Categories: TOP STORIES

దుబాయ్ ని చూసి.. ఏం నేర్చుకోవాలి?

    • దూరదృష్టి గల నాయకత్వం
    • అభివృద్ధి పట్ల పక్కా ప్రణాళికలు
    • అందుకు తగ్గ కార్యచరణ..
    • ఏం చేసినా ప్రపంచంలోనే ప్రప్రథమం..
    • లేదా కొత్తదనంగా చేయడం..
    • ఇదే దుబాయ్ అభివృద్ధి మంత్రం
    • ఏటా లక్షలాది పర్యాటకుల సందర్శన
    • ప్రపంచంలోనే టాప్ బ్రాండ్లు లభ్యం
    • లంచాల్లేని ఆర్థిక, ప్రభుత్వ, పోలీసు వ్యవస్థ
(దుబాయ్ నుంచి కింగ్ జాన్సన్ కొయ్యడ)

దుబాయ్ నగరాన్ని చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. కళ్లు మిరుమిట్లు గొలిపే ఆకాశహర్మ్యాలు.. సముద్రం ఒడ్డున ఆకర్షణీయమైన కట్టడాలు.. సముద్రగర్భంలో రహదారులు.. ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాండ్లకు స్వర్గధామంగా ఎలా మారింది? గ్లోబల్ హబ్ గా ఎలా తయారైంది? అతి తక్కువ కాలంలో.. ప్రపంచంలోనే పర్యాటకులు పయనించే మూడో అతిపెద్ద నగరంగా ఎలా అవతరించింది?

కొన్నాళ్ల క్రితం.. దుబాయ్ మొత్తం ఎడాది ప్రాంతమే. ఇసుక నేలల్లో ఇల్లు కడితే కూలిపోవడం ఖాయం. సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేని దుస్థితి. తాగేందుకు నీళ్లు లేవు. సొంత ఖనిజాల్లేవు. బంగారం లేదు. అయినా, ఆ దేశం ఇరవై ఏళ్లలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందంటే ఆషామాషీ విషయమేం కాదు. పాలకులకు దూరదృష్టి ఉండి.. అభివృద్ధి పట్ల పక్కా ప్రణాళికలుంటే.. అద్భుతాలు సృష్టించవచ్చని దుబాయ్ ని చూసి అర్థం చేసుకోవచ్చు. దుబాయ్ రాజు, యూఏఈ ప్రధానమంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అతిపెద్ద విజనరి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణ వ్యక్తులు పార్టీలను చేసుకోవడానికి సొమ్మును కూడబెడతారని.. ఎక్స్ ట్రా ఆర్డీనరీ వ్యక్తులే గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు డబ్బును పొదుపు చేస్తారని ఆ రాజు భావించేవారు. అందుకే ఏం చేసినా.. ప్రపంచంలోనే బెస్ట్ ఉండేలా ప్రయత్నిస్తారని చెప్పేవారు. ఆయన మార్గదర్శిగా ఉండి.. దుబాయ్ ని అంతర్జాతీయ నగరంగా నిలబెట్టాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి ఆయన పర్యాటక, ఆర్థిక ఆధారిత వ్యవస్థ గా దుబాయ్ ని తీర్చిదిద్దడంలో విజయం సాధించారు. ఆయన ఆలోచనా విధానం ఎంత గొప్పగా ఉంటుందంటే.. ఏదో బొటాబొటిన జీవించడం ఆయనకు అస్సలు నచ్చదు. అంటే యావరేజీగా ఉండాలనేది ఆయన రక్తంలోనే లేదు. ఏ విషయంలో అయినా మొదటి స్థానంలో ఉండాలి. లేదా ప్రపంచంలోనే ఏకైక కట్టడం తమ దగ్గరే ఉండాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

