Categories: LATEST UPDATES

మూడేళ్లలో డేటా సెంటర్ల రెట్టింపు

  • 11 మిలియన్ చదరపు అడుగుల నుంచి 23 మిలియన్ చ.అ.కు చేరే అవకాశం
  • ఇందులో సగం ముంబైలోనే.. మిగిలింది చెన్నై, హైదరాబాద్ లలో..
  • కొలియర్స్ తాజా నివేదిక వెల్లడి

దేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం వచ్చే మూడేళ్లలో రెట్టింపు అవుతుందని.. ఈ విభాగంలోకి మొత్తం 10 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులు వస్తాయని కొలియర్స్ తాజా నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి 11 మిలియన్ చదరపు అడుగుల్లో డేటా సెంటర్లు ఉండగా.. 2026 నాటికి ఇవి 23 మిలియన్ చదరపు అడుగులకు చేరతాయని అంచనా వేసింది. 2023-26లో రాబోయే సరఫరాలో సగం మేర ముంబైలోనే ఉంటుందని.. మిగిలింది చెన్నై, హైదరాబాద్ లో వస్తుందని పేర్కొంది.

డేటా వినియోగం, క్లౌడ్ అడాప్షన్ లో పెరుగుదల కారణంగా 2020 నుంచి డేటా సెంటర్ల సామర్థ్యం రెండు రెట్లు పెరిగింది. దీంతో కరోనా తర్వాత ఈ విభాగం గణనీయమైన వృద్ధిని సాధించింది. 2023 ఆగస్టు నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 819 మెగావాట్ల సామర్థ్యంతో 11 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. డేటా వినియోగంలో విపరీతమైన పెరుగుదలతోపాటు ఈ విభాగంలో బలమైన పెట్టుబడుల వల్ల డేటా సెంటర్ సామర్థ్యం 2026 నాటికి 1800 మెగావాట్లను దాటుతుందని అంచనా. అలాగే ప్రస్తుతం ఉన్న 11 మిలియన్ చదరపు అడుగుల నుంచి 23 మిలియన్ చదరపు అడుగులకు చేరుతుందని భావిస్తున్నారు.

ఇక నగరాలవారీగా చూస్తే.. డేటా సెంటర్ హబ్ గా ముంబై తన హవా కొనసాగించనుంది. దేశంలోని డేటా సెంటర్ల సామర్థ్యంలో సగానికి పైగా ఇక్కడే ఉంది. రాబోయే మూడేళ్లలో వచ్చే కొత్త సరఫరాలోనూ సగం ఇక్కడే రానుందని అంచనా. సబ్ మెరైన్ కేబుల్ కనెక్టివిటీ, ల్యాండింగ్ స్టేషన్లు, ఇంటర్నెట్ ఎక్స్ఛేంజీల కారణంగా ముంబైనే ఎక్కువ మంది ఎంచుకుంటారని భావిస్తున్నారు. అలాగే చెన్నై, హైదరాబాద్ లు కూడా ఈ విభాగంలో వృద్ధి చూసే అవకాశం ఉంది. డేటా సెంటర్ల విస్తరణకు టైర్1 నగరాలే ప్రాధాన్య స్థానాలు కాగా, టైర్2 నగరాలు కూడా స్థిరమైన వృద్ధిని సాధిస్తున్నాయి. ప్రస్తుతం టైర్2 నగరాలు దేశంలోని మొత్తం డేటా సెంటర్ల సామర్థ్యంలో నాలుగు శాతం మాత్రమే కలిగి ఉన్నాయి. అయినప్పటికీ కీలకమైన డేటా సెంటర్ ఆపరేటర్లు అహ్మదాబాద్, జైపూర్, కొచ్చి, నాసిక్, విజయవాడ, భువనేశ్వర్ వంటి బహుళ నగరాల్లో ఎడ్జ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నగరాలను విపత్తు పునరుద్ధరణ ప్రదేశాలుగా భావిస్తున్నారు.

This website uses cookies.