Categories: TOP STORIES

వ‌చ్చే ప‌దేళ్ల దాకా.. రియాల్టీకి బంగారు భ‌విష్య‌త్తు

  • క్రెడాయ్ అధ్య‌క్షుడు బొమ‌న్ ఆర్ ఇరానీ
  • 2030 నాటికి రియ‌ల్ వాటా ట్రిలియ‌న్ డాలర్లు
  • అందుబాటు గృహాల ఫ్లాట్ విస్తీర్ణాన్ని
    వెయ్యి చ‌ద‌ర‌పు అడుగులకు పెంచాలి
  • ధ‌ర విష‌యంలో ప‌రిమితి విధించొద్దు
  • రియ‌ల్ రంగంలో ప‌రిణితి స్ప‌ష్టం
  • హ‌రిత సూత్రాల‌కు అనుగుణంగా నిర్మాణాల్ని చేప‌ట్ట‌డం ఖ‌ర్చుతో కూడుకున్న ప‌నేం కాద‌ని.. వీటిని నిర్మిస్తే కేంద్రం త‌గిన ప్రోత్సాహాకాల్ని అంద‌జేస్తుంద‌ని క్రెడాయ్ జాతీయ అధ్య‌క్షుడు బొమ‌న్ ఆర్ ఇరానీ తెలిపారు. ఈజిప్టు ష‌ర్మ్ ఎల్ షేక్‌లోని రిక్సాస్ ప్రీమియం సీ గేట్‌లో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా.. నిర్మాణాలు చేప‌ట్టేట‌ప్పుడు కాలుష్యాన్ని త‌గ్గించేలా త‌మ డెవ‌ల‌ప‌ర్లు త‌గిన‌ చ‌ర్య‌ల్ని తీసుకుంటున్నార‌ని అన్నారు. కార్బ‌న్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెప్పారు. నిన్న‌టివర‌కూ నిర్మాణాల్ని క‌ట్టే బిల్డ‌ర్లు కొంత‌కాలం నుంచి మ‌రింత బాధ్య‌తాయుతంగా క‌ట్టేలా మారుతున్నార‌ని అన్నారు. ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ప్ర‌వేశ‌పెడుతున్నార‌ని.. స‌రికొత్త సాఫ్ట్‌వేర్ల‌ను వినియోగిస్తున్నార‌ని.. నిర్మాణాల ప‌నితీరును ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించేందుకు సైట్ల‌లో కెమెరాల్ని ఏర్పాటు చేస్తున్నార‌ని.. ఇలా మొత్తానికి అత్యుత్త‌మ రీతిలో నిర్మాణ‌ల్ని క‌ట్టేందుకు భార‌త బిల్డ‌ర్లు కృషి చేస్తున్నార‌ని తెలిపారు. క్రెడాయ్ స‌భ్యుల‌కు స‌హ‌కారాన్ని అందించేందుకు కార్మికుల్లో నైపుణ్యాల్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. అంతేకాదు ఐజీబీసీ నిబంధ‌న‌ల మేర‌కు సుమారు ల‌క్ష హ‌రిత గృహాల్ని నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. నిర్మాణ రంగంలో ఆధునిక ప‌రిజ్ఞానాన్ని పెంపొందించేందుకు కేంద్ర గృహ‌నిర్మాణ మంత్రిత్వ శాఖ నుంచి ఆహ్వానం ల‌భించింద‌న్నారు.
    2030 నాటికి సుమారు ఏడు కోట్ల మందికి గృహాల్ని కావాల‌న్న‌ది అంచ‌నా. కాబ‌ట్టి, ప్ర‌ణాళిక‌బ‌ద్ధ‌మైన అభివృద్ధికి పెద్ద‌పీట వేయాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింద‌న్నారు. సుస్థిర‌మైన అభివృద్ధితో పాటు ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ వంటివి మెరుగ్గా నిర్వ‌హించేందుకు ప్ర‌తి ప్రాజెక్టుల్లోనే పొందుప‌రుస్తున్నామ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో ప‌ది ల‌క్ష‌ల బ‌దులు ఎనిమిది లేదా తొమ్మిది ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగ‌లే క‌ట్టాల‌న్న స్ప‌ష్ట‌త డెవ‌ల‌ప‌ర్ల‌కు వ‌చ్చింద‌న్నారు. ఐదు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు భారత‌దేశం చేరుకుంటే.. అందులో రియ‌ల్ ఎస్టేట్ రంగం వాటా ఎంత‌లేద‌న్నా ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కూ ఉంటుంద‌న్నారు. నిర్మాణ రంగానికి ఉప‌యోగ‌ప‌డే విధంగా ఐదు రిసెర్చ్ సెల్‌ల‌ను ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. ఆయా క‌మిటీలు ఐదు నివేదిక‌ల్ని అంద‌జేశాయ‌న్నారు. ఈజిప్టులో క్రెడాయ్ న్యాట్‌కాన్ కార్య‌క్ర‌మానికి భార‌త‌దేశం నుంచి సుమారు ప‌ద్నాలుగు వంద‌ల మంది బిల్డ‌ర్లు విచ్చేయ‌డ‌మో స‌రికొత్త రికార్డుగా అభివ‌ర్ణించారు. రెరా అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత భార‌త నిర్మాణ రంగంలో స్ప‌ష్ట‌మైన మార్పులు చోటు చేసుకున్నాయ‌ని తెలిపారు. ఈ ఏడాది న‌వంబ‌రులో క్రెడాయ్ సంఘం సిల్వ‌ర్ జూబ్లీ సంవ‌త్స‌రంలోకి అడుగుపెడుతుంద‌ని చెప్పారు.

