Categories: TOP STORIES

ఇళ్ల సేల్స్ అదుర్స్

  • హైదరాబాద్ లో 5 శాతం మేర పెరిగిన అమ్మకాలు
  • ధరల్లోనూ 11 శాతం పెరుగుదల

హైదరాబాద్ రియల్ మార్కెట్ లో ఇళ్ల అమ్మకాలు బాగానే సాగుతున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 8,325 ఇళ్లు అమ్ముడయ్యాయి. ఇది 5 శాతం ఎక్కువ కావడం విశేషం. గతేడాది ఇదే కాలంలో 7,900 ఇళ్లు అమ్ముడుపోయాయి మరోవైపు ఇళ్ల ధరలు కూడా గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 11 శాతం పెరిగాయి. ఇక దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో మూడో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) ఇళ్ల అమ్మకాలు 12 శాతం పెరిగాయి. ఈ మూడు నెలల్లో 82,612 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 73,691గా ఉంది. నగరాలవారీగా చూస్తే ఢిల్లీలో 27 శాతం వృద్ధితో 13,981 ఇళ్లు అమ్ముడుపోయాయి. ముంబైలో 4 శాతం మేర పెరిగి 22,308 యూనిట్లు విక్రయమయ్యాయి.

బెంగళూరులోనూ 4 శాతం పెరిగి 13,619 యూనిట్లు అమ్ముడుపోయాయి. పుణెలో 20 శాతం పెరుగుదలతో 13,079 ఇళ్లు అమ్ముడయ్యాయి. చెన్నైలో 5 శాతం వృద్ధితో 3,870 యూనిట్లు అమ్ముడవగా.. కోల్ కతాలో 3,772 ఇళ్లు విక్రయమయ్యాయి. అహ్మదాబాద్ లో 6 శాతం పెరుగుదలతో 4,108 యూనిట్లు అమ్ముడయ్యాయి. విక్రయాలతోపాటే ధరల్లోనూ పెరుగుదల కనిపించింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 11 శాతం మేర ధరలు పెరగ్గా.. కోల్ కతాలో 7 శాతం, బెంగళూరు, ముంబైల్లో 6 శాతం చొప్పున, పుణెలో 5 శాతం, అహ్మదాబాద్, ఢిల్లీల్లో 4 శాతం చొప్పున, చెన్నైలో 3 శాతం మేర ఇళ్ల ధరలు పెరిగాయి. అలాగే ఇళ్ల ఇన్వెంటరీ కూడా గణనీయంగా పెరిగినట్టు తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడించింది.

This website uses cookies.