Categories: TOP STORIES

హైద‌రాబాదీల‌ను ప్ర‌భుత్వం మోసం చేసిందా?

  • ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ నివేదిక ఏమైంది?
  • ప‌బ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్ట‌లేదు?
  • హైకోర్టు, ఎన్‌జీటీకి చెప్పారు క‌దా..
  • అసెంబ్లీ వేదిక‌గా ప్రక‌టించారు క‌దా..
  • ఎందుకింత గోప్యంగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంది?

(రెజ్ న్యూస్‌, హైద‌రాబాద్‌)

హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం మోసం చేసిందా? 111 జీవో ఎత్తివేత‌కు సంబంధించి గ‌త హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పుల‌ను ప‌క్క‌న పెట్టేసి.. త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిందా? కేవ‌లం ధ‌నార్జ‌నే ధ్యేయంగా పెట్టుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ర్యావ‌ర‌ణాన్ని తూట్లు ప‌డే ప్ర‌మాద‌మున్నా ప‌ట్టించుకోవ‌ట్లేదా? ప‌ర్యావ‌ర‌ణానికి పెద్ద‌పీట వేస్తూ… హ‌రిత‌హారానికి కోట్లు కోట్లు ఖ‌ర్చు పెడుతున్న ప్ర‌భుత్వం.. ట్రిపుల్ వ‌న్ జీవోను ఎత్తివేయ‌డంలో ఎదుర‌య్యే ప‌ర్యావ‌సానాన్ని అర్థం చేసుకోవ‌ట్లేదా? స‌గ‌టు హైద‌రాబాదీల మ‌న‌సులో మెదులుతున్న ప్ర‌శ్న‌లివి. త‌మ‌ను ప్ర‌భుత్వం మోసం చేసింద‌నే విష‌యాన్ని న‌గ‌ర‌వాసులు భావిస్తున్నార‌ని తెలిసింది.

వ‌ర‌ద‌ల నివార‌ణ కోసం అప్ప‌టి నవాబు ఉస్మాన్ సాగ‌ర్‌, హిమాయ‌త్ సాగ‌ర్‌ల‌ను ఏర్పాటు చేశార‌నే విష‌యాన్ని పాల‌కులు ఎందుకు మ‌ర్చిపోతున్నారు? దేశంలోనే ఎక్క‌డా లేన‌ట్టుగా.. కేవ‌లం హైద‌రాబాద్‌కే ప్ర‌కృతి ప్ర‌సాదించిన ఈ వ‌రాన్ని ఎందుకు నిర్ల‌క్ష్యం చేస్తున్నారు? అనంత‌గిరి కొండ‌ల నుంచి గ‌ల‌గ‌ల‌పారుతూ వ‌చ్చే నీళ్లు గండిపేట్ వ‌ర‌కూ స‌హ‌జసిద్ధంగా ప్ర‌వ‌హించే మూసీ న‌ది నీళ్లు ఎక్క‌డిక‌క్క‌డ భూమిలోకి ఇంకిపోతాయి. దీన్ని ప్ర‌క్షాళ‌న చేయ‌కుండా ఇంత‌కాలం ఎందుకు నిర్ల‌క్ష్యం చేశారు? హైద‌రాబాదీల‌ను వేధిస్తున్న ప్ర‌శ్న‌లివి.

