Categories: TOP STORIES

హెచ్ఎండీఏ వేలం అట్ట‌ర్‌ఫ్లాప్‌

సాధార‌ణంగా హెచ్ఎండీఏ వేలం అన‌గానే.. దేశ‌, విదేశీ బ‌య్య‌ర్లు అమితాస‌క్తి చూపిస్తారు. న్యాయ‌ప‌రంగా ఎలాంటి చిక్కులుండ‌వ‌నే ఏకైక కార‌ణంతో వీటిని కొనేందుకు ముందుకొస్తారు. అందుకే, మార్కెట్ రేటు కంటే కాస్త ఎక్కువ ధ‌ర అయినా పెట్ట‌డానికి వెన‌క‌డుగు వేయ‌రు. అయితే, ఈసారి ఎందుకో కానీ సీన్ రివ‌ర్స్ అయ్యింది. హెచ్ఎండీఏ వేలానికి అనుకున్నంత స్పంద‌న రాలేదు. ఆశించినంత స్థాయిలో ప్లాట్లు అమ్ముడు పోలేదు. కొంద‌రు ప్ర‌సార మాధ్య‌మాల్లో వేలానికి ఆద‌ర‌ణ ఎక్కువ‌ని చెబుతున్న‌ప్ప‌టికీ.. అది వాస్త‌వం కాద‌ని చెప్పొచ్చు. ఎందుకంటే?

మూడు జిల్లాల్లో.. హాట్ లొకేష‌న్ల‌లో.. హెచ్ఎండీఏ 38 ప్లాట్ల‌ను వేలం వేసింది. అందులో కేవ‌లం 9 ప్లాట్లే అమ్ముడ‌య్యాయి. అంటే, ఇంచుమించు పాతిక శాతం మాత్ర‌మే ప్లాట్లు అమ్ముడ‌య్యాయ‌ని అర్థం. అంటే, మిగ‌త‌వాటిని కొనేందుకు కొనుగోలుదారులు పెద్ద‌గా ఆస‌క్తి చూపెట్ట‌లేదు. ఒక ప్లాటు అత్య‌ధిక ధ‌ర‌.. గజం రూ.1.10 ల‌క్ష‌ల‌కు అమ్ముడ‌య్యింద‌ని హెచ్ఎండీఏ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అయితే, అది ఏ ప్రాంతంలోని ప్లాటు? ఎవ‌రు కొన్నారు? ఆ ప్లాటు వాస్త‌వ ధ‌ర ఎంత‌? ఎంత ఎక్కువ‌కు అమ్ముడైంద‌నే విష‌యాల గురించి ప్ర‌క‌ట‌న‌లో ఎక్క‌డా పేర్కొన‌లేదు. గ‌తంలో కోకాపేట్ నియోపోలిస్ వేలంలో ప్లాట్లు అమ్ముడైన‌ప్పుడు.. ఏయే సంస్థ ఎన్ని ఎక‌రాలను.. ఎంతెంత‌ రేటు పెట్టి కొనుగోలు చేశారో స్ప‌ష్టంగా పేర్కొన్న విష‌యం తెలిసిందే. కానీ, ఇప్పుడా వివ‌రాలు ఎక్క‌డా చెప్ప‌లేదు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. హెచ్ఎండీఏ నిర్వ‌హించిన వేలం పాట‌లో.. కోకాపేట్ వంటి ప్రాంతంలో ప్లాటు క‌నీస ధ‌ర‌.. గ‌జానికి రూ.1.10 ల‌క్ష‌లుగా నిర్ణ‌యించింది. అదే న‌ల‌గండ్లలో గ‌జం రూ.1.50 ల‌క్ష‌లు పెట్టింది. వేలంలో గజం రేటు.. రూ.1.10 ల‌క్ష‌ల‌కు అమ్ముడైంది ఇక్క‌డి ప్లాట్లేనా? లేక మ‌రే ఇత‌ర ప్లాట్లా అనే విష‌యంలో స్ప‌ష్ట‌త లేదు. ప‌శ్చిమ హైద‌రాబాద్‌లోనే హాట్ లొకేష‌న్ అయిన న‌ల‌గండ్ల‌లో గ‌జానికి రూ.1.50 ల‌క్ష‌లుగా ధ‌ర నిర్ణ‌యిస్తే.. ఎవ‌రూ కొనుక్కోవ‌డానికి ముందుకు రాలేదు. అంటే, న‌ల‌గండ్ల‌లో గ‌జం ధ‌ర అంత లేద‌ని అనుకున్నారా? లేక మ‌రే, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల అక్క‌డ ప్లాట్లు అమ్ముడు కాలేదా? అనే విష‌యం తెలియాల్సి ఉంది.
* పొంచి ఉన్న ఆర్థిక మాంద్యం ప్రమాదం, అనూహ్యంగా పెరిగిన ప్లాట్ల ధరల కారణంగా.. ప్ర‌వాసులు ప్లాట్లు కొన‌డానికి పెద్ద‌గా ఆస‌క్తి చూపెట్ట‌డం లేద‌నే విష‌యం అర్థ‌మ‌వుతోంది. కొన్ని రియాల్టీ రిసెర్చ్ ఏజెన్సీలు మార్కెట్ మెరుగ్గా ఉంద‌ని ఎన్ని క‌థ‌నాల‌ను ప్ర‌చురితం చేసినా బ‌య్య‌ర్లు సానుకూలంగా స్పందించ‌కపోవడానికి కారణాలివే అని చెప్పొచ్చు. పైగా, ప్రస్తుతం హెచ్ఎండీఏ అమ్ముతున్న ప్లాట్లు ఎలాంటి వంకర టింకర లేకుండా ఉంటేనే ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి కొంటారు. ఆయా ప్లాట్లలో ఏమాత్రం సమస్యలున్నా పట్టించుకోవట్లేదు.

This website uses cookies.