంతా ప్రస్తుతం రాజమండ్రిలోని తిలక్ రోడ్‌లో అతిథి రెస్టారెంట్‌ పక్క సందులో నివాసం ఉంటున్నార‌ని స‌మాచారం.

వాస్త‌వానికి సుబ్ర‌మ‌ణ్యం అనే వ్య‌క్తి మొద‌టి నుంచి మోస‌పూరిత‌మైన ఆలోచ‌న‌లున్న‌వాడేన‌ని ఆయ‌న్ని బాగా తెలిసిన వారు చెబుతున్నారు. 2003, 2004లో గోల్క్‌ స్కీమ్‌ పెట్టి అమాయకుల నుంచి డిపాజిట్లు తీసుకొని పారిపోయాడ‌ని తెలిసింది. ఆ డబ్బుతో రాజమండ్రికి చేరి.. స్థానికంగా ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పని చేశాడ‌ని.. ఆ కంపెనీ పార్ట్‌నర్‌కు తెలియకుండానే 150 ప్లాట్లు డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేసి, పెద్ద మొత్తంలో నొక్కేశాడ‌ని స‌మాచారం. ఆ డబ్బుతోనే శ్రీరస్తు డెవలపర్స్‌ అని సొంతంగా కంపెనీ పెట్టాడు. అందులో కూడా డబుల్‌ రిజిస్ట్రేషన్లు, మోసాలు చేశాడ‌ని స‌మాచారం. విశాఖపట్నం, నెల్లూరులలో ఫామ్‌ల్యాండ్స్‌ పేరుతో అమాయకులను నట్టేట ముంచి కోట్లాది రూపాయలు మూటగట్టాడ‌నే అభియోగం అత‌నిపై ఉంది.
క‌రోనా స‌మ‌యంలో అక్క‌డ్నుంచి హైద‌రాబాద్‌కు మ‌కాం మార్చిన చ‌క్కా వెంక‌ట సుబ్ర‌మ‌ణ్యం.. పారిజాత సంస్థలో మార్కెటింగ్ చేసి.. ఆయా య‌జ‌మానికి తెలియ‌కుండానే వంద కోట్ల దాకా నొక్కేశాడ‌ని.. ఆ డ‌బ్బుతోనే సొంతంగా భువనజేత అని కంపెనీని పెట్టాడు. శామీర్‌పేట, వెలిమల, మేడ్చల్, ఆదిభట్ల వంటి పలు ప్రాంతాలలో ప్రీ లాంచ్‌ల పేరుతో కోట్లు వసూలు చేశాడు.
శామీర్‌పేటలో చ‌క్కా ఒక స్థలం కొన్నాడు. అయితే, ఆ స్థ‌లం య‌జ‌మానికి ఇద్ద‌రు కొడుకులు కాగా.. అత‌ను మ‌ర‌ణించే ముందు ఆయా స్థ‌లం విక్ర‌య హ‌క్కులు త‌న మ‌న‌వ‌ళ్ల‌కే ద‌క్కుతుంద‌నే వీలునామా రాశాడ‌ని స‌మాచారం. ఆ సమయంలో మనవళ్లు విదేశాలలో ఉండేవార‌ట‌. తండ్రి మరణానంతరం.. ఆయా ఇద్దరు కొడుకులు సుబ్ర‌మ‌ణ్యంతో కుమ్మకై స్థలాన్ని విక్రయించారు. ఈ విషయం తెలిసిన మనవాళ్లు హైదరాబాద్‌కు తిరిగొచ్చి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటికే ఆ స్థలంలో ప్రీలాంచ్‌ పేరుతో సుబ్రహణ్యం కొనుగోలుదారుల నుంచి కోట్ల‌ రూపాయల్ని వసూలు చేశాడ‌ని స‌మాచారం. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్ట్‌క్టు నిర్మాణం పూర్తి కాకపోవడంతో, కొంద‌రు కొనుగోలుదారులు కోర్ట‌కు సైతం వెళ్లార‌ని స‌మాచారం.
చ‌క్కా సుబ్ర‌మ‌ణ్యం నారాయణ్‌ఖేడ్‌లో ఆగ్రో ఫామ్స్‌ పేరుతో వసూళ్లు చేశాడు. నీమ్స్‌ బోరాలో మార్కెటింగ్‌ చేసి యజమాని మురళీకృష్ణాకు కోట్లాది రూపాయల బాకీ ఉన్నాడ‌ని స‌మాచారం.
కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసి రిజిస్ట్రేషన్లు చేయలేదు. ల్యాండ్‌ ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఇలా చ‌క్కా వెంక‌ట‌సుబ్ర‌మ‌ణ్యం మొద‌టి నుంచి ప్ర‌జ‌ల‌కు టోపి పెట్టే దురాలోచ‌న‌లు క‌లిగి ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇన్ని కోట్ల రూపాయ‌ల్ని ప్ర‌జ‌ల నుంచి కొల్ల‌గొట్టిన త‌ర్వాత‌.. ఆయా బ‌య్య‌ర్ల‌కు సొమ్ము వాప‌సు ఇస్తాన‌నే మాట పోలీసుల‌కు చెబుతున్నాడ‌ని తెలిసింది. అపార్టుమెంట్ల‌ను ఎలాగైనా క‌ట్టిస్తాన‌ని అంటున్నాడ‌ని స‌మాచారం. అయితే, ఈ కేసులో పోలీసులు లోతైన ద‌ర్యాప్తు చేసి.. ఎవ‌రెవ‌రి నుంచి ఎంతెంత సొమ్ము వ‌సూలు చేశాడు? అత‌ని వ‌ద్ద ఉన్న ఆస్తులెన్నీ? అవి ఎవ‌రెవ‌రి పేర్ల మీద ఉన్నాయి? వాటినివిక్ర‌యిస్తే ఎంత‌మంది సొమ్ము వెన‌క్కి ఇవ్వొచ్చ‌నే విష‌యాన్ని పోలీసులు ప‌రిశీలించాలి. అత‌ని బినామీల‌పై పూర్తి వివ‌రాల్ని సేక‌రించి.. తాము చెల్లించిన సొమ్ము వెన‌క్కి ఇప్పించాల‌ని.. సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకం కోరుతున్నారు.