    రియ‌ల్ ప‌రిణితి..

    క్రెడాయ్ ఛైర్మ‌న్ మ‌నోజ్ గౌర్ మాట్లాడుతూ.. క్రెడాయ్ నిర్వ‌హించే ఈవెంట్‌కు ప్ర‌ప్ర‌థ‌మంగా ఒక దేశ ప్ర‌ధాన‌మంత్రి రావ‌డం ఇదే ప్ర‌ప్ర‌థ‌మమ‌ని అన్నారు. క‌రోనా త‌ర్వాత భార‌త నిర్మాణ రంగం స‌రైన దిశ‌లో ప‌య‌నిస్తుంద‌న్నారు. ప్ర‌ధానంగా రెరా ఏర్పాటైన త‌ర్వాత భార‌త రియ‌ల్ రంగంలో స‌మూల మార్పులు చోటు చేసుకున్నాయ‌ని తెలిపారు. నిర్మాణ రంగంలో స‌రికొత్త ప‌రిణితి చోటు చేసుకుంద‌న్నారు. కొనుగోలుదారులతో జ‌వాబుదారీత‌నంతో వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.

    జీఎస్టీ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం

    ఈ సంద‌ర్భంగా క్రెడాయ్ నేష‌న‌ల్ సెక్ర‌ట‌రీ గుమ్మి రాంరెడ్డి మాట్లాడుతూ జీఎస్టీకి సంబంధించి స్థ‌ల‌య‌జ‌మానుల నిష్ప‌త్తిలో స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయ‌ని తెలిపారు. జీఎస్టీలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేక‌పోవ‌డం వ‌ల్ల ఫ్లాట్ తుది ధ‌ర‌కు రెక్క‌లొస్తున్నాయ‌ని అన్నారు. ఇందుకు సంబంధించి ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప‌లుద‌ఫాలు చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని.. ఇందుకు సంబంధించి అతిత్వ‌ర‌లో సానుకూల నిర్ణ‌యం వెలువ‌డొచ్చ‌నే ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. ముంబైలోని రీ డెవ‌ల‌ప్‌మెంట్ మ‌రియు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తికి సంబంధించిన ఇబ్బందుల్ని నిర్మాణ రంగం ఎదుర్కొంటుంద‌ని అన్నారు. నిర్మాణ రంగం ఎదుర్కొనే కొన్ని స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించే క్ర‌మంలో ప్ర‌భుత్వం ఎలాంటి ఆదాయం కోల్పోద‌ని తెలిపారు. కాబ‌ట్టి, ఇలాంటి వాటిపై దృష్టి సారించి.. ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తున్నామ‌ని చెప్పారు.

    2030 నాటికి.. ట్రిలియ‌న్ డాల‌ర్లు!

