Categories: TOP STORIES

హైద‌రాబాద్‌.. ప్రీలాంచ్ స్కాముల‌కు రాజ‌ధాని!

  • ఏడాది నుంచి దేశంలోనే ఎక్కువ
  • క‌ష్టార్జితాన్ని కోల్పోతున్న ప్ర‌జ‌లు
  • చోద్యం చూస్తున్న టీఎస్ రెరా
  • ప‌ట్టించుకోని నిర్మాణ సంఘాలు

అంత‌ర్జాతీయ న‌గ‌రంగా ఖ్యాతినార్జించాల్సిన హైద‌రాబాద్.. దేశంలోనే ప్రీలాంచ్ స్కాముల‌కు రాజ‌ధానిగా మారింది. ప‌లు రియ‌ల్ సంస్థ‌లు కొనుగోలుదారుల నుంచి కోట్ల రూపాయ‌ల్ని వ‌సూలు చేసి.. వారి నెత్తి మీదే శఠ‌గోపం పెట్టాయి. ఇదే బాట‌లో మ‌రికొన్ని సంస్థ‌లూ ఉన్నాయి. ఈ అక్ర‌మ అమ్మ‌కాల గురించి క్రెడాయ్ హైద‌రాబాద్ వంటి నిర్మాణ సంఘాల‌కు తెలిసినా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఫ‌లితంగా, ప్రీలాంచ్ స్కాములు ఒక్కొక్క‌టిగా బ‌య‌టికొస్తున్నాయి. దీంతో, దేశ‌వ్యాప్తంగా హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు ఎక్క‌డ్లేని తూట్లు ప‌డుతున్నాయి.

గ‌త ప్ర‌భుత్వం హైద‌రాబాద్ గురించి చేసిన హైప్ కార‌ణంగా.. ఇత‌ర రంగాల నుంచి అనేక‌మంది రియ‌ల్ రంగంలోకి విచ్చేశారు. ముందుగా స్థ‌ల‌మైతే తీసుకుని.. ప్రీలాంచుల్లో ప్లాట్లు, ఫ్లాట్ల‌ను విక్ర‌యించేశారు. కొనుగోలుదారుల నుంచి కోట్ల రూపాయ‌ల్ని వ‌సూలు చేశారు. త‌ర్వాత అనుమ‌తులు ఎలా తెచ్చుకోవాలో తెలియ‌క‌.. మార్కెట్ స్థితిగ‌తుల నుంచి బేరీజు వేయ‌కుండా.. అనుకున్నంతగా అప్పులు చేతికి రాక‌.. చేతిలో ఉన్న సొమ్మును ఖ‌ర్చు పెట్టేసి..

నిర్మాణం ఆరంభించాల్సిన స‌మ‌యం వ‌చ్చేస‌రికి.. ఏం చేయాలో తెలియ‌క చేతులెత్తేశారు. ఇందులో కొంద‌రు కొన్ని నెల‌ల్నుంచి క‌స్ట‌మ‌ర్ల‌కు త‌ప్పించుకుని తిరుగుతున్నారు. ఇంకొంద‌రేమో మాయ‌మాట‌లు చెబుతూ కాలం గ‌డిపేస్తున్నారు. దీంతో, చిర్రెత్తుకొచ్చిన బ‌య్య‌ర్లు పోలీసు స్టేష‌న్ల‌లో కేసుల‌ను ఫైలు చేశారు. కేసుల్ని పెట్ట‌డం వ‌ల్ల సొమ్ములు చేతికొస్తాయో లేవో తెలియ‌దు కానీ.. కొత్త‌వాళ్లు మోస‌పోకుండా ఉండేందుకు కేసుల్ని పెట్టామ‌ని కొంద‌రు బ‌య్య‌ర్లు ఆక్రోశాన్ని వెళ్ల‌గ‌క్కారు.

