Categories: LATEST UPDATES

వేర్ హౌజులకు పెరిగిన గిరాకీ

హైదరాబాద్ వేర్ హౌసింగ్ మార్కెట్ 2021లో సుమారు 3.2 మిలియన్ చదరపు అడుగుల మేరకు లావాదేవీలు జరిగాయని సిరిల్ సంస్థ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. 2020తో పోల్చితే ఈ విభాగంలో యాభై శాతం లావాదేవీలు పెరిగాయని తెలియజేసింది. ఈ- కామర్స్ సంస్థల నుంచి సుమారు 65 శాతం డిమాండ్ ఉందని.. ఎక్కువగా గిడ్డంగుల్ని తీసుకునేదీ సంస్థలేనని తాజా నివేదికను చూస్తే అర్థమవుతోంది.

ఆ తర్వాత కన్సూమర్ డ్యూరబుల్స్ సంస్థల వాటా సుమారు పదిహేను శాతం దాకా ఉంది. 3పీఎల్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా సంస్థలు వంటివి ఎక్కువ స్థలాన్ని తీసుకున్నాయి. పటాన్ చెరు, ఈదుల నాగులపల్లి, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, కల్లకల్ వంటి వాటిలో అధిక వేర్ హౌజులకు డిమాండ్ ఏర్పడింది. వ్యక్తిగత వేర్ హౌజులకే గిరాకీ ఎక్కువగా ఉందని నివేదికను చూస్తే తెలుస్తోంది.

గిడ్డంగుల అద్దె విషయానికొస్తే.. 2021తో పోల్చితే దాదాపు 3 నుంచి 5 శాతం దాకా పెరిగింది. శంషాబాద్ వైపు అధిక సంస్థలు ఆసక్తి చూపిస్తుండగా.. ఆ తర్వాతి స్థానం మేడ్చల్ కావడం గమనార్హం. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో స్థలాల ధరలు గరిష్ఠంగా 25 శాతం దాకా పెరిగింది. 2022 ఈ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సిరిల్ సంస్థ వెల్లడించింది.

This website uses cookies.