గ్రీన్ మెట్రో బొడ్డు అశోక్ విచార‌ణ

క‌రోనా స‌మ‌యంలో గ్రీన్ మెట్రో తుల‌సీ భాగ్య‌న‌గ‌రంలో.. టేబుళ్లు వేసుకుని మ‌రీ కూర్చోని.. సొంత కంపెనీ మాదిరిగా చ‌క్కా సుబ్ర‌మ‌ణ్యం ఫ్లాట్ల‌ను విక్ర‌యించాడు. చాలామంది కొనుగోలుదారుల నుంచి సొమ్ము వ‌సూలు చేశాడు. కానీ, ఫ్లాట్లు మాత్రం రిజిస్ట్రేష‌న్ కాలేదు. దీంతో, బ‌య్య‌ర్లో ల‌బోదిబోమంటూ సంస్థ ఎండీ బొడ్డు అశోక్‌ను సంప్ర‌దించారు. అయితే, చ‌క్కా వెంక‌ట సుబ్ర‌మ‌ణ్యంకు చెల్లించిన సొమ్ముతో త‌న‌కు సంబంధం లేద‌ని తొలుత వాదించాడు. ఈ క్ర‌మంలో వెంక‌ట సుబ్ర‌మ‌ణ్యంను అరెస్టు చేసిన పోలీసులు.. గ్రీన్ మెట్రో బొడ్డు అశోక్‌ను సైతం విచార‌ణ‌కు పిలిచార‌ని తెలిసింది. సుబ్ర‌మ‌ణ్యంకు అత్యంత స‌న్నిహితుడిగా పేరు పొందిన ఫ‌ణిభూష‌ణ్‌రావును పోలీసులు అరెస్టు చేశార‌ని స‌మాచారం. మ‌రి, అత‌నూ ఒక బినామీ కావ‌డంతో ఆయ‌న్ని పూర్తి స్థాయిలో విచారించాలని బాధితులు కోరుతున్నారు.

This website uses cookies.