క్రెడాయ్ హైద‌రాబాద్ బ‌య‌టికేమో గొప్ప‌లు చెబుతుంది కానీ.. ఆయా సంఘ స‌భ్యులు చేస్తున్న ప్రీలాంచుల్ని మాత్రం అరిక‌ట్ట‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైంది. ఈ సంఘం గ‌న‌క మూడు, నాలుగేళ్ల క్రిత‌మే.. ఈ ప్రీలాంచుల్ని అరిక‌ట్ట‌డం మీద గ‌ట్టిగా ప్ర‌య‌త్నించి ఉంటే.. హైద‌రాబాద్‌లో ప్రీలాంచ్ స్కాములు గ‌ణ‌నీయంగా త‌గ్గేవి. అస‌లు ప్రీలాంచులు చేయ‌క‌పోతే బిల్డ‌ర్లే కాదనే స్థాయికి కొంద‌రు డెవ‌ల‌ప‌ర్లు చేరుకున్నారు. క్రెడాయ్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ మీత సంత‌కం పెట్టిన బిల్డ‌ర్లు..
ప్రీలాంచులు చేయ‌కూడ‌ద‌నే ఇంగిత జ్ఞానం కూడా కొంత‌మంది బిల్డ‌ర్ల‌కు లేక‌పోవ‌డం దారుణ‌మైన విష‌యం. అలా చేసే వారిని నియంత్రించాల్సిన సంఘ పెద్ద‌లు కూడా నోరు మెద‌ప‌లేదు. దీంతో, అధిక శాతం బిల్డ‌ర్లు ఇష్టం వ‌చ్చిన రేటుకు ప్రీలాంచుల్లో ఫ్లాట్ల‌ను విక్ర‌యించారు. దీని వ‌ల్ల రెరా బిల్డ‌ర్లూ తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నారు. కొల్లూరు, వెలిమ‌ల‌, కిస్మ‌త్‌పూర్ వంటి ప్రాంతాల్లో ప్రీలాంచుల వ‌ల్ల గ‌చ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్‌, కోకాపేట్‌, నార్సింగి ప్రాంతాల్లో రెరా ఫ్లాట్ల‌ను కొన‌డానికి ముందుకు రావ‌ట్లేదు. ఇదే ప‌రిస్థితి న‌గ‌ర‌మంత‌టా నెల‌కొంది.

కొన్ని స్కాములు.. క్లుప్తంగా..

హైద‌రాబాద్‌లో ప‌లు రియ‌ల్ సంస్థ‌లు ప్రీలాంచుల పేరిట ప్ర‌జ‌ల నెత్తిమీద శ‌ఠ‌గోపం పెట్టాయి. మ‌రి, ఏయే సంస్థ‌లు ఎంతెంత మేర‌కు వ‌సూలు చేసి ప్ర‌జ‌ల్ని మోసం చేశాయో.. ఈ కింది ప‌ట్టిక చూస్తే అర్థ‌మ‌వుతుంది.
సాహితీ గ్రూప్ 1500 కోట్లు
జ‌యాగ్రూప్ 300 కోట్లు
మైత్రీ ప్రాజెక్ట్స్ 100 కోట్లు
భువ‌న‌తేజ 200 కోట్లు
ఓబిలీ ఇన్‌ఫ్రా 20 కోట్లు
జేవీ ఎస్టేట్స్ 300 కోట్లు
జేజే ఇన్‌ఫ్రా 10 కోట్లు
భార‌తి బిల్డ‌ర్స్ 300 కోట్లు

జీఎస్సార్ గ్రూప్‌, పారిజాత డెవ‌ల‌ప‌ర్స్‌, ఆర్‌జే గ్రూప్‌, ఫార్చ్యూన్ 99 హోమ్స్ వంటి సంస్థ‌లు ప్రజ‌ల్నుంచి ప్రీలాంచుల పేరిట సొమ్ము వ‌సూలు చేశాయి. జీఎస్సార్ గ్రూప్‌పై ఇప్ప‌టికే పోలీసు స్టేష‌న్ల‌లో కేసులు ఫైల్ అయ్యాయి. పారిజాత డెవ‌ల‌ప‌ర్స్ కూడా ప్ర‌జ‌ల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఫార్చ్యూన్ 99 హోమ్స్ నుంచి సొమ్ము రావాలంటూ కొంద‌రు బయ్య‌ర్లు నేటికీ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. ఈ సంస్థ‌కు చెందిన ఛైర్మ‌న్‌, ఎండీలు.. కంపెనీల పేర్ల‌ను మార్చి వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు. ఆర్‌జే గ్రూప్, గాయ‌త్రి ఇన్‌ఫ్రా వంటి బాగోతాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

This website uses cookies.