బాలీవుడ్ నటుడు జైదీప్ అహ్లావత్ ముంబైలో లగ్జరీ అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు. తన భార్య జ్యోతి హుడాతో కలిసి అంధేరి వెస్ట్ లో రూ.10 కోట్లకు అపార్ట్ మెంట్ కొన్నారు. పూర్ణ అపార్ట్ మెంట్స్ లో ఉన్న ఈ ప్రాపర్టీ 1,950 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, 2,341 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాను కలిగి ఉంది. గతనెల 22న రిజిస్ట్రేషన్ పూర్తయింది.
ఈ కొనుగోలుతోపాటు నాలుగు కార్ పార్కింగ్ స్థలాలు కూడా లభించాయి. స్టాంపు డ్యూటీ కింద రూ.60 లక్షలు, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ముంబైలోని ప్రముఖ కేంద్రాల మధ్య వ్యూహాత్మకంగా ఉన్న అంధేరి వెస్ట్.. ఆధునిక కార్యాలయ సముదాయాలు, వినోద కేంద్రాలు, ప్రీమియం రెసిడెన్షియల్ యూనిట్ల సమ్మేళనంతో శక్తివంతమైన వాణిజ్య, నివాస గమ్యస్థానంగా మారింది.
ALSO READ: కోయంబత్తూరులో మెగా టౌన్షిప్ ప్రాజెక్టును ప్రకటించిన జి స్క్వేర్ గ్రూప్
కాగా, జైదీప్ అహ్లవత్ రయీస్ (2017), రాజీ (2018) చిత్రాలలో తన పాత్రలకు గుర్తింపు పొందారు. ఇటీవల వచ్చిన నెట్ఫ్లిక్స్ చిత్రం జ్యువెల్ థీఫ్ (2025)లో సైఫ్ అలీ ఖాన్తో కలిసి కనిపించారు. మరోవైపు ఏప్రిల్లో బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ అల్కా యాగ్నిక్, ఆమె కుమార్తె స్యేష్ కపూర్ ముంబైలో రూ.11.5 కోట్లకు లగ్జరీ అపార్ట్ మెంట్ను కొనుగోలు చేశారు.
2,297 చదరపు అడుగుల ఈ యూనిట్ అంధేరి వెస్ట్ లోని ఒబెరాయ్ స్కై హైట్స్ లో ఉంది. అలాగే బాలీవుడ్ స్వరకర్త, గాయని అను మాలిక్, ఆయన భార్య అంజు మాలిక్ గతంలో ముంబైలోని శాంటాక్రూజ్ వెస్ట్ ప్రాంతంలో రెండు అపార్ట్ మెంట్లను రూ.14.49 కోట్లకు విక్రయించారు.