Categories: TOP STORIES

శేరిలింగంప‌ల్లిలోని ఐదు చెరువుల పరిధిలో నోటీసులు!

చెరువుల కబ్జాలపై రేవంత్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లలో ఉన్న నిర్మాణాలకు నోటీసుల్ని అందజేసింది. శేరిలింగంపల్లి మండల పరిధిలోని 5 చెరువుల పరిధిలోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లలో నిర్మాణాలకు నోటీసులు జారీ చేసింది. ఐదు చెరువుల పరిధిలో 204 నిర్మాణ యజమానులకు నోటీసులు జారీ చేసింది. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నెక్టర్స్‌ కాలనీ, డాక్టర్స్‌ కాలనీ, కావూరి హిల్స్‌, అమర్‌ సొసైటీ వాసులకు 77 నోటీసులు అందజేసింది. పలు ఇళ్లకు నోటీసులను సైతం శేరిలింగంపల్లి రెవెన్యూ సిబ్బంది అంటించారు. నెల రోజుల గడువు ఇస్తూ ఎఫ్‌టీఎల్‌ను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసుల్లో అధికారులు స్పష్టం చేశారు.

దుర్గం చెరువులో ఒక్కరోజే నాలుగు కాలనీల్లోని వందల ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు రేవంత్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వాల్టా చట్టంలోని సెక్షన్‌ 23(1) కింద నోటీసులు జారీ చేయడం జరిగింది. యజమానులు కూల్చకుంటే ఓకే.. లేని పక్షంలో తామే కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటుందని నోటీసుల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత పెద్దగా బయటకు వచ్చింది లేదు.

కార్యాలయంలోనే ఉంటూ అధికారులతో సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. అందరూ అనుకున్నట్టే జరిగింది. మరో బాంబ్ పేల్చేందుకు కాస్త సమయం తీసుకుంటున్నారని అంతా భావించారు. చివరకు అదే జరిగింది. మొత్తానికి హైడ్రా పెద్ద బాంబే పేల్చింది. 5 చెరువుల పరిధిలో 204 నిర్మాణ యజమానులకు నోటీసులు జారీ చేయడమే కాకుండా ‘మీరు కూల్చేస్తారా? లేదంటే మమ్మల్ని కూల్చేయమంటారా?’ అంటూ అల్టిమేటం జారీ చేశారు.

చెరువుల కబ్జాలపై సీరియస్‌గా ఉన్న రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలకు ఏమాత్రం వెనుకాడటం లేదు. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి నోటీసులను అంటించి షాక్ ఇచ్చారు. తప్పు చేస్తే సోదరుడైనా వదిలేది లేదని రేవంత్ తేల్చి చెప్పారు. మాదాపూర్‌ అమర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న అద్దె ఇల్లు, కార్యాలయం దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. మొత్తానికి చూడబోతే రేవంత్ సర్కార్ ఎవ్వరినీ వదిలేలా కనిపించడం లేదు.

This website uses cookies.