Categories: TOP STORIES

అమీన్ పూర్ ఆక్రమణలను అడ్డుకోండి

  • హైడ్రాకు పలువురి ఫిర్యాదు
  • రంగంలో దిగి ఆక్రమణల్ని
    తొలగించిన అధికారులు

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 119 నుంచి 220 వరకు ఉన్న 408 ఎకరాల భూముల్లో అక్రమంగా అమ్మకాలు జరుగుతున్నాయని పేర్కొంటూ హైడ్రా కమిషనర్ కు పలువురు ఫిర్యాదు చేశారు. గతంలో దాదాపు 3800 మంది అక్కడ గ్రామపంచాయతీ లేఔట్ లో ఇంటి స్థలాలు కొని రిజిస్టర్ చేసుకున్నారని పేర్కొన్నారు. ఆ భూమి ప్రభుత్వానిది అని తేలిస్తే.. తామంతా కోర్టును ఆశ్రయించామని వివరించారు. దీనిపై హైకోర్టు స్టే ఇచ్చినా.. అక్కడి వ్యక్తులు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి ఇంటి స్థలాలుగా అమ్మేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు 700కి పైగా ఇళ్ల నిర్మాణం జరిగిందని.. ప్రభుత్వ శాఖలు కూడా కరెంటు, తాగునీరు, రహదారుల సౌకర్యం కల్పిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో హైడ్రా జోక్యం చేసుకోవాలని కోరారు.

మరోవైపు అమీన్ పూర్ పెద్ద చెరువు ప్రాంతంలో ఆక్రమణలు జరిగాయని ప్రజావాణిలో పలు ఫిర్యాదు అందాయి. ఈ నేపథ్యంలో హైడ్రా రంగంలోకి దిగింది. పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఓ రాజకీయ నాయకుడు చెరువు సమీపంలోని తమ ప్లాట్లను ఆక్రమించుకుని లేఔట్ అభివృద్ధి చేశారని ఫిర్యాదులు వచ్చినట్టు హైడ్రా తెలిపింది. ‘సదరు రాజకీయ నాయకుడు ఆ ప్లాట్లను అక్రమంగా అమ్మేసినట్టు భూ యజమానులు చెప్పారు. ఈ ఆక్రమణలపై 2006 నుంచి న్యాయ పోరు చేస్తున్నట్టు వెల్లడించారు’ అని తెలిపింది. మూడు నెలల క్రితం అధికార యంత్రాంగం అక్కడ కూల్చివేతలు చేపట్టింది. అనంతరం సదరు రాజకీయ నాయకుడు మళ్లీ ఫెన్సింగ్ వేయించారు. దీంతో అధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి.. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

This website uses cookies.