Categories: TOP STORIES

రెండు కంపెనీల్లో.. వాల్టన్ స్ట్రీట్ పెట్టుబడి

హైదరాబాద్‌కు చెందిన రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలలో ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న వాల్టన్‌ స్ట్రీట్‌ ఇండియా పెట్టుబడులు పెట్టింది. మూసాపేట, గౌడవల్లి ప్రాంతాలలో నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లలో వాల్టన్‌ స్ట్రీట్‌ బ్లాక్‌సాయిల్‌ స్ట్రక్చర్డ్‌ డెట్‌ రూపంలో రూ.80 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలిసింది. అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ వాల్టన్‌ స్ట్రీట్‌ క్యాపిటల్‌ అనుబంధ కంపెనీయే వాల్టన్‌ స్ట్రీట్‌ ఇండియా.

దేశీయ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు వాల్టన్‌ స్ట్రీట్‌ రియల్‌ ఎస్టేట్‌ డెట్‌ ఫండ్‌–1ను ఏర్పాటు చేసింది. దీన్ని ముంబైకు చెందిన బ్లాక్‌సాయిల్‌ గ్రూప్‌ నిర్వహణ చేస్తుంది. 2018లో వాల్టన్‌ స్ట్రీట్‌ రియల్‌ ఎస్టేట్‌ డెట్‌ ఫండ్‌–1 కుటుంబ వ్యాపారాలు, హైనెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ)ల నుంచి రూ.320 కోట్ల ఫండ్‌ను సమీకరించింది.‘‘17 శాతం వడ్డీ రేటుతో బ్లాక్‌సాయిల్‌ రుణాన్ని అందించింది. ఇది బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలు అందించే వడ్డీ రేట్ల కంటే చాలా ఎక్కువ’’ అని రుణ గ్రహీత అయిన ఓ నిర్మాణ సంస్థ ఎండీ తెలిపారు. వడ్డీ రేట్లు తగ్గిస్తే మరింత మంది డెవలపర్లు ప్రాజెక్ట్‌ ఫండ్‌ను తీసుకునేందుకు ముందుకొస్తారని సూచించారు.

బేగంపేటలో ప్రధాన కార్యాలయం ఉన్న నిర్మాణ సంస్థ ఇప్పటివరకు నగరంలో 45 లక్షల చ.అ. ప్రాజెక్ట్‌లను పూర్తి చేసింది. ప్రస్తుతం గౌడవల్లిలో 80 ఎకరాల్లో టౌన్‌షిప్‌ను నిర్మిస్తుంది. అలాగే జూబ్లిహిల్స్‌ ప్రధాన కార్యాలయం ఉన్న నిర్మాణ సంస్థ హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై నగరాల్లో 65 లక్షల చ.అ. రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసింది. ప్రస్తుతం 2 కోట్ల చ.అ. ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. గతంలో ఈ నిర్మాణ సంస్థలో గోల్డ్‌మన్‌ సాచ్స్‌ కూడా పెట్టుబడులు పెట్టింది.

This website uses cookies.