1908 సెప్టెంబరు 28న హైదరాబాద్‌ను వరదలు ముంచెత్త‌డంతో.. ఒక్క రోజులోనే 17 అంగుళాల వర్షం కురిసి.. దాదాపు 15,000 మంది చనిపోయారు. దీంతో అప్ప‌టి నిజాం న‌వాబు.. సర్ ఎం. విశ్వేశ్వరయ్య‌కి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే బాధ్య‌త‌ను అప్ప‌చెప్పారు. దీంతో, ఆయ‌న నదిపై వరద నియంత్రణ వ్యవస్థను నిర్మించాడు. నగరం నుండి పది మైళ్ల (16 కిమీ) ఎగువన నదిపై 1920లో ఒక ఆనకట్ట ఉస్మాన్ సాగ‌ర్‌ను నిర్మించారు. 1927లో ఈసి పై మరొక రిజర్వాయర్ నిర్మించారు. దానికి హిమాయత్ సాగర్ అని పేరు పెట్టారు. ఈ సరస్సులు ముచుకుంద నది లేదా మూసీ నది వరదలను నిరోధించాయి మరియు హైదరాబాద్ నగరానికి ప్రధాన తాగునీటి వనరులుగా మారాయి. వ‌ర‌ద‌ల నివార‌ణ కోసం ఈ ఆన‌క‌ట్ట‌ల‌ను రూపొందించార‌నే ప్రాథ‌మిక సూత్రాన్ని పాల‌కులు మ‌ర్చిపోతే ఎలా? కేవ‌లం తాగునీటి అవ‌స‌రాల కోస‌మే కాదు క‌దా ఈ రెండు ఆన‌క‌ట్ట‌ల్ని అప్ప‌టి నిజం న‌వాబు నిర్మించింది? చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించి త‌మ ప‌బ్బం గ‌డుపుకునేందుకు ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.
మూసీ నది 20వ శతాబ్దపు తొలి దశాబ్దాల వరకు.. హైదరాబాద్ నగరాన్ని తరచుగా వరదలు నాశనం చేసేవి. 1908లో వ‌ర‌ద‌ల త‌ర్వాతే జంట న‌గ‌రాల అభివృద్ధి యొక్క ఆధునిక యుగం ఆరంభ‌మైంది. అయితే, స్వాతంత్ర్యం సిద్ధించిన త‌ర్వాత కొత్త ప్ర‌భుత్వాలు ఏర్పాటు కావ‌డం.. విచక్షణా రహితమైన పట్టణీకరణ మరియు ప్రణాళికా లోపం కారణంగా, ఈ నది మురుగు, పారిశ్రామిక వ్య‌ర్థాల్ని డంపింగ్ కేంద్ర‌మైంది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ల నుంచి వెలువడే దాదాపు 350 ఎంఎల్‌డీల కలుషిత నీరు, మురుగు నదిలోకి ప్రవహిస్తున్నట్లు అంచనా. దానిని శుభ్రం చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ అంటూ బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఇంత‌వ‌ర‌కూ పెద్ద‌గా అభివృద్ధి చేసింది లేదు. ఎస్టీపీల ఏర్పాటు ఏమైందో? వాటి ప‌నితీరు గురించి ఎవ‌రికీ తెలియ‌దు.
ట్రిపుల్ వ‌న్ జీవో కంటే ముందు రెండు క‌మిటీలు నివేదిక‌ను అందించాయి. వాటి ఆధారంగానే అప్ప‌టి ప్ర‌భుత్వాలు 1985లో జీవో నెం.50, 1994లో జీవో నెం.192ను విడుద‌ల చేశాయి. ఆత‌ర్వాత నిపుణుల క‌మిటీ ఇచ్చిన మ‌ధ్యంత‌ర నివేదిక ఆధారంగా, 1996లో అప్ప‌టి ప్ర‌భుత్వం ట్రిపుల్ వ‌న్ జీవోను విడుద‌ల చేసింది. సురానా ఇండ‌స్ట్రీకి సంబంధించిన కేసులో.. సుప్రీం కోర్టు సైతం 2000లో ట్రిపుల్ వ‌న్ జీవోను ముట్టుకోరాద‌ని తీర్పునిచ్చింది.
జీవో 111కు సంబంధించి ప్ర‌భుత్వ ఉన్న‌త‌స్థాయి అధికారుల‌తో ఒక క‌మిటీ వేసింద‌ని హైకోర్టుకు స‌మాచారం ఇచ్చింది. ఇటీవ‌ల సీఎం కేసీఆర్ కూడా ప్ర‌క‌టించారు. కానీ, ఆ క‌మిటీ ఇచ్చిన నివేదిక త‌ర్వాత ట్రిపుల్ వ‌న్ జీవోను ఎత్తివేస్తామ‌ని ప్ర‌క‌టించింది. కానీ, ఇంత‌వ‌ర‌కూ ఆ క‌మిటీ నివేదిక ఎక్క‌డుందో తెలియ‌దు. అందులో ఆయా క‌మిటీ స‌భ్యులేం చెప్పారో కూడా తెలియ‌దు. మ‌రి, ఆ నివేదిక‌ను బ‌హిర్గతం చేస్తే వాళ్లేం నివేదిక ఇచ్చారో.. ఏయే అంశాల్ని ప‌రిశీలించారో.. ప్ర‌భుత్వం తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి ఏం చెప్పారో అర్థ‌మ‌వుతుంద‌ని ప్ర‌జ‌లు అంటున్నారు. మ‌రి, ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం ఆ నివేదిక‌ను ప‌బ్లిక్ డొమైన్‌లో పెట్టాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

This website uses cookies.