అదే తపనతో ఆలోచించారు. షాపింగ్ మాల్ నిర్మించాలని భావించగానే.. ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన దుబాయ్ మాల్ కట్టేశారు. ఒక టవర్ కట్టాలని అనుకోగానే ప్రపంచంలోనే అతి ఎత్తయిన బూర్జ్ ఖలీఫాను కట్టేశారు. దేవుడు ద్వీపకల్పాల్ని సృష్టిస్తే.. ఈ రాజు సముద్రంలోనే కృతిమ ద్వీపకల్పమైన పామ్ జుమేరాను నిర్మించారు. అండర్ వాటర్ బ్రిడ్జి కట్టారు. అండర్ వాటర్ టెన్నిస్ స్టేడియం కట్టేశారు. ప్రపంచంలోనే అతి ఖరీదైన సెవెన్ స్టార్ హోటల్ బూర్జ్ అల్ అరబ్ నిర్మించారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ఉద్యానవనాన్ని ఎడారిలో సృష్టించిన ఘనత దుబాయ్ కే దక్కుతుంది. దీన్ని దుబాయ్ మిరాకల్ గార్డెన్ అని పేరు పెట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫైవ్ స్టార్ హోటల్ జే డబ్ల్యూ మెరియట్ హోటల్, అతిపెద్ద గోల్డ్ మార్కెట్ ద గోల్డ్ సోక్.. డిస్నీలాండ్ కంటే రెండున్నర రెట్లు పెద్దదైన దుబాయ్ ల్యాండ్ ని ఆరంభించారు. దీన్ని చూసేందుకు ప్రతిరోజు రెండు లక్షల మంది పర్యాటకులు విచ్చేస్తారు. అంటే దీన్ని బట్టి దుబాయ్ రాజు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎంత వినూత్నంగా, ముందస్తుగా ఆలోచిస్తారంటే.. 2030 నాటికల్లా.. దుబాయిలో 25 శాతం ప్రింటింగ్ ఆధారిత నిర్మాణాలు కట్టేందుకు ప్రణాళికలు రచించారు.
కేవలం చెప్పడమే కాదు.. నలభై అంతస్తుల త్రీడీ ప్రింటెండ్ బిల్డింగ్ ని ఇప్పటికే నిర్మించి ప్రపంచానికి చూపెట్టారు. ప్రత్యేకంగా దుబాయ్ కెనాల్ ప్రాజెక్టును చేపట్టారు. అందులోనే రెండు వందల ఇళ్లను నిర్మించారు. నీటిలో తేలియాడే రెస్టారెంట్లు, మెరీనా బీచ్లు.. ఫ్రీ వైఫై జోన్లు అభివృద్ధి చేశారు. తడి నేల ఉన్న ప్రాంతాల్లో ఇళ్లు కడితే కూలిపోతాయనే విషయం తెలిసిందే. అలాంటిది, సముద్రంలోనే ఎత్తయిన టవర్లను నిర్మించిన ఘనత దుబాయ్ నాయకత్వానికే చెల్లుతుంది. ఇందుకోసం ప్రపంచంలోనే నైపుణ్యం గల కన్సల్టెంట్లను నియమించారు. నలభై ఆకాశహర్మ్యాలను నిర్మించారు. బూర్జ్ ఖలీఫా, బూర్జ్ అల్ అరబ్ వంటివి కట్టారు. బూర్జ్ ఖలీఫా కోసం ప్రతిరోజు రెండు మిలియన్ గ్యాలన్ల నీరు కావాలి. ఇందుకోసం వి ఆకారంలో ఉన్న పర్వత ప్రాంతాల కింద భూమిలోపలికి తవ్వి.. నీరును బయటికి తెప్పించి నీటి వ్యవస్థను విజయవంతంగా డెవలప్ చేశారు. అంటే ఎడారి ప్రాంతంలో నీటి సమస్యను ఇలా అధిగమించారు.