    ప్ర‌స్తుతం భార‌త రియ‌ల్ రంగం వాటా 25 బిలియ‌న్ల డాల్ల‌ర్లు కాగా.. వ‌చ్చే 2030 నాటికి ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకునే అవ‌కాశ‌ముంద‌ని క్రెడాయ్ ప్రెసిడెంట్ ఎల‌క్ట్ శేఖ‌ర్ ప‌టేల్ తెలిపారు. భార‌త జీడీపీలో సుమారు 7-8 శాతం వాటా రియ‌ల్ రంగం నుంచే వ‌స్తుంద‌ని.. దీని విలువ ఎంత‌లేద‌న్నా 24 ల‌క్ష‌ల కోట్ల దాకా ఉంటుంద‌ని వెల్ల‌డించారు. 250కి పైగా ప‌రిశ్ర‌మ‌లు ఆధార‌ప‌డ్డ ఈ రంగం ప్ర‌త్య‌క్షంగా మూడు కోట్ల మందికి ఉద్యోగావ‌కాశాల్ని అందిస్తుంద‌ని చెప్పారు. వెయ్యి చ‌ద‌ర‌పు అడుగుల అపార్టుమెంట్ల‌ను అందుబాటు గృహాల ప‌రిధిలోకి తేవాల‌ని కోరారు. కేంద్ర ప్ర‌భుత్వం స‌హాయాన్ని అంద‌జేస్తే 2028 నాటికే భార‌త రియ‌ల్ రంగం ట్రిలియ‌న్ డాల‌ర్లకు చేరుకుంటుంద‌ని తెలిపారు.

    కేంద్రం నుంచి కోరేదేమిటి?

    వ్య‌వ‌సాయం త‌ర్వాత అధిక శాతం మందికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల్ని క‌ల్పించే భార‌త నిర్మాణ రంగాన్ని కేంద్రం ప్ర‌త్యేకంగా ప్రోత్సాహించాల్సిన అవ‌సరం ఉంద‌ని క్రెడాయ్ నేష‌న‌ల్ కోరింది. సామాన్యుల సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చేందుకు ప‌లు ప్రోత్సాహాకాల్ని ప్ర‌క‌టించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తోంది. అవేమిటంటే..

  • అందుబాటు గృహాల ఫ్లాట్ సైజును వెయ్యి చ‌ద‌ర‌పు అడుగులుగా నిర్థారించాలి. అప్పుడే, అధిక శాతం మంది త‌మ సొంతింటి క‌ల‌ను సులువుగా నెర‌వేర్చుకుంటారు.
  • స్థ‌ల వ్య‌యం, ప్రాజెక్టు స్థాయి, అందులోని స్పెసిఫికేష‌న్ల బ‌దులు ధ‌ర ఆధార‌ప‌డుతుంది కాబ‌ట్టి.. రేటు విష‌యంలో ఎలాంటి గరిష్ఠ‌ ప‌రిమితిని విధించ‌కూడ‌దు.
  • రియ‌ల్ ఎస్టేట్ మ‌రియు వివిధ నిర్మాణ సామ‌గ్రిపై విధించిన జీఎస్టీని త‌గ్గించాలి.
  • కోటి రూపాయ‌ల ఫ్లాట్ మీద సుమారు రూ. 35- 40 ల‌క్ష‌లు వివిధ ప‌న్నుల్ని చెల్లించాల్సి వ‌స్తోంది. కాబ‌ట్టి, ఈ రంగంపై విధించే ప‌న్నులను త‌గ్గించాలి.
  • నిర్మాణ రంగానికి సంబంధించి క్షేత్ర‌స్థాయి స‌మ‌స్య‌ల్ని విన‌డంతో పాటు వాటికి ప‌రిష్కారాల్ని క‌నుగొనాలి.
  • ప‌ర్యావ‌ర‌ణ నిబంధ‌న‌ల్ని సుల‌భ‌త‌రం చేయాలి.
  • గృహ‌రుణాల‌పై వ‌డ్డీల‌ను త‌గ్గించ‌డంతో పాటు క్రెడిట్ లింక్డ్ స‌బ్సిడీ స్క‌మును మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టాలి.

This website uses cookies.