Categories: Celebrity Homes

మనోజ్ బాజ్ పేయి ఇల్లు అమ్మకం

బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పేయి ముంబై మహాలక్ష్మి ప్రాంతంలోని తన అపార్ట్ మెంట్ ను విక్రయించారు. ముంబైలోని అరేబియా సముద్రం, మహాలక్ష్మి రేస్ కోర్సు వీక్షణలకు అందించే లోఖండ్ వాలా కటారియా కన్ స్ట్రక్షన్స్ అభివృద్ధి చేసిన ప్రాజెక్టులో ఈ అపార్ట్ మెంట్ ఉంది. బాజ్ పేయి దంపతులు ఈ ఫ్లాట్ ను రూ.9 కోట్లకు అమ్మినట్టు స్క్వేర్ యార్డ్స్ తెలిపింది.

విలాసవంతమైన మినర్వా అనే రెసిడెన్షియల్ టవర్లో 1247 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్ ఉంది. అలాగే 240 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు కార్ పార్కింగులు కూడా ఉన్నాయి. ఈ లావాదేవీ ఆగస్టు 16న జరిగింది. మనోజ్ బాజ్ పేయి ఈ అపార్ట్ మెంట్ ను తన భార్య షబానా బాజ్ పేయితో కలిసి 2013 ఏప్రిల్ లో 6.4 కోట్లకు కొనుగోలు చేశారు. స్టాంపు డ్యూటీ కింద రూ.32 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.30వేలు చెల్లించారు. కాగా, లోఖండ్‌వాలా కటారియా కన్‌స్ట్రక్షన్స్ అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టు 2 ఎకరాల విస్తీర్ణంలో 362 యూనిట్లతో ఉంది.

ఇందులో 3, 4 బీహెచ్ కే అపార్ట్ మెంట్లు ఉన్నాయి. వీటిలో చాల ఫ్లాట్లు అరేబియా సముద్రం మరియు మహాలక్ష్మి రేస్ కోర్స్ ఫేసింగ్ కలిగి ఉంటాయి. ఈ ప్రాజెక్టు లోయర్ పరేల్, వర్లీ, నారిమన్ పాయింట్ వంటి కీలక వ్యాపార జిల్లాలకు సమీపంలో ఉంది. మరోవైపు మనోజ్ బాజ్ పేయి ముంబైలోని ఒషివారాలోని సిగ్నేచర్ బిల్డింగ్ లో నాలుగు ఆఫీస్ యూనిట్లను గతేడాది రూ.32 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. 2023 అక్టోబర్ 4న జరిగిన ఈ లావాదేవీకి స్టాంపు డ్యూటీ కింద రూ.1.86 కోట్లు చెల్లించారు. అలాగే 2021లో అంధేరీలోని స్వంకీ ఒబెరాయ్ స్ప్రింగ్స్ లో తన భార్య షబానా రజాతో కలిసి రూ.4 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేశారు.

This website uses cookies.