డ్రోన్లతో మనిషి ప్రయాణం

ఆ దేశ రాజు ఎంత దూరదృష్టి గల నాయకుడు అంటే.. ఏకంగా దుబాయ్ స్మార్ట్ సిటీ నిర్మించాడు. హైపర్ లూప్ ట్రైన్ ని డెవలప్ చేస్తున్నారు. దీని ద్వారా దుబాయ్ నుంచి అబుదాబికి సుమారు పది వేల మంది ప్రయాణీకులు పన్నెండు నిమిషాల్లో చేరుకుంటారు. 2025 నాటికల్లా డ్రైవర్లు లేని వాహనాలను 25 శాతం ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. ఒకే కారులో ముప్పయ్ మంది ప్రయాణించే కార్లను తయారు చేస్తున్నారు. ఎవరైనా మొబైల్ లో క్లిక్ చేస్తే.. ఆ కారు మనముందుకొచ్చి ఆగుతుంది. అందులో ఎక్కి ప్రయాణం చేయవచ్చు. దుబాయ్ రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక కొత్త విషయాన్ని ప్రకటించింది. దుబాయ్లో మనిషిని తీసుకెళ్లే డ్రోన్లను తయారు చేస్తున్నారు. వంద కిలోల బరువులోపు గల మనిషి ఈ డ్రోన్ లో కూర్చుంటే.. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తారని తెలియజేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పరీక్షలు కూడా జరుగుతున్నాయి.

వావ్.. దుబాయ్ పోలీస్..

దుబాయ్లో పోలీసులు లేకుండానే పోలిసింగ్ వ్యవస్థను పటిష్ఠం చేశారు. రోడ్ల మీద ఎక్కడా ట్రాఫిక్ కానిస్టేబుళ్లు కనిపించనే కనిపించరు. చెట్టు పక్కన నక్కి కూర్చోని.. ఎవరైనా అడ్డదిడ్డంగా వచ్చినా.. అధిక లోడుతో వచ్చినా.. జరిమానాలు వేసే వ్యవస్థ లేదక్కడ. స్మార్ట్ పోలీస్ స్టేషన్లను రూపొందించారు. ఎవరైనా వెళ్లి అక్కడ కంప్యూటర్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు. ఎవరివైనా క్రిమినల్ రికార్డులను పరిశీలించొచ్చు. ప్రమాదం జరిగితే ఫిర్యాదు చేయవచ్చు.

వస్తువులను పోగొట్టుకున్నా.. దొరికినా.. స్టేషన్లోకి వెళ్లి కంప్యూటర్లోనే ఫిర్యాదు చేయవచ్చు. పోలీసు వ్యవస్థను ఫుల్లీ ఆలోమెటెడ్ చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా? మనుషుల ప్రమేయం తగ్గిపోయింది. మానవ వనరుల వినియోగం పెద్దగా లేదు. ఫలితంగా తక్కువ సంఖ్యలో పోలీసులున్నారు. లంచాలకు తావు లేకుండా చేశారు. ఇక అక్కడ పని చేసే పోలీసులకు ప్రపంచంలోనే అతి ఖరీదైన కార్లను అందజేశారు. దుబాయ్ పోలీసులు ప్రపంచంలోనే అతి ఖరీదైన పోలీసులని చెప్పుకోవచ్చు.

స్థానికులు పది శాతమే..

దుబాయ్లో స్థానికులు కేవలం పది శాతమే ఉంటారు. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు చెందిన వ్యక్తులు సుమారు అరవై ఐదు శాతం నివసిస్తున్నారు. వీరంతా నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. ప్రపంచంలోని పావు శాతం కంటే ఎక్కువ జేసీబీలు ఇక్కడే పని చేస్తున్నాయి. ప్రపంచ ట్యాలెంట్ ని ఆకర్షించేందుకు ట్యాక్స్ ఫ్రీ ఎకానమీని చేశారు. అక్కడ మీరెంత సంపాదిస్తారో.. అదంతా మీ సొమ్మే. దాన్ని మీద ఎలాంటి ఆదాయ పన్ను కట్టక్కర్లేదు.

వాతావరణాన్ని నియంత్రించే నగరాన్ని కూడా ఆవిష్కరించారు. కేవలం ఆలోచనే కాదు.. వాటిని ఆచరణలోకి తెచ్చి విజయవంతం చేయడమే దుబాయ్ రాజు ప్రత్యేకత. ప్రతి సమస్యను ఒక అవకాశంగా మార్చుకున్నారు. భూమి కొరత ఉన్నప్పుడు సముద్రంలో ద్వీపకల్పాన్ని నిర్మించారు. దీనికి పామ్ జుమేరా అని నామకరణం చేశారు. సముద్రానికి ఎదురుగా ఉండేలా విల్లాను నిర్మించి.. ఒక్కో విల్లాను రూ. 350 కోట్లకు విక్రయించారు. వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహించేందుకు ఎప్పుడు వెనకడుగు వేయని మనస్తత్వం ఈ రాజు సొంతం.

