Categories: TOP STORIES

నాగ‌బాబు ఫోటో పెట్టి.. జేబీ ఇన్‌ఫ్రా ప్రీలాంచ్ మాయ‌!

  • ప్రీలాంచ్ ప్రచారం నిర్వహిస్తున్నందుకు
  • నాగబాబుకు రెరా నోటీసులివ్వాలి!

మంత్రి కేటీఆర్ ఎన్క‌త‌ల‌లో ఆటో మొబిలిటీ క్ల‌స్ట‌ర్ గురించి ప్ర‌క‌టించాడో లేదో.. రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌లు రంగప్ర‌వేశం చేశాయి. అక్క‌డేదో అద్భుతం జ‌రుగుతున్న‌ట్లు.. రాత్రికి రాత్రే ఆ ప్రాంత‌మంతా దుబాయ్ త‌ర‌హాలో అభివృద్ధి చెందుతుంద‌నే రీతిలో బిల్డ‌ప్ ఇస్తూ.. ప్రీలాంచ్‌లో ప్లాట్లను విక్ర‌యించే నాట‌కానికి తెర‌లేపాయి. ఒక అడుగు ముందుకేసిన జేబీ ఇన్‌ఫ్రా.. మోమిన్‌పేట్‌లో ప్రీలాంచ్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. సినీ దిగ్గజాలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబు ఫోటోను పెట్టి జేబీ ఇన్ ఫ్రా ఈ అక్రమ దందాకు తెరలేపడం దారుణమైన విషయం. మరి, తన ఫోటోను ఇలా అక్రమ అమ్మకాలకు వినియోగిస్తున్నందుకు నాగబాబు ఎలా ఊరుకుంటున్నారో అర్థం కావట్లేదు. స్వతహాగా నాగబాబుకు సినిమాలోనే కాదు బయట కూడా మంచి వ్యక్తిగా పేరున్న విషయం తెలిసిందే

జేబీ ఇన్ఫ్రా సంస్థ ఇంత‌కుముందు ఇబ్ర‌హీంప‌ట్నం, చౌటుప్ప‌ల్‌లోనూ ఎక‌రాల్లో లేఅవుట్ల‌ను విక్ర‌యించింది. అదే త‌ర‌హాలో ఇక్క‌డా డెవ‌ల‌ప్ చేస్తామ‌నే ప్ర‌క‌ట‌న‌ల వ‌ర్షం కురిపిస్తూ.. అమాయ‌కుల‌కు ప్లాట్ల‌ను అంట‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. అనుమతుల్లేని వెంచర్లలో ప్లాట్లు కొనకూడదని తెలంగాణ రెరా ఎంత మొత్తుకుంటున్నా జేబీ ఇన్ఫ్రా వంటి డెవలపర్లు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దీనికి తోడు సినీ నటులతో ప్రచార కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ప్రీలాంచ్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనల్లో కనిపించే ప్రముఖులకు రెరా నోటీసులివ్వాలని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో నటుడు నాగబాబుకూ రెరా నోటీసును ఇవ్వాలని కోరుతున్నారు.

ప్లాటుపై 10వేలు జరిమానా..

మోమిన్ పేట్లో జేబీ ఇన్ ఫ్రా ఇప్పటికే వందకు పైగా ప్లాట్లు అమ్ముడయ్యాయని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. డీటీసీపీ, రెరా అనుమతి రాక ముందే అధిక మొత్తంలో ప్లాట్లు అమ్ముతామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే, రెరా పర్మిషన్ లేకుండా ప్లాట్లను విక్రయిస్తే.. ప్రతి ప్లాటు మీద రూ.10,000 జరిమానాను విధించాకే రెరా రిజిస్ట్రేషన్ చేస్తుందనే విషయం తెలిసిందే. అదే విధంగా, మొత్తం ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానాను ముక్కుపిండి వసూలు చేస్తుందనే విషయం తెలిసిందే.

This website uses cookies.