Categories: TOP STORIES

నార్సింగి హబ్‌లో మొదటి సైకిల్ స్టేషన్ ఏర్పాటు

* 40కి పైగా ఎలక్ట్రిక్ సైకిళ్లతో సహా
దాదాపు 200 సైకిళ్లను అందుబాటులోకి..

 

ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఏర్పాటు చేసిన సైకిల్‌ట్రాక్‌పై (24 కి.మీల మేర) ఇక నుంచి సైకిళ్లు పరుగెత్తనున్నాయి. గత ప్రభుత్వంలో అది ప్రారంభం అయినా.. పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో.. సైకిల్‌పై ఆఫీసుకు వెళ్లాలనుకునే ఐటీ ఉద్యోగులు కొంత‌కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. సైకిల్ ట్రాక్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తార‌ని ప్ర‌భుత్వానికి ప‌లుమార్లు విజ్ఞ‌ప్తులు చేశారు. ఇందుకు స్పందించిన ప్రభుత్వం సొంతంగా సైకిళ్లు ఉన్నవారు ఈ ట్రాక్‌పై నేరుగా సైకిల్ నడపవచ్చని, లేని వారి కోసం అద్దెకు సైకిళ్లను తీసుకుని నడిపించుకోవచ్చని సూచించింది. దీంతో ప్రస్తుతం నార్సింగి హబ్‌లో మొదటి సైకిల్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో 40కి పైగా ఎలక్ట్రిక్ సైకిళ్లతో సహా దాదాపు 200 సైకిళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో ఒక్కో సైకిల్ అద్దెకు గంటకు రూ. 50 వసూలు చేస్తున్నారు.

నిర్వహణను ప్రైవేట్ కంపెనీలకు..
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) సైకిల్ స్టేషన్ల నిర్వహణను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది. 24 కి.మీ ఓఆర్‌ఆర్ సైకిల్ ట్రాక్‌లో 4 చోట్ల సైకిల్ స్టేషన్లు ఏర్పాటు చేసి అందులో తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్, నానక్‌రాంగూడ, నార్సింగి, కొల్లూరు ప్రాంతాలను సైకిల్ స్టేషన్ల కోసం ఎంపిక చేసి మౌలిక సదుపాయాలను కల్పించింది. ప్రస్తుతం నార్సింగి హబ్‌లో అద్దెకు సైకిళ్లు అందుబాటులో ఉన్నాయని, త్వరలో ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని హెచ్‌ఎండిఏ అధికారులు అంటున్నారు. సైకిల్ ట్రాక్‌లో ప్రతి కిలోమీటరు దూరాన్ని తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా సైకిల్ ట్రాక్‌లోకి ఇతర వాహనాలు రాకుండా మీటింగ్ పాయింట్లు, ట్రాక్ కలరింగ్, సేఫ్టీ సంకేతాలు, విద్యుత్ దీపాలు, మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి ఇతర భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. దీని వల్ల ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండకుండా, ముఖ్యంగా రాత్రి వేళల్లో సైక్లింగ్ చేసేందుకు వీలుగా విద్యుత్ దీపాలతో వెలుతురును అందించేందుకు హెచ్‌ఎండిఏ అధికారులు ఏర్పాట్లు చేశారు.

This website uses cookies.