సులభతర వాణిజ్య విధానాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లను సృష్టించారు. ఉచిత బిజినెస్ జోన్లను ఆరంభించి.. ట్యాక్స్ ఫ్రీ ఎకానిమీని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద రీ ఎక్స్ పోర్ట్ మార్కెట్ ను డెవలప్ చేశారు. ప్రపంచంలోని ఎక్కడి నుంచి అయినా ఐదు గంటల్లో ఈ దేశానికి చేరుకునేలా విమానయాన వ్యవస్థను తీర్చిదిద్దారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్ పో దుబాయ్లోనే జరుగుతుంది. అక్కడ జరిమానాల ద్వారా కూడా ప్రభుత్వం అధికంగానే సంపాదిస్తుంది. వాహనం మట్టికొట్టుకుని రోడ్డు మీదికొస్తే రూ. 200 దిర్హమ్ ల జరిమానా మీ బ్యాంకు ఖాతాలో నుంచి కట్ అవుతుంది. ఏదో ఆషామాషీగా కారును తుడుస్తానంటే కుదరదు.
ఇందుకోసం ప్రత్యకంగా షోరూములున్నాయి. ఇలా, ప్రతి అంశంలోనూ జరిమానాను ఆటోమెటిగ్గా వసూలు చేస్తారు. అందుకే, అక్కడ ప్రతిఒక్కరూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. చెక్ బౌన్స్ అయితే జైలులోకి కూర్చోవాల్సిందే. ఎవరైనా అమ్మాయి మీద చేయి వేస్తే.. ఊచలు లెక్కపెట్టాల్సిందే. జరిమానా కక్కాల్సిందే. ఇలా జరిమానాలు వేసి వేసి.. అక్కడి ప్రజల్ని దారిలోకి తెచ్చిన దూర దృష్టి దుబాయ్ నాయకత్వానికే చెల్లుతుంది.
దుబాయ్ బాటలో.. మనం కూడా

దుబాయ్ వంటి నగరాన్ని నిర్మించాలంటే ఆషామాషీ వ్యవహారమేం కాదు. అక్కడి నాయకత్వానికి జేజేలు కొట్టాల్సిందే. దుబాయ్ కి క్రూడాయిల్ ద్వారా వచ్చేది కేవలం ఒక శాతం సొమ్మే. ప్రపంచంలోనే ద బెస్ట్ ని డెవలప్ చేశారు. అందుకే ఏటా పర్యాటక, వ్యాపారులు ఎక్కువగా విచ్చేస్తుంటారు. ఆడపిల్లలు అర్థరాత్రి కూడా స్వేచ్ఛగా తిరిగే వాతావరణం ఉందక్కడ. ఎక్కడా పోలీసులు కనిపించరు. కానీ, 24 గంటలు పోలీసులు డేగ కళ్లతో పహారా ఉంటుంది. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా, క్షణాల్లో పోలీసులు వాలిపోతారు. ప్రతి అంశాన్ని పది రెట్లు అధిక వేగంతో చేయాలని అనుకుని.. అందుకు తగ్గ శిక్షణను అందజేస్తున్నారు.

మన తెలంగాణ రాష్ట్రం కూడా దూరదృష్టితో ఆలోచిస్తోంది. కోకాపేట్ లో ఆకాశహర్మ్యాలు వస్తున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డను డెవలప్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థలు నగరానికి వస్తున్నాయి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే ఆటోమెటిగ్గా దేశ, విదేశీ ప్రయాణీకుల సంఖ్య పెరుగుతుందని చెప్పొచ్చు. – ఇంద్రసేనారెడ్డి, ఎండీ, గిరిధారి హోమ్స్

(ఈ కథనంపై మీ అభిప్రాయాలు, విలువైన సూచనలను regpaper21@gmail.comకి తెలియజేయండి.)

This website uses cookies.