Categories: TOP STORIES

బిల్డర్ల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్రంలో నిర్మాణ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. నిర్మాణ రంగానికి ప్రాధాన్యత ఇస్తామని, బిల్డర్ల సమస్యలు పరిష్కరించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆదివారం నిర్వహించిన ‘సైబరాబాద్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌’ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి ఉత్తమ్‌ హాజరయ్యారు. పీఏసీ ఛైర్మన్‌ అరికెపూడి గాంధీ, సీఎం సలహాదారు వేం నరేంద్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్​ మాట్లాడారు. హైదరాబాద్‌ అభివృద్ధికి బిల్డర్లు కృషి చేయాలని కోరారు.

పెట్టుబడులకు అనుకూలంగా ఫ్యూచర్‌ సిటీని తీసుకొస్తున్నామని, మూసీ ప్రక్షాళన చేపట్టి పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, సైబరాబాద్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌కు మేం మరింత భరోసా ఇస్తున్నామన్నారు. నిర్మాణ రంగంలో మరింత లాభాలు వచ్చేలా అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని సూచించారు. హైదరాబాద్​ భవిష్యత్తును చూసి మరిన్ని భవనాలు నిర్మించాలని, ప్రభుత్వంలో బిల్డర్స్‌ ఎప్పటికీ భాగస్వాములుగానే ఉంటారని హామీ ఇచ్చారు.

రాష్ట్ర అభివృద్ధిలో బిల్డర్ల పాత్ర ఎప్పటికీ ఉంటుందని, ఈ విషయంలో తప్పుడు ప్రచారం నమ్మవద్దని మంత్రి కోరారు. అభివృద్ధిలో పాలుపంచుకునే ప్రతి వర్గానికి ప్రజా ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని, గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి బయటపడేందుకు చాలా కష్టపడుతున్నామని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ (సీబీఏ)ను మంత్రి అభినందించారు. రియల్ ఎస్టేట్ ఎకోసిస్టమ్ పురోగతి, ప్రభుత్వ సహకారాన్ని ప్రస్తావిస్తూ దీనిలో సీబీఏ ఒక మైలురాయిగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

ALSO READ: ప్రాజెక్టు జాప్యం.. రిఫండ్ ఇవ్వాలని రెరా ఆదేశం

అయితే, 2023తో పోలిస్తే గత ఏడాది హైదరాబాద్​లో ఆస్తుల రిజిస్ట్రేషన్లు పెరిగాయని, గత ఐదేళ్లలో నగరంలో ఆఫీస్ స్పేస్ లావాదేవీలు కూడా భారీగా పెరిగినట్లు ఈ సమావేశంలో వెల్లడించారు. రిటైల్ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్తపేట, నల్లగండ్ల, కొంపల్లి వంటి సబర్బన్ రిటైల్ కారిడార్లలో పెరుగుదల కనిపించిందని, ఈ నిర్మాణపరమైన లావాదేవీల్లో జూబ్లీహిల్స్ ఏరియా ప్రముకంగా ఉందని, ఆఫీస్​ స్పేస్, కార్యాలయ అద్దె ల్లో కూడా జుబ్లీ హిల్స్ కు రికార్డు దక్కిందని అభిప్రాయపడ్డారు. అయితే, కేవలం హైదరాబాద్​ మాత్రమే కాకుండా రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో అభివృద్ధిని ప్రోత్సహించడంలో తమమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు. వ్యాపార, వాణిజ్యంలో బిల్డర్లు, నిర్మాణ రంగంలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ శేఖర్ మాట్లాడుతూ చారిత్రాత్మక ప్రాజెక్టులతో హైదరాబాద్​సుస్థిర అభివృద్ధికి బాటలు వేసిందని, సీబీఏలో సృజనాత్మకత, సుస్థిరతతో పాటు సభ్యులంతా కలిసి అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నామన్నారు. తమకు అండగా ఉంటున్న ప్రతి ఒక్కరిని తాము గుర్తు పెట్టుకుంటామన్నారు. సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరవింద్ ఘోష్ మాట్లాడుతూ ఈ వార్షిక వేడుక తమ సంఘంలో సభ్యుల భాగస్వామ్యం, స్పూర్తికి పురోగతిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహకారంతో అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

This website uses cookies.