ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు అదుర్స్

  • సెప్టెంబర్ లో 30 శాతం మేర పెరిగిన రిజిస్ట్రేషన్లు
  • నైట్ ఫ్రాంక్ నివేదికలో వెల్లడి

హైదరాబాద్ రియల్ రంగం జోరుగా దూసుకెళ్తోంది. గత నెలలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు ఏకంగా 30 శాతం మేర పెరగడమే ఇందుకు నిదర్శనం. సెప్టెంబర్ లో మొత్తం 6,185 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక వెల్లడించింది. వీటి మొత్తం విలువ రూ.3,378 కోట్లు కాగా, గతేడాది సెప్టెంబర్ తో పోలిస్తే 42 శాతం అధికం కావడం విశేషం. రిజిస్ట్రేషన్లలో ఎక్కువ శాతం (51 శాతం) రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు యూనిట్లవి కాగా.. రూ.25 లక్షల కంటే తక్కువ విలువ కలిగిన యూనిట్ల రిజిస్ట్రేషన్లు 15 శాతం ఉన్నాయి. ఇక రూ.కోటి కంటే ఎక్కువ విలువ ఉన్న ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు 9 శాతం ఉన్నాయి.

గతేడాది ఇదే నెలలో ఇది 8 శాతంగా నమోదైంది. రిజిస్ట్రేషన్లు జరిగిన ప్రాపర్టీల్లో పరిమాణం పరంగా చూస్తే వెయ్యి నుంచి 2వేల చదరపు అడుగుల మధ్య ఉన్న ఇళ్లు 71 శాతం ఉన్నాయి. 500 చదరపు అడుగుల నుంచి వెయ్యి చదరపు అడుగుల మధ్య ఉన్న చిన్న ఇళ్లు 16 శాతంగా నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్ లో ఇది 14 శాతంగా ఉంది. అదే సమయంలో 2వేల చదరపు అడుగుల కంటే పైబడిన ఇళ్లు గతేడాది సెప్టెంబర్లో 9 శాతం రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ఈ ఏడాది అది 11 శాతానికి పెరిగింది.

ఏరియాలవారీగా చూస్తే మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా రిజిస్ట్రేషన్లలో 45 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. 41 శాతంతో రంగారెడ్డి రెండో స్థానంలో ఉండగా.. 14 శాతంతో హైదరాబాద్ తర్వాతి స్థానంలో ఉంది. అలాగే ఈ ఏడాది ఆగస్టులో రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరలు 6.4 శాతం పెరిగాయి. హైదరాబాద్ లో అత్యధికంగా 14 శాతం పెరగ్గా.. మేడ్చల్-మల్కాజ్ గిరిలో 5 శాతం, రంగారెడ్డలో 3 శాతం మేర ధరలు పెరిగాయి. రెసిడెన్షియల్ ప్రాపర్టీల ఎంపికలో జనాల ప్రాధాన్యతలు కూడా మారుతున్నాయని నివేదిక వెల్లడించింది. పెద్ద గృహాల వైపు పలువురు మొగ్గు చూపిస్తుండటంతో డెవలపర్లు 3 బీహెచ్ కే యూనిట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

This website uses cookies.