Categories: TOP STORIES

స్థిర నివాసానికి సిద్దిపేట్

హైదరాబాద్లో అపార్టుమెంట్ల నిర్మాణం అధిక వ్యయం కావడం.. తెలంగాణ‌లోని ప‌లు ప‌ట్ట‌ణాలు భాగ్యనగరానికి ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చెందుతుండ‌టం.. ఆయా ప‌ట్ట‌ణాల్లోనూ నాణ్య‌మైన గృహాల‌కు డిమాండ్ పెర‌గడం.. వంటి అంశాల కార‌ణంగా న‌గ‌రానికి చెందిన కొంద‌రు బిల్డ‌ర్లు.. తెలంగాణలోని ద్వితీయ, తృతీయ శ్రేణీ ప‌ట్ట‌ణాల్లో ల‌గ్జ‌రీ క‌ట్ట‌డాల్ని చేప‌ట్టేందుకు ప్ర‌ణాళికలు ర‌చిస్తున్నారు.

సిద్దిపేట్లో ఐటీ టవర్ ఏర్పాటు కాక ముందే, నాలుగు అమెరికా సంస్థలు ప్రభుత్వంతో అంగీకారం కుదుర్చుకోవడంతో హైదరాబాద్ బిల్డర్ల దృష్టి సిద్దిపేట్ మీద పడింది. అసలెందుకు, అమెరికా సంస్థలు సిద్దిపేట్లో ఐటీ కార్యలాపాల్ని ఆరంభించేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయని పరిశీలిస్తే.. సిద్దిపేట్ కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హైద‌రాబాద్ త‌ర్వాత సిద్దిపేట్‌లో ఐటీ ట‌వ‌ర్ ఏర్పాటు చేయ‌డానికి అమెరికాకు చెందిన నాలుగు ఐటీ సంస్థ‌లు ముందుకు రావ‌డం.. రాష్ట్ర ఐటీ శాఖ‌తో అంగీకారం కుదుర్చుకోవ‌డంతో దేశంలోని నిర్మాణ సంస్థ‌ల దృష్టి ఈ ప‌ట్ట‌ణం మీద ప‌డింది. కేంద్రం నిర్వ‌హించే స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ వంటి అనేక జాతీయ స్థాయి ర్యాంకింగుల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సిద్దిపేట్ పేరు త‌ప్ప‌కుండా ఉండాల్సిందే. ఆ స్థాయిలో ఈ పట్టణ రూపురేఖల్ని మార్చివేసిన ఘనత మంత్రి హరీష్ రావుదేనని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు.

కొండపోచమ్మ, రంగనాయక, మల్లన్నసాగర్ వంటి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో సిద్దిపేట్ కు గణనీయమైన డిమాండ్ పెరిగింది. కోమటి చెరువు, సస్పెన్షన్ బ్రిడ్జి వంటివి ఏర్పాటు చేయడంతో పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుందీ ప్రాంతం. ఇలాంటి అనేక అంశాల కార‌ణంగా, హైద‌రాబాద్‌కి చెందిన పలు నిర్మాణ సంస్థ‌లు సిద్దిపేట్‌లో ల‌గ్జ‌రీ అపార్టుమెంట్ల‌ను నిర్మించ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నాయి.

  • సిద్దిపేట్ హైదరాబాద్ నుంచి కేవలం వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజీవ్ రహదారి మీదుగా సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు.
  • రాజీవ్ రహదారికి చేరువలోని దుద్దెడలో ఐటీ టవర్ ఏర్పాటు కానుంది. ఇక్కడివరకూ నాలుగు వరుసల రహదారిని డెవలప్ చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.
  • ఐటీ టవర్ నిర్మించేందుకు రూ.45 కోట్లను కేటాయించారు. ఇది పూర్తయితే ఎంతలేదన్నా రెండు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
  • సిద్దిపేట్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా డెవలప్ అవుతున్నాయి. కొత్తగా రూ.600 కోట్ల అంచనా వ్యయంతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
  • సిద్దిపేట్ ను దేశంలోనే మోడల్ టౌనుగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగానే ఈ పట్టణం రూపురేఖ‌లు పూర్తిగా మారిపోతున్నాయి.
  • పర్యాటకాన్ని డెవలప్ చేసేందుకు రూ.100 కోట్లు కేటాయించారు. రంగనాయక సాగర్ రిజర్వాయర్ మధ్యలో గల 65 ఎకరాల పల్లగుట్ట ఐలాండ్లో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
  • ఇటీవ‌ల కోమటిచెరువుని అభివృద్ధి చేసిన తీరును చూసి సీఎం కేసీఆర్ ఆశ్చర్యపోయారు. ఆయా పనుల్ని చేపట్టిన సిబ్బందిని అభినందించిన విషయం తెలిసిందే. ఎల్ ఈడీ లైటింగ్, వాకింగ్ ట్రాక్, రోడ్డుతో పాటు ఇతర పనుల నిమిత్తం అదనంగా రూ.25 కోట్లు కేటాయించారు.
  • గజ్వేల్ తరహాలో.. రెండు వేల సీటింగ్ సామర్థ్యం గల ఆడిటోరియంతో పాటు ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్, మీట్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నారు.
  • సిద్దిపేట్లో అక్షరాస్యత శాతం.. దాదాపు 78.48 దాకా ఉంటుంది. అందుకే, ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు న‌గ‌రాన్ని ప‌రిశుభ్రంగా ఉంచుకుంటున్నారు. ఇందుకు సిద్దిపేట్ మున్సిపాలిటీ ప్ర‌త్యేకంగా కృషి చేస్తోంది. ఎక్కడా కాలుష్యం అనేది లేకుండా అతిసుందరంగా కనిపిస్తుంది.
  • ప్ర‌ధాన ర‌హ‌దారి నుంచి సిటీలోకి ప్ర‌వేశించేట‌ప్పుడు రోడ్డు మ‌ధ్య ప్రాంతాన్ని హైద‌రాబాద్‌తో స‌మానంగా.. ఆహ్లాద‌క‌రంగా తీర్చిదిద్దారు.

అంద‌మైన‌ క‌మ్యూనిటీకి స‌న్నాహాలు

సిద్దిపేట్ ప్రజలు నాణ్యమైన గృహాల్ని కోరుకుంటున్నారని మా సర్వేలో అర్థమైంది. పైగా, మంత్రి హరీష్ రావు ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ కంటే ధీటుగా డెవలప్ చేస్తున్నారు. ఆయ‌న కృషి వ‌ల్ల ఈ న‌గ‌రం జాతీయ స్థాయిలో అనేక ర్యాంకింగుల్ని అందుకుంది. పైగా, సిద్దిపేట్‌ను అందంగా తీర్చిదిద్దు తీరును చూస్తే ఎంతో ముచ్చ‌టేస్తుంది.

అందుకే, చాలామంది సిద్దిపేట్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. ఇలాంటి సానుకూలాంశాల్ని పరిగణలోకి తీసుకుని.. కోమటి చెరువు సమీపంలో ఒక ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. దాదాపు ఎకరం స్థలంలో లగ్జరీ ఫ్లాట్లను కట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే మున్సిపాలిటీ అనుమతి కూడా లభించింది.- కిశోర్ గుంటుపల్లి, ఎండీ, ఆల్సేస్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌.

This website uses cookies.